త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageshwar Rao | ఆయిల్ పామ్ సాగు విస్త‌ర‌ణ‌కు అత్యంత ప్రాధాన్య‌త : మంత్రి తుమ్మ‌ల‌

Tummala Nageshwar Rao | రాష్ట్రంలో వానాకాలం వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

S

Telangana | Published On Jul 7, 2026, 4.12 pm IST

Tummala Nageshwar Rao | ఆయిల్ పామ్ సాగు విస్త‌ర‌ణ‌కు అత్యంత ప్రాధాన్య‌త : మంత్రి తుమ్మ‌ల‌
Advertisement

డ్రిప్ పరికరాల సరఫరా నిరంతరం కొనసాగాలి
మహిళా సంఘాల ద్వారా ఎరువుల విక్రయాలు
వ్య‌వ‌సాయ శాఖ స‌మీక్ష‌లో మంత్రి తుమ్మ‌ల వ్యాఖ్య‌లు

Tummala Nageshwar Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో వానాకాలం వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతులకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

మంగళవారం సచివాలయంలో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, ఆయిల్ పామ్ విస్తరణ, డ్రిప్ పరికరాల సరఫరా, ఎరువుల లభ్యత, మొక్కజొన్న కొనుగోళ్ల పేమెంట్లు, రైతు భరోసా నిధుల జమ, ఎల్‌నినో పరిస్థితులకు సంబంధించి ప్రత్యామ్నాయ కార్యాచరణ తదితర అంశాలపై శాఖల వారీగా సమీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి తుమ్మ‌ల‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతులు నాటేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఆయిల్ పామ్ మొక్కల కొరత తలెత్తడం లేదా సరఫరాలో ఆలస్యం జరగడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. జిల్లాల వారీగా అవసరమైన మొక్కల డిమాండ్‌ను ముందుగానే అంచనా వేసి, నర్సరీల నుంచి సకాలంలో సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు కేటాయించిన మొక్కలు ఆలస్యంగా చేరడం వల్ల సాగు దెబ్బతినకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ఆయిల్ పామ్ సాగులో డ్రిప్ ఇరిగేషన్ కీలక పాత్ర

ఆయిల్ పామ్ సాగులో డ్రిప్ ఇరిగేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న మంత్రి, డ్రిప్ పరికరాల సరఫరాలో కూడా ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. తయారీ సంస్థలు, సరఫరా సంస్థలు, అమలు సంస్థలతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ రైతులకు సకాలంలో డ్రిప్ వ్యవస్థలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనాలు రైతులకు ఆలస్యం కాకుండా అన్ని పరిపాలనా ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు.

మొక్కజొన్న కొనుగోళ్ల చెల్లింపుల ప్రక్రియ వేగవంతం

రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్ల పురోగతిపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నకు రైతులకు చెల్లించాల్సిన మొత్తాలు ఎక్కడైనా పెండింగ్‌లో ఉన్నాయా అనే అంశంపై అధికారులను ఆరా తీశారు. రైతులు తమ పంటను విక్రయించిన తర్వాత చెల్లింపుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసి రైతుల ఖాతాల్లో సకాలంలో నగదు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించారు.

ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి

వానాకాలంలో ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి, రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (PACS) యూరియా సరఫరా పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాల వారీగా నిల్వలు, పంపిణీ, డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా జరుగుతున్న తీరును సమీక్షించారు. రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, ఎక్కడైనా కొరత లేదా రవాణా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

స్వయం సహాయక సంఘాల ద్వారా ఎరువుల విక్రయాలు

ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఎరువుల విక్రయాల సాధ్యాసాధ్యాలను సమగ్రంగా పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల విస్తృత నెట్‌వర్క్‌ను రైతు సేవలకు వినియోగించే అవకాశాలను అధ్యయనం చేయాలని, దీనివల్ల రైతులకు మరింత చేరువలో ఎరువులు అందించడంతో పాటు మహిళా సంఘాలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కూడా కల్పించే విధంగా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.

అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా

రైతు భరోసా పథకం అమలుపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేసిన నిధుల వివరాలను పరిశీలించిన మంత్రి, మిగిలిన అర్హులైన రైతులకు కూడా ఎలాంటి జాప్యం లేకుండా నిధులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు రైతు భరోసా ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. వాతావరణ శాఖ సూచనలను దృష్టిలో ఉంచుకొని తొలి ప్రత్యామ్నాయ కార్యాచరణను జిల్లాల వారీగా సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ప్రతి జిల్లాలో తగిన నిల్వలు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని, రైతు వేదికలు, గ్రామ సభలు, క్షేత్రస్థాయి సమావేశాల ద్వారా శాస్త్రీయ సూచనలు అందించాలని మంత్రి ఆదేశించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు అనుకూలమో రైతులకు స్పష్టంగా తెలియజేసి, అవసరమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు, ఇతర ఇన్‌పుట్లు సకాలంలో అందించాలని సూచించారు.

Advertisement
Advertisement