త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి.. అధికారులకు మంత్రి ఉత్తమ్‌ ఆదేశాలు..

Uttam Kumar Reddy | రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సజావుగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, అవసరమైన లాజిస్టిక్స్‌ను బలోపేతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ సీజన్‌లో కొనుగోళ్ల అంశంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

P

Telangana | Published On Apr 24, 2026, 8.20 pm IST

Uttam Kumar Reddy | ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి.. అధికారులకు మంత్రి ఉత్తమ్‌ ఆదేశాలు..
Advertisement

Uttam Kumar Reddy | రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సజావుగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, అవసరమైన లాజిస్టిక్స్‌ను బలోపేతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ సీజన్‌లో కొనుగోళ్ల అంశంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందు కోసం మిషన్‌ మోడ్‌లో పని చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సుమారు 20 జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకడ మొదలైందని.. మరికొన్ని 13 జిల్లాల్లో ఆలస్యంగా నాట్లు వేయడంతో కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు. త్వరలో ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులకు సూచించారు. కొనుగోళ్లకు ప్రభుత్వం పూర్తిస్థాయి సన్నాహాలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయడానికి అవసరమైన లాజిస్టిక్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే 5వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా.. మరికొన్ని 3,500 కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 4.89 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ధాన్యం నిలువ విషయంలోనూ చర్యలు తీసుకున్నామని.. మధ్యంతర నిల్వ కోసం 12లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న స్థలాన్ని గుర్తించామని తెలిపారు. జిల్లా వారీగా 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ నిల్వకు కేటాయింపులు చేశామని చెప్పారు. రోజువారీ కొనుగోళ్ల అవసరాల కోసం సుమారు 16 కోట్ల గన్నీ సంచులు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. తేమ సమస్యలను ఎదుర్కొనేందుకు ఎక్కువ శాతం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, డ్రైయర్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

కార్మికుల కొరత, గన్నీ సంచుల కొరత లేకుండా చూసుకోవాలని, నాణ్యత పరీక్షలు, తూకం ప్రక్రియల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా తరలించేలా ఏర్పాటు చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం తరలించకుండా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని మంత్రి ఆదేశించారు. సివిల్ సప్లైస్, మార్కెటింగ్, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని, రైతులకు చెల్లింపులు ఎలాంటి ఆలస్యం లేకుండా అందేలా చూడాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా కొనుగోళ్లలో తేడాలు లేకుండా సమగ్రంగా పర్యవేక్షణ చేయాలని, రబీ సీజన్ మొత్తం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగాలని మంత్రి సూచించారు. సమావేశంలో సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement