త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raja Singh | ఒవైసీ బ్రదర్స్‌ చరిత్ర తెలుసుకోండి

Raja Singh | సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒవైసీ సోదరులను ప్రశంసించడంపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ ఒవైసీలను దేశభక్తులుగా అభివర్ణించే ముందు వారి రాజకీయ చరిత్రను తెలుసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.

P

Telangana | Published On Sep 4, 2026, 5.23 pm IST

Raja Singh | ఒవైసీ బ్రదర్స్‌ చరిత్ర తెలుసుకోండి
Advertisement
  • ఓల్డ్‌ సిటీ అభివృద్ధికి వేల కోట్ల నిధులు ఎందుకు?
  • హిందువుల పన్నుల డబ్బును ఒవైసీ సోదరుల కాళ్ల వద్ద పెడుతున్నారు
  • సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాజాసింగ్‌ అభ్యంతరం

Raja Singh | సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒవైసీ సోదరులను ప్రశంసించడంపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ ఒవైసీలను దేశభక్తులుగా అభివర్ణించే ముందు వారి రాజకీయ చరిత్రను తెలుసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో అసదుద్దీన్‌ ఒవైసీ భారత్‌కు మద్దతుగా నిలిచారని సీఎం చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌లో ఉన్నా, పాకిస్థాన్‌లో ఉన్నా దేశం కోసం ప్రతి ఒక్కరూ నిలబడాల్సిందేనని వ్యాఖ్యానించారు.

దేశ‌భ‌క్తులుగా పేర్కొన‌డంపై విమ‌ర్శ‌లు

ఒవైసీ సోదరుల దేశభక్తిపై రేవంత్‌రెడ్డి అంత నమ్మకంగా ఉంటే స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం అనంతరం వందేమాతరం గీతాన్ని ప్లే చేయించాల్సిందని రాజాసింగ్‌ అన్నారు. అలా చేస్తే వారి వైఖరి ఏంటో ప్రత్యక్షంగా తెలిసేదని వ్యాఖ్యానించారు. అది కాకపోతే ‘తెలంగాణ తల్లికి జిందాబాద్‌’ అంటూ నినాదం చేయాలని చెప్పినా వారి స్పందన ద్వారా విషయం స్పష్టమయ్యేదన్నారు. ఒవైసీ సోదరులను నిజమైన దేశభక్తులుగా పేర్కొంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

ఒవైసీ సోద‌రుల వ‌ల్లే ఘ‌ర్ష‌ణ‌లు

ఒవైసీ సోదరుల వల్లే దేశంలో హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని రాజాసింగ్‌ ఆరోపించారు. అక్బరుద్దీన్‌ ఒవైసీ గతంలో చేసిన ‘15 నిమిషాల’ వ్యాఖ్యలను సీఎం రేవంత్‌రెడ్డి మర్చిపోయారా అని ప్రశ్నించారు. పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే తమ సత్తా ఏంటో చూపిస్తామని, వంద కోట్ల మంది హిందువులకు తమ శక్తిని చూపిస్తామని అప్పట్లో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. ఆ వంద కోట్ల మంది హిందువుల్లో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు.

ఓల్డ్‌ సిటీ అభివృద్ధికి నిధులెందుకు?

ఓల్డ్‌ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడాన్ని రాజాసింగ్‌ ప్రశ్నించారు. హిందువులు, న్యూ సిటీ ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చిన డబ్బును ఒవైసీ సోదరుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. “హిందువులు పన్నులు కడుతుంటే.. ఆ డబ్బును ఒవైసీ సోదరుల కాళ్ల వద్ద పెడుతున్నారు” అని విమర్శించారు. గతంలో అసెంబ్లీ వేదికగా ఓల్డ్‌ సిటీ నుంచి ప్రభుత్వానికి తగినంత రెవెన్యూ రావడం లేదని, విద్యుత్‌, నీటి బిల్లులు, పన్నులు సరిగా చెల్లించడం లేదని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజాసింగ్‌ గుర్తుచేశారు. అప్పట్లో ఆదాయం రావడం లేదని చెప్పిన ప్రభుత్వమే ఇప్పుడు అదే ప్రాంతంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఎందుకు చేపడుతోందని ప్రశ్నించారు. ఓల్డ్‌ సిటీ నుంచి వచ్చే రెవెన్యూ, పన్నుల వసూళ్లపై కూడా ఒవైసీ సోదరులను సీఎం ప్రశ్నించాలని సూచించారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి బాటలో నడవాలి

గతంలో పలువురు ముఖ్యమంత్రులు ఒవైసీ సోదరుల విషయంలో తప్పులు చేశారని రాజాసింగ్‌ విమర్శించారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి వారిని ఎదుర్కొన్న తీరును గుర్తుచేస్తూ.. రేవంత్‌రెడ్డి కూడా అదే బాటలో నడిస్తే మంచిదని సూచించారు. కేసీఆర్‌ గతంలో ‘ఎనిమిదో నిజాం’ తరహాలో వ్యవహరించి రాజకీయంగా నష్టపోయారని రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి కూడా అదే విధానాన్ని అనుసరించి ‘తొమ్మిదో నిజాం’గా మారితే ఆయన పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుందని హెచ్చరించారు. ఒవైసీ సోదరుల పట్ల తన వైఖరిని సీఎం మార్చుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement