త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్‌ మేళా.. 4 వేల మంది ఉద్యోగ‌వ‌కాశాలు

Mega Job Mela | కోదాడలో సెప్టెంబర్‌ 19న నిర్వహించనున్న మెగా జాబ్‌ మేళా ద్వారా మూడు వేల నుంచి నాలుగు వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు.

S

Telangana | Published On Sep 13, 2026, 7.40 pm IST

Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్‌ మేళా.. 4 వేల మంది ఉద్యోగ‌వ‌కాశాలు
Advertisement

అర్హులైన అభ్య‌ర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
హాజరు కానున్న స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్, మంత్రులు శ్రీధ‌ర్ బాబు, ల‌క్ష్మ‌ణ్ కుమార్
వివ‌రాలు వెల్ల‌డించిన మంత్రి కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

త్రినేత్ర‌.న్యూస్ : కోదాడలో సెప్టెంబర్‌ 19న నిర్వహించనున్న మెగా జాబ్‌ మేళా ద్వారా మూడు వేల నుంచి నాలుగు వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు.

దాదాపు 300 కంపెనీలు ఈ జాబ్‌ మేళాలో పాల్గొననున్నాయని, వేలాది ఉద్యోగ ఖాళీల భర్తీకి అవసరమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నాయని తెలిపారు. ఉద్యోగాల కోసం గ్రామీణ యువత నగరాలు, ఇతర రాష్ట్రాల చుట్టూ తిరిగే పరిస్థితిని మార్చి, కంపెనీలనే వారి వద్దకు తీసుకురావాలన్న సంకల్పంతో ఈ భారీ నియామక కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.

కోదాడలో ఆదివారం జాబ్‌ మేళా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకొని, తమ బయోడేటా ఐదు ప్రతులతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. దాదాపు 300 కంపెనీలు మొత్తం 27 వేల మంది ఉద్యోగుల అవసరంతో కోదాడకు వస్తున్నాయని మంత్రి తెలిపారు. అందులో కనీసం 15 శాతం అవసరాన్ని తీర్చగలిగినా మూడు వేల నుంచి నాలుగు వేల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. వేలాది మంది యువతకు ఉపాధి కల్పించి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపగలిగితే అది గొప్ప విజయమే కాకుండా తనకు ఎంతో సంతృప్తినిచ్చే సందర్భమవుతుందని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన యువతకు, ప్రముఖ కంపెనీల ప్రతినిధులకు నేరుగా అనుసంధానం కల్పించడమే ఈ జాబ్‌ మేళా ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. చేతిలో పట్టా, కళ్లలో భవిష్యత్తుపై ఎన్నో కలలు ఉన్నప్పటికీ సరైన సమాచారం, పరిచయాలు, అవకాశాలు లేక అనేకమంది యువత ఉద్యోగాలకు దూరమవుతున్నారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

2025 అక్టోబర్‌లో హుజూర్‌నగర్‌లో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాకు నిరుద్యోగ యువత నుంచి అపూర్వ స్పందన లభించిందని మంత్రి గుర్తుచేశారు. ఆ జాబ్‌ మేళాకు 40 వేల మందికిపైగా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోగా, సుమారు 20 వేల నుంచి 21 వేల మంది అభ్యర్థులు ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యారని తెలిపారు. వారిలో మూడు వేల నుంచి మూడున్నర వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయని వివరించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లను ఆహ్వానించినట్లు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. వారు జాబ్‌ మేళాకు హాజరై, ఉద్యోగాలకు ఎంపికైన యువతకు నియామక పత్రాలు అందించే అవకాశం ఉందన్నారు.

Advertisement
Advertisement