త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vangeepuram Sreenatha Chary | ఈ పాలమూరు ప్రొఫెసర్ కౌన్సెలింగ్‌లో దిట్ట

Vangeepuram Sreenatha Chary | పాలమూరు నేల గర్వించదగిన విద్యావేత్తగా నిలిచిన డా. వంగీపురం శ్రీనాథాచారి బోధన, సైకాలజీ, కౌన్సెలింగ్ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు. ఆంగ్ల సాహిత్యంలో పీహెచ్‌డీతో పాటు అప్లైడ్ సైకాలజీ, కౌన్సెలింగ్ & సైకోథెరపీ వంటి విభాగాల్లో ఉన్నత విద్యను అభ్యసించి, జ్ఞానం - అనుభవం - సేవ అనే త్రివేణిని సమన్వయం చేసిన వ్యక్తిగా ఎదిగారు.

S

Telangana | Published On Apr 24, 2026, 7.55 pm IST

Vangeepuram Sreenatha Chary | ఈ పాలమూరు ప్రొఫెసర్ కౌన్సెలింగ్‌లో దిట్ట
Advertisement

Vangeepuram Sreenatha Chary | త్రినేత్ర‌.న్యూస్ : పాలమూరు నేల గర్వించదగిన విద్యావేత్తగా నిలిచిన డా. వంగీపురం శ్రీనాథాచారి బోధన, సైకాలజీ, కౌన్సెలింగ్ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు. ఆంగ్ల సాహిత్యంలో పీహెచ్‌డీతో పాటు అప్లైడ్ సైకాలజీ, కౌన్సెలింగ్ & సైకోథెరపీ వంటి విభాగాల్లో ఉన్నత విద్యను అభ్యసించి, జ్ఞానం - అనుభవం - సేవ అనే త్రివేణిని సమన్వయం చేసిన వ్యక్తిగా ఎదిగారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యుడు, ఆంగ్ల విభాగాధిపతి, అదనపు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, క్యాంపస్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ వంటి కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, విద్యా రంగంలో తన ముద్రను చెరగని విధంగా ముద్రించారు.

లైఫ్ కోచ్‌గా, రచయితగా, శిక్షకుడిగా అనేక మందికి దారి

గిన్నిస్, లిమ్కా, ఆసియా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లలో స్థానం సంపాదించడం ఆయన ప్రతిభకు నిదర్శనం మాత్రమే కాదు. సమాజానికి ఆయన చేసిన సేవలకు అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది. ప్రస్తుతం పీహెచ్‌డీ మార్గదర్శకుడిగా, లైఫ్ కోచ్‌గా, రచయితగా, శిక్షకుడిగా అనేక మందికి దారి చూపుతున్నారు.

రీహాబిలిటేషన్ కౌన్సెలర్ హోదా

ఇటీవల ఆయన భారత ప్రభుత్వం గుర్తించిన రీహాబిలిటేషన్ కౌన్సెలర్ హోదాను సాధించడం మరో ముఖ్య మైలురాయిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI) ఈ గుర్తింపును అధికారికంగా మంజూరు చేసింది. 2024–25 విద్యా సంవత్సరంలో రాజస్థాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రీహాబిలిటేషన్ సైకాలజీ (PGDRP) పూర్తి చేసి, 7.45 గ్రేడ్ పాయింట్లతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. దీని ఆధారంగా సెంట్రల్ రీహాబిలిటేషన్ రిజిస్టర్ (CRR)లో నమోదు పొందడం విశేషం.

వందలాది ఉన్నతాధికారులకు శిక్షణ

రీహాబిలిటేషన్ కౌన్సెలింగ్ అనేది శారీరక, మానసిక లేదా సామాజిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తిరిగి సాధారణ జీవితంలోకి రావడానికి సహాయపడే సార్థకమైన మార్గదర్శక ప్రక్రియ. వ్యక్తులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, స్వయం ఆధారిత జీవనానికి దారి చూపే ఈ రంగంలో డా. శ్రీనాథాచారి సేవలు మరింత మందికి చేరనున్నాయి. ఇప్పటికే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సుమారు మూడు లక్షల యువతకు లక్ష్యసాధన, సమయపాలన, ఒత్తిడి నియంత్రణ, పరీక్షా వ్యూహాలు, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై మార్గనిర్దేశం చేసి, వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, పోలీస్ అకాడమీ, జ్యూడిషియల్ అకాడమీ, స్టేట్ బ్యాంక్ లెర్నింగ్ సెంటర్, జైళ్లు వంటి ప్రభుత్వ సంస్థల్లో వందలాది ఉన్నతాధికారులకు శిక్షణ అందించారు.

మరింత విశాల సేవలను అందించేందుకు సిద్ధం

ఈ సందర్భంగా తన విజయానికి కారణమైన గురువులు ఆచార్య వందనా ఠాకూర్, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ తిరునగరి అంజనా మూర్తికి, అలాగే సహాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త గుర్తింపుతో డా. శ్రీనాథాచారి రీహాబిలిటేషన్ కౌన్సెలింగ్ రంగంలో మరింత విశాల సేవలను అందించేందుకు సిద్ధమవుతుండడం సమాజానికి ఆనందదాయకమైన విషయం.

Advertisement
Advertisement