త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Food Safety Commissioner | పాలకొవ్వు, తేమ శాతంతో.. అసలైన నెయ్యిని గుర్తు పట్టొచ్చు

Food Safety Commissioner | పాలొకొవ్వు, తేమ శాతంతో అస‌లైన నెయ్యిని గుర్తు ప‌ట్టొచ్చ‌ని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యానారాయణ తెలిపారు. నెయ్యిలో 99.5 శాతం పాల కొవ్వు ఉండి, తేమ శాతం 0.5 శాతం మించొద్ద‌న్నారు. నెయ్యిలో పామాయిల్, వనస్పతి వంటి వృక్షజన్య కొవ్వులను కలపడం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం-2006 ప్రకారం నిషేధ‌మ‌ని ఆమె వివరించారు.

S

Telangana | Published On Jul 17, 2026, 7.31 pm IST

Food Safety Commissioner | పాలకొవ్వు, తేమ శాతంతో.. అసలైన నెయ్యిని గుర్తు పట్టొచ్చు
Advertisement
  • నెయ్యిలో 99.5 శాతం పాల కొవ్వు, తేమ శాతం 0.5 శాతం ఉండాలి
  • క్యూర్ ఏరియాలో 850 కిలోల క‌ల్తీ నెయ్యి సీజ్
  • 5 సంస్థలకు నోటీసులు
  • ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ వెల్లడి

Food Safety Commissioner | త్రినేత్ర‌.న్యూస్‌: పాలొకొవ్వు, తేమ శాతంతో అస‌లైన నెయ్యిని గుర్తు ప‌ట్టొచ్చ‌ని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యానారాయణ తెలిపారు. నెయ్యిలో 99.5 శాతం పాల కొవ్వు ఉండి, తేమ శాతం 0.5 శాతం మించొద్ద‌న్నారు. నెయ్యిలో పామాయిల్, వనస్పతి వంటి వృక్షజన్య కొవ్వులను కలపడం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం-2006 ప్రకారం నిషేధ‌మ‌ని ఆమె వివరించారు. హైదరాబాద్ క్యూర్ ఏరియాలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 14 సంస్థల్లో తనిఖీలు చేపట్టి 850 కిలోల అనుమానాస్పద కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పారు. ఐదు సంస్థ‌ల‌కు నోటీసులు జారీ చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

రాష్ట్రంలో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఉక్కుపాదం మోపిన‌ట్లు ఆమె చెప్పారు. నెయ్యిలో పామాయిల్, వనస్పతి వంటి ఇతర పదార్థాలు, కొవ్వులు కలుపుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేప‌ట్టామ‌న్నారు. ఈనెల‌ 14, 15 తేదీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించామని సంగీత సత్యానారాయణ తెలిపారు. కొన్ని లైసెన్స్ పొందిన సంస్థలు తయారు చేసిన నెయ్యిలో ఇతర కొవ్వులు కలిపినట్లు ప్రాథమికంగా నిర్ధారించామ‌న్నారు. మరికొన్ని సంస్థలు ఎలాంటి లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేకుండానే నెయ్యి తయారీ, విక్రయాలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో బ‌య‌ట‌ప‌డింద‌ని చెప్పారు.

హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 14 సంస్థల్లో తనిఖీలు చేపట్టామ‌న్నారు. 15 నెయ్యి సాంపిల్స్‌ను సేకరించి 60 కిలోల నెయ్యి అక్కడికక్కడే ధ్వంసం చేశామ‌న్నారు. 850 కిలోల అనుమానాస్పద కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నట్లు వెల్ల‌డించారు. ఉత్పత్తులను నివేదికలు వచ్చే వరకు భద్రపరిచి, కల్తీ అని తేలితే సంబంధిత ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ స్పష్టం చేశారు.

వివిధ జిల్లాల్లో 65 సంస్థలను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ప‌రిశీలించార‌న్నారు. మొత్తం 91 నెయ్యి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించార‌ని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన 5 సంస్థలకు నోటీసులు జారీ చేసిన‌ట్లు ఆమె పేర్కొన్నారు.

వినియోగదారులు లైసెన్స్ ఉన్న, విశ్వసనీయ సంస్థల నుంచే నెయ్యి కొనుగోలు చేయాలని సంగీత సూచించారు. నెయ్యి కొనేముందు FSSAI లైసెన్స్ నంబర్, మాన్యుఫాక్చరింగ్ లేబుల్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని చెప్పారు. బిల్లులను భద్రప‌ర‌చుకోవాల‌న్నారు. కల్తీ ఆహార పదార్థాలు గుర్తిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారుల‌కు ఫిర్యాదు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

 

Advertisement
Advertisement