త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mee Seva | వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. రెండు రోజులు మీ సేవ కేంద్రాలు బంద్

Mee Seva | రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల‌పాటు మీసేవ (Mee Seva) కేంద్రాలు మూత‌ప‌డ‌నున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ప్ర‌భుత్వం కొత్త సేవా రుసుములు (Service Charges) అమ‌లులోకి తెచ్చింది.

G

Telangana | Published On Apr 4, 2026, 6.52 am IST

Mee Seva | వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. రెండు రోజులు మీ సేవ కేంద్రాలు బంద్
Advertisement

Mee Seva | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల‌పాటు మీసేవ (Mee Seva) కేంద్రాలు మూత‌ప‌డ‌నున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ప్ర‌భుత్వం కొత్త సేవా రుసుములు (Service Charges) అమ‌లులోకి తెచ్చింది. దీనికి సంబంధించి సిస్ట‌మ్‌లో అప్‌డేట్ చేయ‌డం, సాఫ్ట్‌వేర్ ఆధునీక‌ర‌ణ ప‌నుల కార‌ణంగా శ‌ని, ఆదివారాల్లో మీసేవ కేంద్రాల్లో సేవ‌లు నిలిచిపోనున్నాయి. సుమారు 36 గంట‌ల‌పాటు స‌ర్వ‌ర్లు అందుబాటులో ఉండ‌వ‌ని ఐటీ శాఖ తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్ పోర్ట‌ల్‌తోపాటు భౌతిక కేంద్రాల్లో కూడా ఎలాంటి లావాదేవీలు జ‌రుగ‌వ‌ని వెల్ల‌డించారు. ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, జనన మరణ రిజిస్ట్రేషన్లు, భూమి సంబంధిత సేవలుసహా మొత్తం 500కుపైగా ప్రభుత్వ స‌ర్వీసులు ఈ రెండు రోజులు ప్రజలకు అందుబాటులో ఉండవ‌ని చెప్పారు.

మీ సేవ సెంటర్ల ద్వారా అందించే పౌర సేవలపై వినియోగ రుసుముల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం 50 శాతం పెంచింది. పెంచిన చార్జీలను గ‌త బుధవారం నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం అందించే సర్వీసెస్​పై 18 శాతం జీఎస్టీ విధించింది. కేటగిరీ-ఏ విభాగంలో రూ.35 నుంచి రూ.62కి, బీ కేటగిరీలో రూ.45 నుంచి రూ.80కి పెంచింది. అయితే చార్జీలను 50 శాతం పెంచినప్పటికీ జీఎస్టీ భారంతో కలిపి అవి 77-78 శాతం వరకు ఉండనున్నాయి. మరోవైపు మీ సేవ సెంటర్ల నిర్వాహకులకు వచ్చే కమీషన్‌ దాదాపు 15 ఏండ్ల‌ తర్వాత గణనీయంగా పెరిగింది.

గతంలో కేటగిరీ-ఏ సేవలు అందించినప్పుడు చెల్లించిన రూ.35 ఫీజుపై రూ.13 కమీషన్‌గా ఇచ్చేవారు. ఇప్పుడు దానిని రూ.62కి పెంచడంతో కమీషన్‌ రూ.40.34కి చేరింది. అలాగే కేటగిరీ-బీ సేవలపై ప్రస్తుతం రూ.80 వసూలు చేస్తుండ‌టంతో వారికి ఇచ్చే కమీషన్‌ రూ.52.10కి పెరిగింది. కేటగిరీ-ఏ, బీ సర్వీసుల్లో ఈ మొత్తం రూ.7గా ఉంది. అయితే కొన్ని సేవలకు మాత్రం ప్రభుత్వ వాటా ఉండదు. ఈ కొత్త ధరల చార్టులను అన్ని కేంద్రాల్లో ప్రదర్శించేందుకు డిజిటల్ డేటాబేస్‌ను సవరించేందుకు ఈ రెండు రోజుల విరామాన్ని ఉపయోగిస్తున్నారు. అత్యవసర పనులు ఉన్నవారు ఈ రెండు రోజులు మీసేవ కేంద్రాలకు వెళ్లి ఇబ్బంది పడవద్దని అధికారులు సూచించారు. ఏప్రిల్ 5 నుంచి యథావిధిగా సేవలు ప్రారంభమవుతాయ‌ని చెప్పారు.

Advertisement
Advertisement