త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంతే జ‌ల‌ద్రోహి: హ‌రీశ్‌రావు

Harish Rao | గోదావరి బనకచర్లతో జల దోపిడికి ప్రయత్నం చేసి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh)కు నష్టాన్ని తగ్గించడం కోసం బనకచర్ల నుంచి నల్లమల సాగర్ కు మార్చుకున్నార‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. అది బనకచర్ల అయినా నల్లమలసాగర్ అయినా జరిగేది తెలంగాణ (Telangana) జల దోపిడీయేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. కత్తి చంద్రబాబుది అయినా పొడిచే వాడు రేవంతేన‌ని ధ్వ‌జ‌మెత్తారు. ముమ్మాటికీ రేవంతే జ‌ల‌ద్రోహి అని స్ప‌ష్టం చేశారు.

A

Telangana | Published On Dec 30, 2025, 6.50 pm IST

Harish Rao | రేవంతే జ‌ల‌ద్రోహి: హ‌రీశ్‌రావు
Advertisement

బీఆర్ఎస్ ర‌ణ‌భేరితోనే బ‌న‌క‌చ‌ర్ల ఆగింది
ఉద్య‌మ‌కారుల‌పై రైఫిల్ ఎక్కుపెట్టిన ఘ‌న‌త రేవంత్‌రెడ్డిది
సోనియాను బలిదేవత అని తిట్టిన‌ వీరకాంగ్రెస్ వాది
చంద్ర‌బాబు దాసుడు ఆదిత్యానాథ్ దాస్ ఇప్ప‌డు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు
ఆయ‌నే నీటిదోపిడీపై వేసిన క‌మిటీకి చైర్మెన్‌
చేయాల్సింది జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుని బాబుకు దాసోహం కాదు
ఢిల్లీకి వెళ్లి ధ‌ర్నా చేయాలి
తెలంగాణ భ‌వ‌న్‌లో విలేక‌రుల స‌మావేశంలో మాజీ మంత్రి హ‌రీశ్‌

Harish Rao | గోదావరి బనకచర్లతో జల దోపిడికి ప్రయత్నం చేసి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh)కు నష్టాన్ని తగ్గించడం కోసం బనకచర్ల నుంచి నల్లమల సాగర్ కు మార్చుకున్నార‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. అది బనకచర్ల అయినా నల్లమలసాగర్ అయినా జరిగేది తెలంగాణ (Telangana) జల దోపిడీయేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. నల్లమలసాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు (Chandrababu), పాత్ర దారి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అని మండిప‌డ్డారు. కత్తి చంద్రబాబుది అయినా పొడిచే వాడు రేవంతేన‌ని ధ్వ‌జ‌మెత్తారు. ముమ్మాటికీ రేవంతే జ‌ల‌ద్రోహి అని స్ప‌ష్టం చేశారు. అస‌లు ఆయ‌న తెలంగాణ‌కు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడా లేక చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నడా? అని ప్ర‌శ్నించారు. బనకచర్ల ముప్పును ముందుగా పసిగట్టి రణభేరి మోగించిందే బీఆర్ఎస్సే (BRS) న‌ని గుర్తు చేశారు. తాను ముల్లుకర్ర కాదు బల్లెం పెట్టి పొడిస్తే గాని ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేవలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి, ఎప్పటికప్పుడు హెచ్చరించినా ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించలేదని వాపోయారు. బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ పోరాటం చేసిందని, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పాత డేట్లు వేసి లెటర్లు విడుదల చేసిండని చెప్పారు. తాము పోరాటం చేస్తున్న సమయంలో కేంద్రంప్ర‌భుత్వం ఢిల్లీలో ఏపీ, తెలంగాణతో స‌మావేశం పెట్టింద‌ని పేర్కొన్నారు. పోను పోను అనుకుంటూనే ఆ స‌మావేశానికి ఉరికిండ‌ని మండిప‌డ్డారు. అపెక్స్ మీటింగ్ కు కాకుండా వేరే ఏ రకమైన సమావేశానికి హాజరు కావొద్దని తాము ఆనాడు గట్టిగా హెచ్చరించామ‌న్నారు. పోను అనుకుంటూనే పోయి కూసున్నడని, పెట్ట పెట్ట అనుకుంటనే సంతకం పెట్టిండని ధ్వ‌జ‌మెత్తారు. తాము నిలదీస్తే, నిలబెట్టి కడిగేస్తే మీటింగ్ ఎజెండాలో బనకచర్ల లేనే లేదని, కనుక చర్చ జరిగే ప్రసక్తే లేదని డైలాగులు దంచిండని విమ‌ర్శించారు. తాము ఎజెండా బయట పెట్టి బట్టలిప్పినమ‌ని, బట్టబయలు చేసినమ‌న్నారు. మ‌రోవైపు ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా బండారం బయట పెట్టిండని చెప్పారు. బనకచర్లపై చర్చ జరిగిందని, ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేసేందుకు కమిటీ ఏర్పాటు అయ్యిందని మీడియా ముఖంగా చెప్పిండని గుర్తు చేశారు. బనకచర్లను బంద్ పెడుతున్నమ‌ని పేరుకు ఏపీ ప్రకటించిందని, కానీ అది కూడా త‌న ప్రతాప‌మేన‌ని రేవంత్‌, ఉత్త‌మ్ ఇద్ద‌రూ డ‌బ్బా కొట్టుకున్నార‌ని మండిప‌డ్డారు.

రేవంత్ రెడ్డి ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కు పెట్టి ఉద్యమకారున్ని అని చెప్పుకుంటాడ‌ని హ‌రీశ్ ఎద్దేవా చేశారు. సోనియా గాంధీని బలిదేవత అని తిట్టి వీర కాంగ్రెస్ వాదిని అంటడని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామకపత్రాలు ఇచ్చి ఉద్యోగాలు నేనే ఇచ్చిన అంటున్న‌డ‌ని చెప్పారు. బనకచర్ల మీద జంగ్ సైరన్ ఊది పోరాటానికి దిగింది తాము అయితే, ఆపింది తామని జబ్బలు చరుచుకున్నడని ఆరోపించారు.

పేరుకు మాత్రమే వాళ్లు ప్రాజెక్టు ఆపుతున్నం అని ప్రకటించారని, కానీ ఆప‌లేద‌న్నారు. పోలవరం నుంచి బనకచర్లలో కలపకుండా, పోలవరం నల్లమల సాగర్ కు లింకు చేసారని చెప్పారు. గోదావరి నీళ్లు కృష్ణా ద్వారా తరలిస్తే, గోదావరి అవార్డు ప్రకారం, 45:21:14 తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణాలో నీటి వాటా ఇవ్వాల్సి ఉంటుందని వివ‌రించారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఈ రూల్ వర్తిస్తుందన్నారు. ఈ విధంగా కూడా తెలంగాణకు నీటి వాటా దక్కకుండా ఉండేందుకు కృష్ణాలో కలుపకుండానే, పెన్నా బేసిన్ కు గోదావరి నీటిని తరలించే పెద్ద కుట్రకు రేవంత్ రెడ్డి తెర‌తీశార‌ని ఆరోపించారు. నిజానికి పోలవరం బనకచర్ల విషయంలో కర్ణాటక, మహారాష్ట్రలు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాసాయని చెప్పారు. వ‌ర‌ద జ‌లాలపై ప్రాజెక్టు నిర్మించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అనుమ‌తిస్తే, త‌మ‌కు కూడా అనుమ‌తి ఇవ్వాల‌ని, త‌మ వాటా నీళ్ల‌ను తాము ఆపుకుంటామ‌ని ఆ రెండు రాష్ట్రాలు స్ప‌ష్టం చేశౄయ‌ని వివ‌రించారు. మరో వైపు తెలంగాణకు 45 నిష్పత్తిలో వాటా దక్కుతుంది. ఈ వాటా తెలంగాణతో సహా ఏ రాష్ట్రానికి దక్కకుండా చేసేందుకు, గంపగుత్తగా నీళ్లు తరలించేందుకు పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టుకు ఏపీ భారీ స్కెచ్ వేసిందని ఆరోపించారు. ఈ ప్లాన్ కర్ణాటక, మహారాష్ట్రకు అర్థం అయ్యిందని, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం అర్థం కాలేదని చెప్పారు.
