త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemulawada Rajanna Temple | పూర్తి స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రాజ‌న్న దేవాల‌యం.. భ‌ట్టి విక్రమార్క కీలక ప్రకటన

Vemulawada Rajanna Temple | తెలంగాణ సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక వార‌స‌త్వాన్ని కాపాడేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంపొందించేందుకు భద్రాచలం, ధర్మపురి, వేములవాడ, కాళేశ్వరం వంటి దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన‌ట్లు చెప్పారు.

D

Telangana | Published On Mar 20, 2026, 2.16 pm IST

Vemulawada Rajanna Temple | పూర్తి స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రాజ‌న్న దేవాల‌యం.. భ‌ట్టి విక్రమార్క కీలక ప్రకటన
Advertisement

Vemulawada Rajanna Temple | తెలంగాణ సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక వార‌స‌త్వాన్ని కాపాడేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంపొందించేందుకు భద్రాచలం, ధర్మపురి, వేములవాడ, కాళేశ్వరం వంటి దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన‌ట్లు చెప్పారు. ఇందుకు అవ‌స‌రమైన నిధుల‌ను కూడా మంజూరు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. వేముల‌వాడ రాజ‌న్న దేవాల‌యాన్ని పూర్తి స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌క‌టించారు.

అంతేకాదు, రాష్ట్రంలో ఆధ్యాత్మిక ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేయ‌డంతోపాటూ భ‌క్తుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్యం అని తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ‌తో క‌లిసి రాష్ట్రంలో తొమ్మిది కొత్త ప‌విత్ర యాత్రా సర్క్యూట్లను ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ యాత్రా సర్క్యూట్ల ద్వారా భక్తులకు వసతి సదుపాయాలు, ప్రత్యేక దర్శనం, పర్యాటక సౌకర్యాలు అందించ‌బ‌డుతున్నాయ‌ని భ‌ట్టి విక్ర‌మార్క వివ‌రించారు.

పర్యాటక రంగానికి రూ.1,224 కోట్లు

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి త‌మ‌ ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030ను ప్రకటించి అమలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఈ పర్యాటక విధానం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం, స్థానిక కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. ఈ విధానానికి ప్రైవేటు రంగం నుండి విశేష స్పందన లభించింద‌ని.. తద్వారా రూ.25,000 కోట్లకు పైగా పెట్టుబడులు ప్రతిపాదనల దశలో ఉన్నాయ‌ని భ‌ట్టి వెల్ల‌డించారు. చ‌రిత్ర‌లోనే తొలిసారి హైద‌రాబాద్‌లో మిస్‌వ‌రల్డ్ పోటీలు నిర్వ‌హించిన‌ట్లు ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. దీని ద్వారా హైద‌రాబాద్ విశ్వ‌న‌గ‌రం ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించిన‌ట్లు చెప్పారు. ఈ బడ్జెట్‌లో పర్యాటక రంగానికి రూ.1,224 కోట్లు ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు భ‌ట్టి ప్ర‌క‌టించారు.

గోదావ‌రి పుష్క‌రాల కోసం బ‌డ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయింపు..

వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న గోదావ‌రి పుష్క‌రాల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది. అసెంబ్లీలో ఆర్థిక‌శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. గోదావ‌రి పుష్క‌రాలు ప్ర‌తి 12 ఏళ్ల ఒక‌సారి నిర్వ‌హించే విష‌యం తెలిసిందే. అత్యంత పవిత్ర‌మైన గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్నాయి. ఆయా ప‌విత్ర దినాల్లో సుమారు 8 కోట్ల మంది భ‌క్తులు పుణ్యస్నానాలు చేస్తార‌ని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా 'కుంభమేళా' తరహాలో పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్ర‌భుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పుష్కరాల నిర్వహణ, రోడ్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఇప్ప‌టికే ప్ర‌భుత్వం మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు నేతృత్వంలో కేబినెట్ స‌బ్ క‌మిటీ ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత, రద్దీ నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించే చర్యలు తీసుకుంటోంది. ఈ గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ఈ బడ్జెట్‌లో రూ.500కోట్లు ప్ర‌తిపాదించిన‌ట్లు ఆర్థిక‌మంత్రి తెలిపారు.

Also Read..

రాజీవ్ యువ వికాసానికి రూ.6 వేల కోట్లు: భ‌ట్టి

తెలంగాణ నెత్తిన భారీ అప్పుల భారం: 2026-27 నాటికి రూ.5.62 లక్షల కోట్లు

ఆరు గ్యారెంటీల‌కు రూ. 50,713 కోట్లు.. ఈసారైనా అమ‌ల‌య్యేనా..?

Advertisement

తాజావార్తలు

Advertisement