త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ప్ర‌పంచంతో తెలంగాణ పోటీ : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | వ్యాక్సిన్ల త‌యారీలో రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్‌ను జీవ‌వైజ్ఞానిక రాజ‌ధానిగా ఎద‌గాల‌ని, ఇందులో భాగ‌స్వాములు కావాల‌ని ప్ర‌పంచ దిగ్గ‌జ కంపెనీలు, శాస్త్రవేత్త‌ల‌కు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్‌లో ప్రతిష్ఠాత్మకమైన 23వ బయో ఏషియా ) అంతర్జాతీయ సదస్సును ప‌రిశ్ర‌మ‌ల మంత్రితో దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో క‌లిసి సీఎం ప్రారంభించారు.

P

Telangana | Published On Feb 17, 2026, 3.24 pm IST

CM Revanth Reddy | ప్ర‌పంచంతో తెలంగాణ పోటీ : సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

CM Revanth Reddy | వ్యాక్సిన్ల త‌యారీలో రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్‌ను జీవ‌వైజ్ఞానిక రాజ‌ధానిగా ఎద‌గాల‌ని, ఇందులో భాగ‌స్వాములు కావాల‌ని ప్ర‌పంచ దిగ్గ‌జ కంపెనీలు, శాస్త్రవేత్త‌ల‌కు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్‌లో ప్రతిష్ఠాత్మకమైన 23వ బయో ఏషియా ) అంతర్జాతీయ సదస్సును ప‌రిశ్ర‌మ‌ల మంత్రితో దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో క‌లిసి సీఎం ప్రారంభించారు. ప్రధానంగా ‘టెక్‌బయో అన్‌లీష్డ్ - ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రపంచస్థాయి సదస్సులో సీఎం మాట్లాడుతూ తెలంగాణ మిగ‌తా రాష్ట్రాల‌తో కాకుండా ప్ర‌పంచంలోని అగ్ర‌గామి క్ల‌స్ట‌ర్స్‌తో పోటీప‌డుతోంద‌న్నారు.

ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఉంట‌ది..

ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిన హైదరాబాద్‌ను అంద‌రం క‌లిసి సమగ్ర జీవవిజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదామన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుంద‌న్నారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని నుంచి ప్రపంచ జీవవైజ్ఞానిక రాజధానిగా హైదరాబాద్ ఎదుగుతోంద‌ని, ఇందులో భాగస్వాములు కావాల‌ని కోరారు. జీవవైజ్ఞానిక రంగంలో ప్రస్తుతం వస్తున్న ఆధునిక మార్పులను గమనిస్తే, పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవ‌స‌ర‌మ‌న్నారు. ఆయా సంస్థలు, కార్పొరేట్లు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్తు కోసం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నార‌ని, ఆ వాతావరణాన్ని తెలంగాణ అందిస్తుంద‌న్నారు. అందుకు హైదరాబాద్ అనుకూలమైంద‌ని, బల్క్‌డ్రగ్స్ నుంచి బయాలజిక్స్ వరకు, తయారీ నుండి ఆవిష్కరణ వరకు, భార‌త్ నుంచి ప్రపంచస్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోంద‌న్నారు.

విజ‌యంలో యువ‌త భాగ‌స్వామ్యం..

తెలంగాణలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని, జీసీసీల‌ను స్థాపించాల‌ని, ఆవిష్క‌ర‌ణ కేంద్రాల‌ను నిర్మించాల‌ని, మాలిక్యూల్స్ , ఔషధాలను డిజైన్, క్లినికల్ అనలిటిక్స్‌ని ప్రారంభించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఏఐ ప్లాట్‌ఫామ్‌లను, డిజిటల్ తయారీ రంగాలను ముందుకు తీసుకెళ్లాల‌ని.. అందుకు ప్రభుత్వం, యంత్రాంగం, శాస్త్రవేత్తలు, నైపుణ్యంతో కూడిన యువత మీ విజయంలో భాగ‌స్వాములుగా ఉంటార‌న్నారు. తెలంగాణ‌లో రెండేళ్ల‌లో జీవ‌న విజ్ఞాన‌రంగంలో రూ.73వేల కోట్ల‌కుపైగా పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని.. ఇటీవ‌ల దావోస్‌లో జ‌రిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా తెలంగాణ నూతన లైఫ్ సైన్సెస్ పాలసీని ప్ర‌క‌టించామ‌న్నారు.

2047 నాటికి మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా..

జినోమ్ వ్యాలీని విస్త‌రించామ‌ని, ప్రపంచ స్థాయి పరిశోధనలు, ఆవిష్కరణల కోసం వన్-బయోను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. జీవవైజ్ఞానిక రంగంపై మా ఆలోచనలను తెలంగాణతో పాటు మీ అందరితో పంచుకుంటున్నామ‌ని.. తాము ఇటీవ‌ల తెలంగాణ రైజింగ్ 2047 విజ‌న్‌ను ఆవిష్క‌రించామ‌ని.. 2034 నాటికి వ‌న్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నది త‌మ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 500 ప్రముఖ సంస్థలు, దాదాపు 4వేల మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, హెల్త్‌కేర్ రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ సదస్సులో పాల్గొన్నారు.

Advertisement
Advertisement