త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singireddy Niranjan Reddy vs Bakkani Narasimhulu | డిక్షనరీలో ‘తెలంగాణ’ పదం లేదా? బాబు మెప్పు కోసం దిగజారుడు కామెంట్స్.. టీడీపీ నేతపై నిరంజన్ రెడ్డి ఫైర్

డిక్షనరీలో 'తెలంగాణ' పదం లేదంటూ టీడీపీ నేత బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బాబు మెప్పు కోసం చరిత్రను వక్రీకరిస్తారా అంటూ ఫైర్ అయ్యారు.

J

Telangana | Published On May 27, 2026, 9.30 pm IST

Singireddy Niranjan Reddy vs Bakkani Narasimhulu | డిక్షనరీలో ‘తెలంగాణ’ పదం లేదా? బాబు మెప్పు కోసం దిగజారుడు కామెంట్స్.. టీడీపీ నేతపై నిరంజన్ రెడ్డి ఫైర్
Advertisement

Singireddy Niranjan Reddy vs Bakkani Narasimhulu | త్రినేత్ర.న్యూస్ : టీడీపీ మహానాడు (TDP Mahanadu) వేదికగా తెలంగాణ రాష్ట్రంపై ఆ పార్టీ నేత బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. "డిక్షనరీలో తెలంగాణ అనే పదమే లేదు" అంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పురిటిగడ్డను మరిచిపోయే ఇలాంటి నేతలకు పుట్టగతులు ఉండవంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

చరిత్ర తెలియని అజ్ఞాని

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మెప్పు పొందడం కోసమే బక్కని నర్సింహులు ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ పదం డిక్షనరీలో లేదని ఏ బుక్ చూసి చెబుతున్నావంటూ నిలదీశారు. క్రీ.శ. 1417 నాటి తెల్లాపూర్ శాసనం మొదలుకుని, కాకతీయుల కాలం నాటి 'త్రిలింగ దేశం' వరకూ ఎన్నో శాసనాల్లో, సాహిత్యంలో 'తెలంగాణ' పదం స్పష్టంగా లిఖించి ఉందని చరిత్రను గుర్తుచేశారు. ఇది బక్కని అజ్ఞానానికి, అవగాహనా లోపానికి నిదర్శనమన్నారు.

తెలంగాణ మా ఆత్మగౌరవం.. డిక్షనరీ కాదు

ఎంతో మంది అమరుల బలిదానాలు, సుదీర్ఘ ఉద్యమం ఫలితంగా 2014లో పార్లమెంట్ (Parliament) చట్టం ద్వారా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి పవిత్రమైన పోరాటాన్ని, అమరుల త్యాగాలను అవమానించడం అత్యంత దుర్మార్గమన్నారు. "తెలంగాణ పదం మీ డిక్షనరీలో (Dictionary) లేకపోవచ్చు.. కానీ అది మా ఆత్మగౌరవం. మా రక్తంలో, గుండెల్లో, ఈ భూమిలో, మా భాషలో, యాసలో, కల్చర్‌లో (Culture) అది సజీవంగా దాగి ఉంది" అని ఆయన ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.

చరిత్రలో ద్రోహులుగానే మిగిలిపోతారు

షాద్‌నగర్ గడ్డపై పుట్టి, తెలంగాణ మట్టిలో పెరిగిన బక్కని నర్సింహులు.. చివరకు తన స్వరాష్ట్రాన్నే కించపరిచేలా మాట్లాడటం దురదృష్టకరమని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లు చరిత్రలో 'తెలంగాణ ద్రోహులు'గానే మిగిలిపోతారని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ద్రోహుల మాటలు తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను మానసికంగా మరింత బలోపేతం చేస్తాయని, తెలంగాణ తేజాన్ని, వైభవాన్ని విశ్వవీధుల్లో సగర్వంగా ఎగురవేస్తాయని ఆయన ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు.

Advertisement
Advertisement