త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Vemula Prashanth Reddy | కేంద్ర మంత్రి కొడుకు ప‌రారీలో ఉండన్న‌ది హాస్యాస్ప‌దం: ఎమ్మెల్యే వేముల‌

MLA Vemula Prashanth Reddy | పోక్సో కేసు నిందితుడు, కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమారుడు పరారీలో ఉన్నాడ‌నడం హాస్యాస్పదం అని, నిందితుడిని వెంట‌నే అరెస్టు చేయాల‌ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

S

Telangana | Published On May 12, 2026, 5.49 pm IST

MLA Vemula Prashanth Reddy | కేంద్ర మంత్రి కొడుకు ప‌రారీలో ఉండన్న‌ది హాస్యాస్ప‌దం: ఎమ్మెల్యే వేముల‌
Advertisement

- సిట్ విచారణ పేరిట నిందితుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్న రేవంత్
- బాలికపై అఘాయిత్యం జరిగిన‌ మూడు నెలల వరకు ఫిర్యాదు ఎందుకు తీసుకోలే?
- బాలిక హ‌నీట్రాప్ చేస్తుందా?
- రేవంత్-బండి సంజయ్ ల మధ్య 'ఫెవికాల్' బంధం.. అందుకే నిందితుడిని కాపాడుతున్నారు
- బాధితురాలిపైనే ఎదురు కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గం
- ఈ ఘ‌ట‌న‌పై ఒక్క కాంగ్రెస్ నాయ‌కుడు స్పందించ‌లే
- మీడియా స‌మావేశంలో ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్‌రెడ్డి ధ్వజం

MLA Vemula Prashanth Reddy | త్రినేత్ర‌.న్యూస్: పోక్సో కేసు నిందితుడు, కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమారుడు పరారీలో ఉన్నాడ‌నడం హాస్యాస్పదం అని, నిందితుడిని వెంట‌నే అరెస్టు చేయాల‌ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సిట్ విచారణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి నిందితుడిని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. నిజామాబాద్‌లో మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బాలికపై అఘాయిత్యం జరిగితే మూడు నెలల వరకు ఎందుకు ఫిర్యాదు తీసుకోలేదని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ల మధ్య ఫెవికాల్ బంధం ఉద‌ని.. అందుకే నిందితుడిని కాపాడుతున్నార‌ని మండిపడ్డారు.

నిందితుడిని త‌ప్పించే ప్ర‌యత్నం..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడు అనడం హాస్యాస్పదం అని ఎమ్మెల్యే ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్ విచారణ పేరిట నిందితుడిని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అని విమ‌ర్శించారు.

బాధితురాలిపైనే ఎదురు కేసులు పెట్ట‌డం దుర్మార్గం..

ఒక బాలికపై డ్రగ్స్, మద్యం ఇచ్చి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నా, పోలీసులు మూడు నెలల పాటు ఫిర్యాదు తీసుకోకుండా తాత్సారం చేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉంది. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాతే గత్యంతరం లేక పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం ప్రకారం బాలిక చెప్పేది వేదం అని, అటువంటి కేసులో బాధితురాలికి రక్షణ కల్పించాల్సింది పోయి.. నిందితుడు ఆమెపైనే తిరిగి 'హనీ ట్రాప్' పేరుతో కేసు పెట్టడం దారుణం. బాలిక హనీ ట్రాప్ చేస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. బాధితురాలిపైనే రివర్స్ కేసులు పెట్టడం చూస్తుంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒకటేనని అర్థమవుతోంది అని వేముల‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ లది ఫెవికాల్ బంధం. వీరిద్దరూ కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. కుంభకోణాలకు పాల్పడుతున్నారు. అందుకే కేంద్ర మంత్రి కొడుకుపై ఇంత పెద్ద నేరం ఉన్నా ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా దీనిపై స్పందించకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటి అని ప్ర‌శాంత్‌రెడ్డి ప్రశ్నించారు.

బండి సంజ‌య్‌ నైతిక బాధ్య‌త వ‌హించాలి..

పొద్దున లేస్తే కేసీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ మీద, హరీశ్‌రావు మీద విషం చిమ్మే బండి సంజయ్, తన కొడుకు చేసిన నేరంపై ఏం సమాధానం చెబుతారు. ఇతరుల వ్యక్తిగత విషయాలను రాజకీయం చేసే సంజయ్, ఇప్పుడు తన కొడుకుపై వచ్చిన ఈ పోక్సో కేసుపై నైతిక బాధ్యత వహించాలి. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ కేసులో రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. బాధితురాలికి, ఆమె కుటుంబానికి తక్షణమే పూర్తిస్థాయి రక్షణ కల్పించాలి అని డిమాండ్ చేసారు.

Advertisement
Advertisement