త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vakiti Srihari | నారాయణపేటను అభివృద్ధి జిల్లాగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి వాకిటి శ్రీహ‌రి

Vakiti Srihari | నారాయణపేటను వలసల జిల్లాగా కాకుండా అభివృద్ధి జిల్లాగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. దశాబ్దాలుగా సాగు, తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసిందని తెలిపారు.

G

Telangana | Published On Jun 2, 2026, 8.26 am IST

Vakiti Srihari | నారాయణపేటను అభివృద్ధి జిల్లాగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి వాకిటి శ్రీహ‌రి
Advertisement

Vakiti Srihari | త్రినేత్ర‌.న్యూస్‌: నారాయణపేటను (Narayanpet) వలసల జిల్లాగా కాకుండా అభివృద్ధి జిల్లాగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. దశాబ్దాలుగా సాగు, తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక రాష్ట్ర ప్రతినిధులతో కలిసి జూన్ 4, 5 తేదీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కీలక సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ ఏరియల్ సర్వే, సమీక్షా సమావేశాలు నిర్వహిస్తార‌ని వెల్ల‌డించారు.

మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం

ఆరు దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఈ పథకాన్ని ప్రభుత్వం రూ. 5 వేల‌ కోట్ల వ్యయంతో అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. భూత్పూర్ నుంచి కొడంగల్ వరకు సుమారు 7.1 టీఎంసీల నీటిని తరలించి, తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.

ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురయ్యే అనుగొండ, అంకెనపల్లి, దాదనపల్లి గ్రామాల ప్రజలకు రూ.100 కోట్లతో ఆధునిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గతంలో పెండింగ్‌లో ఉన్న సంగంబండ పనులను పూర్తి చేసి రైతులకు నీరందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

సరిహద్దు బ్యారేజీల నిర్మాణం

తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సరిహద్దు ప్రాంతాల్లో బ్యారేజీల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో 51 శాతం భూభాగం తెలంగాణకు, 49 శాతం కర్ణాటకకు ఉండటంతో రెండు రాష్ట్రాలకు సమాన ప్రయోజనం కలిగే విధంగా రూపకల్పన చేసినట్లు చెప్పారు. తెలంగాణ వాటా నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

కొల్కూర్-కొర్తికొండ ప్రాంతంలో 1.8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యారేజ్, అలాగే భీమా నదిపై రెండు, కృష్ణా నదిపై ఒక బ్యారేజ్ కమ్ బ్రిడ్జి నిర్మాణాలకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని వెల్లడించారు.

జంగంరెడ్డిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం

నర్వ మండలంలోని జంగంరెడ్డిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ప్రభుత్వం రూ.175 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా 13 గ్రామాల్లోని సుమారు 7,500 ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు.

సీఎం ప‌ర్య‌ట‌న ఇలా..

  • జూన్ 4న మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి
    కోయిల్ సాగర్ ప్రాజెక్టు, జంగంరెడ్డిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పరిశీలన.
  • కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదిత సరిహద్దు బ్యారేజీల ప్రాంతాల ఏరియల్ సర్వే.
  • జూరాల, నడిగడ్డ ప్రాంత ప్రాజెక్టుల పరిశీలన.
  • సోమశిలలో రాత్రి బస.
  • సోమశిల నుంచి నార్లాపూర్‌కు చేరుకుని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన.
  • నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, అనుబంధ నిర్మాణాలపై ఏరియల్ మరియు రోడ్డు మార్గ సర్వే.
  • అధికారులతో సమగ్ర సమీక్ష.

జిల్లా అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి నారాయణపేటను సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాల‌న్నారు.

Advertisement
Advertisement