రేవంత్‌రెడ్డి అస‌లు ఢిల్లీ మీటింగ్‌కు పోనన్నాడని, చ‌ర్చే లేద‌న్నాడ‌ని, క‌మిటీ లేద‌న్నాడ‌ని గుర్తు చేశారు. ఇప్పుడు క‌మిటీ వేసిండ‌ని చెప్పారు. ఏపీ కమిటీ వేస్తే, రేవంత్‌ రెడ్డి కూడా కమిటీ వేసిండని, కేంద్ర ప్రభుత్వానికి పేర్లు కూడా సూచించిండని పేర్కొన్నారు. ఈ నెల 15న‌ చంద్రబాబు కమిటీ వస్తే, 23న రేవంత్ కూడా కమిటీ వేసిండని చెప్పారు. ఆ కమిటీకి చంద్రబాబు దాసుడు, ఆయ‌న‌ సూచించిన వ్యక్తి ఆదిత్యానాథ్ దాస్ అని అన్నారు. దోపిడీ దారుల ఏజెంటు.. ఏపీకి నమ్మిన బంటు.. ఇప్పుడు.. నీకు సలహాదారుడు, తెలంగాణకు వెన్నుపోటు దారుడు.. ఘనత వహించిన ఆదిత్యానాథ్ దాస్ అని ఎద్దేవా చేశారు. అడుగడుగునా తెలంగాణ ఆకాంక్షలు, నీటి హక్కులకు అడ్డంపడ్డ సైంధవుడు ఇదే ఆదిత్యానాథ్ దాస్ అని మండిప‌డ్డారు. తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కకుండా ఎట్లా చేయవచ్చో ఆంధ్రా ప్రభుత్వానికి నేర్పించింది ఇదే ఆదిత్యానాథ్ దాస్ అని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వ పక్షాన అత్యంత శ్రద్దగా 100కి పైగా లేఖలు సంధించింది ఇదే ఘనత వహించిన ఆదిత్యానాథ్ దాసేన‌ని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పనులను ఏపీ వేగంగా పూర్తి చేసేందుకు తోడ్పాడు అందించింది, ఏపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో రాష్ట్ర విభజన చట్టానికి ట్రిబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా పోలవరం విస్తరణ పనులు చేపట్టి, సామర్థ్యానికి మించి గోదావరి జలాలు తరలించే కుట్రలు చేసింది ఈ ఆదిత్యానాథ్ దాసేన‌ని వివ‌రించారు.

పోలవరం బనకచర్ల, పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టులకు తెరవెనుక సూత్రధారి ఆదిత్యానాథ్ దాసేన‌ని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలతోనే రేవంత్‌ రెడ్డి ఈ ఆదిత్యానాథ్ దాస్‌ను నీటి పారుదల శాఖ సలహాదారుడిగా నియమించుకున్నారనేది స్పష్టంమైంద‌ని అన్నారు. ఆదిత్యానాథ్ దాస్ చంద్రబాబుకు దాసుడు అన్నది వాస్తవమ‌ని చెప్పారు. అసలు కమిటీనే వేయొద్దంటే, కమిటీ వేసి, ఆ కమిటీలో ఆదిత్యానాథ్ దాస్‌ను చైర్మెన్ చేశార‌ని విమ‌ర్శించారు. ఇది దొంగకు తాళం ఇచ్చినట్లే కదా అని వ్యాఖ్యానించారు. రేవంత్ కోవర్టు అనడానికి ఇంతకంటే సాక్షం ఏం కావాలని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి మాత్రమే కాదు, జల ద్రోహి కూడాన‌ని మండిప‌డ్డారు. ఏపీ ప్రభుత్వం ఈ నెల 11 చివరి తేదీగా టెండర్ వేస్తే, అది అయిపోయాక తెలంగాణ ప్రభుత్వం 16న‌ కోర్టుకు వెళ్లిందని చెప్పారు. ఈ కేసు నీరు కార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 23న కమిటీ వేసిందన్నారు.

ఒక పక్క కేసు వేస్తారు, మరో పక్క కమిటీ వేసి కేసు వీగిపోయేందుకు వాళ్లే మార్గం సృష్టించార‌ని విమ‌ర్శించారు. నీళ్ల వివాదంపై ప‌ర‌స్ప‌రం చ‌ర్చించుకోవాల‌ని న్యాయ‌స్థానం ఆదేశిస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దీనిని పూర్తి డ్రామాగా అభివ‌ర్ణించారు. కొట్టినట్లు ఉండాలె దెబ్బ తాకద్దు అన్న చందంగా రెండు ప్ర‌భుత్వాలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఆ వైఖ‌రి ఏపీ జలదోపిడి సాగాలె, తెలంగాణ నిండ మునగాలె అన్న‌ట్లుగా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బాధ‌తో మ‌రో విష‌యం చెబుతున్నాన‌ని, గోదావ‌రి బ‌న‌క‌చ‌ర్ల‌కు అత్యంత కీల‌క‌మైన అనుమ‌తి వ‌చ్చింద‌ని చెప్పారు. ఆ డాక్యుమెంట్ రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర కూడా లేద‌ని చెప్పారు. దానిని తాను విడుద‌ల చేస్తున్నాన‌న్నారు. ఈ ప్రభుత్వానికి సోయి లేదు, మొద్దు నిద్ర నటిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడైతే, కేంద్రం మీద యుద్దం చేయాలని సూచించారు. ఆ డాక్యుమెంట్‌లో 200 టీఎంసీలు తీసుకుపోయే అవకాశం ఉంది, వెసులుబాటు ఉందని క్లియర్ గా చెప్పిందని వివ‌రించారు. ఈ లెటర్ వచ్చింది ప్ర‌భుత్వానికి తెలుసా తెలియదా, అస‌లు ప్ర‌భుత్వం ప‌నిచేస్తున్న‌దా అని ప్ర‌శ్నించారు. ఢిల్లీ మీటింగ్ అయిన ప‌దిహేను రోజుల‌కే బ‌న‌క‌చ‌ర్ల‌కు అనుమ‌తి వ‌చ్చింద‌న్నారు. ఆ స‌మావేశంలో రేవంత్ అంగీక‌రించినందునే అనుమ‌తి వ‌చ్చింద‌ని మండిప‌డ్డారు. తాము అధికారంలో ఉన్న‌ప్పుడు ధాన్యం కొనుగోలు చేయకుంటే ఢిల్లీలో ధర్నా చేశామ‌ని గుర్తు చేశారు. కేసీఆర్ హ‌యాంలో 940 టీఎంసీల అనుమతులు సాధించామ‌ని, సెక్ష‌న్ 3 సాధించామ‌ని చెప్పారు. ఇప్పుడేమో రేవంత్ ఆంధ్ర‌కు ఊడిగం చేస్తున్నాడ‌ని, చంద్ర‌బాబు చెప్పిన‌ట్లు చేస్తున్నాడ‌ని నిప్పులు చెరిగారు. తెలంగాణ‌కు ద్రోహం చేస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌భుత్వం వేసిన క‌మిటీలో ఆదిత్యానాథ్ దాస్‌ను తొల‌గించ‌డంతో పాటు క‌మిటీలో ఉన్న ముగ్గురు ఆంధ్రా మూలాలు ఉన్న వాళ్ల‌ను నియమిస్తే తెలంగాణ‌కు ఎలా న్యాయం జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోరు పారేసుకోవడం తప్ప చేసేదేం లేదని ఆరోపించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడాల‌ని సూచించారు. అసెంబ్లీలో చిల్లర ప్రసంగం కాదు, గోదావరి నల్లమలసాగర్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయాల‌ని హిత‌వు ప‌లికారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుని ఆంధ్ర‌కు, చంద్ర‌బాబుకు దాసోహం చేయ‌డం కాకుండా ఢిల్లీకి క‌దిలి సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్ కార్యాల‌యం ముందు ధ‌ర్నా చేద్దామ‌న్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement