త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balmuri Venkat vs Harish Rao | బీఆర్ఎస్ బతుకుతుందా? బీజేపీలో కలపాలా? : హరీశ్ రావుపై బల్మూరి వెంకట్ ఫైర్

బీఆర్ఎస్ నేత హరీశ్ రావు వ్యాఖ్యలకు కాంగ్రెస్ విప్ బల్మూరి వెంకట్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేసిన నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

J

Telangana | Published On Apr 28, 2026, 6.59 pm IST

Balmuri Venkat vs Harish Rao | బీఆర్ఎస్ బతుకుతుందా? బీజేపీలో కలపాలా? : హరీశ్ రావుపై బల్మూరి వెంకట్ ఫైర్
Advertisement

Balmuri Venkat vs Harish Rao | త్రినేత్ర.న్యూస్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హరీశ్ రావు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తీరుపై, ముఖ్యంగా హరీశ్ రావు వ్యవహార శైలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని బల్మూరి వెంకట్ ఎద్దేవా చేశారు. "చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని ఎలా బతికించుకోవాలి? అసలు ఆ పార్టీ రాష్ట్రంలో బతుకుతుందా లేదా? లేక ఆ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేయాలా? అన్న కన్ఫ్యూజన్‌లో, దిక్కుతోచని స్థితిలో హరీశ్ రావు కొట్టుమిట్టాడుతున్నారు. ఏం చేయాలో పాలుపోక, తీవ్ర నైరాశ్యంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు" అని వెంకట్ విమర్శించారు.

ఫోన్ ట్యాపింగ్‌పై ఘాటు కౌంటర్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు చేసిన ఆరోపణలకు వెంకట్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

"గత పదేళ్లుగా అధికార మదంతో, అహంకారంతో అధికారులను అడ్డం పెట్టుకుని మీరే అందరి ఫోన్లను ట్యాప్ చేయించారు. మీరు చేసిన ఆ పనులే ఇప్పుడు ప్రజా ప్రభుత్వం కూడా చేస్తోందన్న భ్రమలో మతిలేని మాటలు మాట్లాడుతున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మీ సొంత కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాప్ చేయించిన నీచమైన చరిత్ర మీది. మీ మరదలు కవితనే స్వయంగా బయటకొచ్చి మీపై ఆరోపణలు చేసిన విషయం వాస్తవం కాదా? ఆమె చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మీకు లేదు" అంటూ సవాల్ విసిరారు.

తీరు మార్చుకోకపోతే ప్రజలు తరిమికొడతారు

కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజాపాలనను చూసి ఓర్వలేకనే హరీశ్ రావు ఇలాంటి విషపు మాటలు మాట్లాడుతున్నారని విప్ వెంకట్ ఆరోపించారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు చెప్పే అబద్ధాలను నమ్మకనే గత ఎన్నికల్లో ప్రజలు వారిని చిత్తుగా ఓడించారని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా హరీశ్ రావు తన మాట తీరు మార్చుకోకపోతే, రాబోయే రోజుల్లో ప్రజలు తన్ని తరిమేసే పరిస్థితి వస్తుందని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Advertisement
Advertisement