త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

Peddi Sudarshan Reddy | తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, నర్సంపేట బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి (Peddi Sudarshan Reddy) న్నుమూశారు. గ‌త ఆదివారం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో సికింద్రాబాద్ య‌శోద ద‌వాఖానలో చికిత్స పొందుతున్నారు. గురువారం అర్ధరాత్రి 12.51 గంటలకు తుదిశ్వాస విడిచారు.

G

Telangana | Published On Jul 31, 2026, 6.32 am IST

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
Advertisement

Peddi Sudarshan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, నర్సంపేట బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి (Peddi Sudarshan Reddy) న్నుమూశారు. గ‌త ఆదివారం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో సికింద్రాబాద్ య‌శోద ద‌వాఖానలో చికిత్స పొందుతున్నారు. గురువారం అర్ధరాత్రి 12.51 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులు ప్రకటించారు. ఈ నెల 26న ఉదయం హనుమకొండలో ఆయనకు ఛాతీలో నొప్పి రావటంతో స్థానిక ప్రైవేటు హాస్పిట‌ల్‌కు తరలించారు. కార్డియాక్‌ అరెస్ట్‌గా (Cardiac Arrest) గుర్తించిన వైద్యులు గంట సేపు శ్రమించి తొమ్మిదిసార్లు సీపీఆర్ చేశారు. దీంతో మ‌ళ్లీ గుండె కొట్టుకోవ‌డంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిట‌ల్‌కు తరలించారు.

గ‌త ఐదు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే సుదీర్ఘకాలం స్పృహలో లేకపోవడం వల్ల ఆయనలో నాడీ సంబంధిత స్పందన కనిపించలేదని, ఆక్సిజన్‌ లోపం కారణంగా మెదడుకు నష్టం జరిగినట్లు ఈసీజీ, బ్రెయిన్‌ ఎంఆర్‌ఐ, టీసీడీ పరీక్షల్లో సూచనలు కనిపించాయని తెలిపారు. ఈ క్ర‌మంలో గురువారం రాత్రి క‌న్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి తరలించనున్నారు.

రాజకీయ ప్రస్థానం

సుదర్శన్ రెడ్డి 1974, ఆగస్టు 6న రాజిరెడ్డి, అమృతమ్మ దంపతులకు వరంగల్ (Warangal) గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలం కేంద్రంలో జన్మించారు. 1991లో వరంగల్‌లోని మహబూబియా పంజాథన్ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ప‌నిచేశారు. 2001లో కేసీఆర్ ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీలో చేరి రైతు నాగలి గుర్తుపై నల్లబెల్లి మండల జెడ్పీటీసీగా గెలుపొంది జెడ్పీ ఫోర్ లీడర్‌గా కొనసాగారు.

2004 డిసెంబర్‌లో జిల్లా పార్టీ కన్వీనర్‌గా, 2005 చివర్లో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అనంతరం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఎనిమిది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి, వరంగల్ జిల్లా ఉద్యమానికి సారథ్యంవహించారు. 2006 నుంచి 2014 వరకు జిల్లా పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యునిగా పనిచేశారు. మహాగర్జన లాంటి చారిత్రాత్మకమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సభలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగిన అన్ని సభలకు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి చేతిలో 18,376 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో 2015 పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ త‌ర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పోటీచేసి కాంగ్రెస్ దొంతి మాధవ రెడ్డిపై 16,949 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018-2023 కాలంలో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా, శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్‌ (BRS) పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, రోడ్లు, తాగునీరు, వ్యవసాయ సమస్యలు, కరోనా కాలంలో సహాయక చర్యలు వంటి అంశాలపై దృష్టి సారించారు. ప్రజా సేవలో చురుకైన నాయకుడిగా, పార్టీ శ్రేణుల్లో, సాధారణ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన మరణంతో బీఆర్ఎస్ శ్రేణులు, నర్సంపేట ప్రాంత ప్రజలు, తెలంగాణ రాజకీయ వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. తెలంగాణ ఉద్యమం నుంచి అసెంబ్లీ వరకు ప్రజా సేవ చేసిన సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాలు నిలిచిపోతాయి.

 

Advertisement
Advertisement