త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | పవన్‌ ప్రచారం ర‌ద్దు.. కార‌ణం అనారోగ్య‌మా?.. వ్య‌తిరేక‌తా?

Pawan Kalyan | ఏపీ ఉప‌ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ (Pawan Kalyan) తెలంగాణ‌లో త‌న ఉనికి చాటుకోవాల‌నుకున్నారు. స్టార్‌డ‌మ్‌, బీజేపీ మ‌ద్ద‌తుతో రాష్ట్రంలో త‌న పార్టీకి బ‌లం చేకూర్చాల‌ని ప్లాన్ చేశారు.

G

Telangana | Published On Feb 7, 2026, 11.26 am IST

Pawan Kalyan | పవన్‌ ప్రచారం ర‌ద్దు.. కార‌ణం అనారోగ్య‌మా?.. వ్య‌తిరేక‌తా?
Advertisement

Pawan Kalyan | త్రినేత్ర‌.న్యూస్‌: ఏపీ ఉప‌ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ (Pawan Kalyan) తెలంగాణ‌లో త‌న ఉనికి చాటుకోవాల‌నుకున్నారు. స్టార్‌డ‌మ్‌, బీజేపీ మ‌ద్ద‌తుతో రాష్ట్రంలో త‌న పార్టీకి బ‌లం చేకూర్చాల‌ని ప్లాన్ చేశారు. దీనికి మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను (Municipal Elections) వేదిక‌గా చేసుకోవాల‌ని నిర్ణ‌యించారు. త‌గిన‌ట్లుగా త‌న పార్టీ త‌ర‌పున అక్క‌డ‌క్క‌డ అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిలిపారు. వారికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం (Election Campaign) చేయాల‌నుకున్న ఆయ‌న‌.. టూర్‌ షెడ్యూల్‌ను ఖ‌రాలు చేసుకున్నారు. అయితే చివ‌రి క్ష‌ణంలో త‌న ప్ర‌చార ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. దీనికి అనారోగ్యం చెబుతున్న‌ప్ప‌టికీ.. అస‌లు కార‌ణం వేరే ఉంద‌ని బీజేపీ, జ‌న‌సేన వ‌ర్గాల్లో చ‌ర్చ‌ న‌డుస్తున్న‌ది.

శ‌ని, ఆదివారాల్లో త‌న ప‌ర్య‌ట‌న‌ను ప‌వ‌న్ ఖ‌రారు చేసుకున్నారు. ఇందులో భాగంగా వికారాబాద్, తాండూరు, నల్లగొండ తదితర చోట్ల ప్ర‌చారం చేయాల్సి ఉన్న‌ది. అయితే త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దుచేస‌కుంటున్న‌ట్లు ప‌వ‌న్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయ‌న‌ ప్రచారం చేస్తే నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదని క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారంతో రాష్ట్ర బీజేపీ ఈ ప్రచారయత్నాలను విరమించుకున్నట్టు తెలుస్తున్న‌ది. శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో జనసేన పార్టీ స్థానికనేతలు సమావేశమైనప్పుడు ఈ అభిప్రాయం వచ్చినట్లు స‌మాచారం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ కూటమిలో భాగస్వామిగా ఉంటూ.. తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన త‌న‌ అభ్యర్థులను నిలపడాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. అదేవిధంగా కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బీజేపీ రెబెల్‌ అభ్యర్థికి జనసేన తరఫున బీఫామ్‌ ఇవ్వడం పట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌చారంలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ బీజేపీకి ఓటేయమంటారా లేక జనసేనకు ఓటేయమని అడుగుతారా అని ప్రశ్నిస్తున్నారు.

మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం నిర్వ‌హించ‌డం ప‌ట్ల అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ది. తెలంగాణ వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్‌ను.. ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ ఉద్య‌మ వ్య‌తిరేకిగానే చూస్తుంద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. అదేవిధంగా పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ గౌడ్ కూడా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పిన త‌ర్వాతే ప‌వ‌న్ ఇక్క‌డ అడుగుపెట్టాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని కించపరిచే శక్తులతో బీజేపీ పొత్తు పెట్టుకోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర‌ ఏర్పాటును వేర్పాటువాదంగా అభివ‌ర్ణించిన‌, కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి త‌గిలింద‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవ‌డంపై బీజేపీ స‌మాధానం చెప్పాల‌ని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement