త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Budget | అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ సెంట‌ర్లుగా పాలిటెక్నిక్ కాలేజీలు.. ప్ర‌తి నెల రూ. 2 వేలు స్కాల‌ర్‌షిప్‌

Telangana Budget | రాష్ట్రంలో ఉన్న‌త విద్య‌పై ప్ర‌భుత్వం దృష్టి సారించింద‌ని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో పేర్కొన్నారు. యూనివ‌ర్సిటీల‌ను ఆధునీక‌రిస్తున్నామ‌ని, ఆయా యూనివ‌ర్సిటీల అభివృద్ధికి ప్ర‌త్యేక నిధులు కేటాయిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

S

Telangana | Published On Mar 20, 2026, 1.31 pm IST

Telangana Budget | అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ సెంట‌ర్లుగా పాలిటెక్నిక్ కాలేజీలు.. ప్ర‌తి నెల రూ. 2 వేలు స్కాల‌ర్‌షిప్‌
Advertisement

Telangana Budget | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఉన్న‌త విద్య‌పై ప్ర‌భుత్వం దృష్టి సారించింద‌ని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో పేర్కొన్నారు. యూనివ‌ర్సిటీల‌ను ఆధునీక‌రిస్తున్నామ‌ని, ఆయా యూనివ‌ర్సిటీల అభివృద్ధికి ప్ర‌త్యేక నిధులు కేటాయిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. విద్యార్థుల సంఖ్య‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీల సంఖ్య‌ను కూడా పెంచామ‌న్నారు. ఇక పాలిటెక్నిక్ కాలేజీల‌ను అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ సెంట‌ర్లుగా ఉన్న‌తీక‌రిస్తున్న‌ట్లు భ‌ట్టి స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రంలో పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, లా కాలేజీలు, తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కాలేజ్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లా, ఫార్మసీ కాలేజీలు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ క్యాంపస్‌ను నూతనంగా మంజూరు చేశాం. వీటికి అదనంగా, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కోస్గిను ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేశామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.

149కి పెరిగిన డిగ్రీ కాలేజీల సంఖ్య

  • స్టేషన్ ఘన్‌పూర్, కేసముద్రం, గంగాధర, ధర్మపురి, పాకాల్, కోస్గి, దేవరకద్రలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రారంభించాం. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సంఖ్య 149 కి పెరిగిందని పేర్కొన్నారు.

పాలిటెక్నిక్ కాలేజీల్లో 15 కొత్త కోర్సులు

  • రాష్ట్రంలో ఉన్న 57 పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా ఉన్నతీకరిస్తున్నాం. యువతను భవిష్యత్ ఉద్యోగావకాశాలు కల్పించడానికి, ఎంటర్ ప్రెన్యూర్లుగా ఎదగడానికి వీలుగా పాలిటెక్నిక్ కళాశాలల్లో 15 కొత్త కోర్సులు 2026–27 విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తున్నామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.

కొత్త‌గా యూనివ‌ర్సిటీ..

  • భూవిజ్ఞాన, ఖనిజ శాస్త్ర పరిశోధనలకు ప్రత్యేకంగా డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్థాపించాం. అలాగే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో న్యాయ, ఇంజినీరింగ్ కళాశాలల ద్వారా కొత్త ప్రొఫెషనల్ కోర్సులు ప్రారంభించబడ్డాయ‌ని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఓయూకు రూ. 1000 కోట్లు

  • మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ. 1000 కోట్లు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి రూ. 400 కోట్లు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాం. మిగిలిన విశ్వవిద్యాలయాలకు కూడా అవసరమైన నిధులు కేటాయిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

విద్యాశాఖ ప‌రిధిలోకి స్కిల్ యూనివర్సిటీ

  • నేటి పోటీ ప్రపంచంలో పరిశ్రమలకు అవసరమగు నైపుణ్యాలున్న మానవ వనరుల కొరత నెలకొంది. చాలా సందర్భాలలో, ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల నుండి ఉత్తీర్ణులై వస్తున్న మన విద్యార్థులలో ఆశించిన స్థాయిలో నైపుణ్యాలు ఉండటం లేదు. అలాగే, అధునాతన, ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు వారు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండటం లేదు. ఈ అంతరాన్ని పూడ్చాలనే దార్శనికతతో అటు విద్యావంతులైన నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ఇటు పరిశ్రమలు ఎదుర్కొంటున్న నైపుణ్యము కల్గిన మానవ వనరుల కొరతను ఏకకాలంలో పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో, మన రాష్ట్ర ప్రభుత్వం 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ'ని స్థాపించింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా, ఆయా పరిశ్రమల భాగస్వామ్యంతోనే రూపొందించిన పాఠ్యాంశాల ద్వారా యువతకు ప్రత్యేక నైపుణ్యాలను అందిస్తాము. ఈ స్కిల్ యూనివర్సిటీని విద్యాశాఖ పరిధిలోనికి తీసుకొని వస్తున్నామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు.

118 ఏటీసీలు అందుబాటులోకి.. ప్ర‌తి నెల రూ. 2 వేలు స్కాల‌ర్‌షిప్‌

  • రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దేందుకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) లుగా ప్రభుత్వం ఉన్నతీకరించింది. దీనికి అదనంగా, 53 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) లను మంజూరు చేసింది. వీటి నిర్వహణ పనులు పురోగతిలో ఉన్నాయి. దీనితో మొత్తం 118 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)లు అందుబాటులోకి వస్తున్నాయి. ATCలో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతి నెల రూ. 2 వేలు స్కాలర్‌షిప్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నైపుణ్యాలకు సంబంధించిన అన్ని సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCలు), పాలిటెక్నిక్ కళాశాలలు, టామ్‌కామ్ (TOMCOM) లను ఈ స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

బ్లూ కాల‌ర్ ఉద్యోగాల‌కు స‌న్న‌ద్ధం చేసేలా..

  • యువతను 'బ్లూ కాలర్' ఉద్యోగాల కోసం సన్నద్ధం చేసేలా.. ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ (JNTU) తదితర విద్యాసంస్థల తరహాలో ఈ విశ్వవిద్యాలయాన్ని తయారు చేయటం మా ప్రధాన ఉద్దేశ్యం.. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలనే మహోన్నత లక్ష్యంతో ఉన్నాము, ఇందుకు మనకు భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైపుణ్య ఆధారిత బ్లూ-కాలర్ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన మానవ వనరులను అందించడంలో, తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మేము భావిస్తున్నాము. “పిల్లల భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఖర్చుకాదు - అవి పెట్టుబడులు.” అమ్మకలలు, పిల్లల చదువు - ఇవే తెలంగాణ భవిష్యత్తు. ఈ బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ. 26,674 కోట్లు ప్రతిపాదిస్తున్నామ‌ని ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.
Advertisement

తాజావార్తలు

Advertisement