త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HAM Road Projects | మెరుగైన ర‌హ‌దారుల‌తోనే స‌మ‌గ్రాభివృద్ధి : మంత్రి కోమ‌టిరెడ్డి

HAM Road Projects | రాష్ట్రంలో అమలవుతున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్డు ప్రాజెక్టుల పురోగతి, నాణ్యత, పనుల వేగం తదితర అంశాలపై మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి సెక్ర‌టేరియ‌ట్‌లో సుదీర్ఘ స‌మీక్ష నిర్వ‌హించారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులతో ఆయన విస్తృతంగా చర్చించారు.

P

Telangana | Published On May 11, 2026, 8.30 pm IST

HAM Road Projects | మెరుగైన ర‌హ‌దారుల‌తోనే స‌మ‌గ్రాభివృద్ధి : మంత్రి కోమ‌టిరెడ్డి
Advertisement

HAM Road Projects | రాష్ట్రంలో అమలవుతున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్డు ప్రాజెక్టుల పురోగతి, నాణ్యత, పనుల వేగం తదితర అంశాలపై మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి సెక్ర‌టేరియ‌ట్‌లో సుదీర్ఘ స‌మీక్ష నిర్వ‌హించారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులతో ఆయన విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హ్యామ్ రోడ్ల నిర్మాణాల ప్రగతి, పనుల నాణ్యత ప్రమాణాలు, ప్రజలకు కలిగే ప్రయోజనాలు, నిర్మాణ వేగంపై మంత్రి సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెరుగైన ర‌హ‌దారుల‌తోనే గ్రామాలు, మండలాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ర‌హదారుల అభివృద్ధి పరిశ్రమల స్థాపనకు దోహ‌ద‌ప‌డ‌డంతో పాటు మౌలిక వసతులు పెరుగుతాయని, యువతకు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు.

టెండర్ ప్రక్రియ, ప్రాజెక్టుల అమలు తీరుపై కూడా మంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రహదారుల రవాణా మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రవేశపెట్టిన హ్యామ్ విధానాన్ని 2016 నుంచి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 374కుపైగా ప్రాజెక్టులు రూ.4ల‌క్ష‌ల‌ నుంచి రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులతో చేపట్టినట్లు వివరించారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, క‌ర్నాట‌క‌, మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని అధికారులు పేర్కొనగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే మోడ‌ల్‌లో రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు.

టెండర్లలో “ఎక్సెస్ బిడ్స్” అంశంపై మంత్రి ప్రశ్నించగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎక్సెస్ బిడ్లు తక్కువగా ఉన్నాయని అధికారులు గణాంకాలతో వివరించారు. ఇవి అసత్య ప్రచారాలేనని కూడా స్పష్టం చేశారు. హ్యామ్ ఫేజ్–1 కింద రోడ్లు భవనాల శాఖ ద్వారా రూ.13,006.27 కోట్ల వ్యయంతో 441 రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇవి 6,092.37 కిలోమీటర్ల పొడవుతో 34 ప్యాకేజీలుగా అమలవుతున్నాయని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.6,250 కోట్లతో 2,162 రహదారుల పనులు 7,450 కిలోమీటర్ల పొడవుతో 17 ప్యాకేజీల రూపంలో కొనసాగుతున్నాయని వివరించారు. ప్రాజెక్టుల అమలుకు ముందు టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీస్ నిర్వహించి, నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ మోడ‌ల్‌లో ఆర్ఎఫ్‌పీ, డీసీఏ డాక్యుమెంట్లు రూపొందించి పారదర్శకంగా టెండర్లు ఆహ్వానించినట్లు అధికారులు పేర్కొన్నారు.

సాధారణ రహదారి పనులతో పోలిస్తే హ్యామ్ ప్రాజెక్టుల్లో అదనపు ప్లాంట్, ఆధునిక యంత్రాలు, 15 సంవత్సరాల నిర్వహణ బాధ్యత, పెట్రోలింగ్, అంబులెన్స్ సేవలు, ఇండిపెండెంట్ ఇంజినీర్ చార్జీలు, జీఎస్టీ, వడ్డీ భారం వంటి అంశాల కారణంగా అదనపు వ్యయం ఉంటుందని అధికారులు వివరించారు. ముఖ్యంగా జీఎస్టీ, వడ్డీ ప్రభావం వల్లనే సుమారు 9.30 శాతం అదనపు భారం ఏర్పడుతోందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ పాజిటివ్ ఎక్సెస్ బిడ్లు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గుజరాత్‌లో 66 శాతం వరకు, మహారాష్ట్రలో 47 శాతం వరకు ఎక్సెస్ బిడ్లు నమోదయ్యాయని, NHAI ప్రాజెక్టుల్లోనూ 50 శాతం వరకు అధిక బిడ్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, బిటుమెన్, స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడం వల్ల ప్రాజెక్టు వ్యయంపై 20 నుంచి 25 శాతం ప్రభావం పడుతోందని అధికారులు వివరించారు. ముఖ్యంగా బిటుమెన్ ధర టన్నుకు రూ.44 వేల నుండి రూ.89 వేల వరకు పెరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా, పరిశ్రమల విస్తరణకు అనుకూలంగా, ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందేలా నాణ్యమైన రహదారి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని స్పష్టం చేశారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం, బుధవారం కలుస్తానని ఆయన తెలిపారు. సమీక్ష సమావేశంలో ఆర్అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ బీవీరావుతో పాటు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement