త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Patnam Sunitha Reddy | నేను ఎక్క‌డ మొద‌లు పెట్టానో అక్క‌డే ఉన్నా.. నాక‌న్నా త‌క్కువ ప‌ద‌విలో ఉన్న‌ రేవంత్ మాత్రం సీఎం అయ్యాడు..

G

Telangana | Published On Mar 9, 2026, 9.50 am IST

Patnam Sunitha Reddy | నేను ఎక్క‌డ మొద‌లు పెట్టానో అక్క‌డే ఉన్నా.. నాక‌న్నా త‌క్కువ ప‌ద‌విలో ఉన్న‌ రేవంత్ మాత్రం సీఎం అయ్యాడు..
Advertisement

Patnam Sunitha Reddy | త్రినేత్ర.న్యూస్‌: కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు, వికారాబాద్ జడ్పీ మాజీ చైర్‌ప‌ర్స‌న్ ప‌ట్నం సునీతా మ‌హేంద‌ర్ రెడ్డి (Patnam Sunitha Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నేను ఎక్క‌డ మొద‌లు పెట్టానే ఇప్ప‌టికీ అక్క‌డే ఆగిపోయాన‌ని, రేవంత్ (Revanth Reddy) మాత్రం ముఖ్య‌మంత్రి అయ్యారంటూ హాట్ కామెంట్స్ చేశారు. గ‌త లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌కు ప‌ట్టున్న చేవెళ్ల ఎంపీ టికెట్ అడిగితే.. ఇష్టం లేక‌పోయినా మ‌ల్కాజిగిరి నుంచి పోటీ చేయించార‌ని, దీంతో ఓడిపోవాల్సి వ‌చ్చింద‌ని కాంగ్రెస్ పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

 

‘నేను 2006లో జడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి నాకంటే తక్కువ పదవిలోనే ఉండేవారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ పదవులను అందుకుంటూ.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, నేను మాత్రం ఎక్కడ మొదలుపెట్టానో అక్కడే (జడ్పీ చైర్మన్‌ స్థాయిలోనే) ఆగిపోయాను’ అని అన్నారు. ప్ర‌స్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే చర్చకు దారితీశాయి. గత ఎన్నికల్లో తనకు పట్టున్న చేవెళ్ల ఎంపీ టికెట్‌ అడిగితే కాదని.. మల్కాజిగిరి నుంచి పోటీ చేయించారని, దానివల్లే తాను ఓడిపోయానని విమ‌ర్శించారు.

భ‌ర్త అడుగుజాడల్లో..

మాజీ మంత్రి, త‌న భ‌ర్త పట్నం మహేందర్ రెడ్డి (Patnam Maheder Reddy) అడుగుజాడల్లో సునీతా రెడ్డి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2006లో తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున బంట్వారం జడ్పీటీసిగా ఎన్నికయ్యారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, టీడీపీ అంత‌ర్ధానం వంటి ప‌రిణామాల‌తో 2014లో టీఆర్ఎస్‌లో చేరారు. అదే ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో యాలాల జడ్పీటీసీగా రెండోసారి విజ‌యం సాధించిన ఆమె.. మ‌రోసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొట్‌పల్లి జడ్పీటీసిగా ఎన్నికై నూతనంగా ఏర్పాటైన వికారాబాద్ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్య‌లు చేప‌ట్టారు.

 

2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడిపోవ‌డం, పార్టీలో అంత‌ర్గ‌త విభేదాల నేప‌థ్యంలో 2024 ఫిబ్రవరి 16న త‌న భ‌ర్త‌తోపాటు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదే ఏడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మల్కాజ్‌గిరి సిగ్మెంట్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఆమె జ‌డ్పీ మాజీ చైర్‌ప‌ర్స‌న్‌గానే మిగిలిపోయారు.

 

Advertisement
Advertisement