త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao Dubbaka Speech | కాంగ్రెస్ తెచ్చిన కరువే ఇది.. రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి

దుబ్బాకలో జరిగిన 'రైతు పొలికేక' సదస్సులో కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు నిప్పులు చెరిగారు. కరెంట్ కోతలు, రైతుబంధు ఎగవేత, బీమా రద్దుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

J

Telangana | Published On Sep 5, 2026, 2.58 pm IST

Harish Rao Dubbaka Speech | కాంగ్రెస్ తెచ్చిన కరువే ఇది.. రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి
Advertisement
  • దుబ్బాక నియోజకవర్గం హబ్సిపూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భారీ కార్యక్రమం, ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీశ్ రావు
  • కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, ఎరువుల కొరత, పండించిన వడ్లకు తరుగు పేరిట రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శ
  • రూ.29 వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టడంతో పాటు, ప్రీమియం కట్టకుండా రైతు బీమాను రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని ఆరోపణ
  • ప్రాజెక్టును ఆపేసి రేవంత్ రెడ్డి కావాలనే రాష్ట్రంలో కరువు తెచ్చారని, మోసపూరిత హామీలపై రైతులు, మహిళలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపు
  • దుబ్బాక 'రైతు పొలికేక'లో హరీశ్ రావు ఫైర్

Harish Rao Dubbaka Speech | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో రైతుల సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై దుబ్బాక నియోజకవర్గం హబ్సిపూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆధ్వర్యంలో 'రైతు పొలికేక' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ విధానాలను ఎండగట్టారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో పండుగలా ఉన్న వ్యవసాయం, నేడు కరెంట్ (Current) కోతలు, ఎరువుల కొరత, మద్దతు ధర లేకపోవడంతో దయనీయంగా మారిందని విమర్శించారు.

Harish Rao Demands CM Revanth Reddy's Resignation Over Failed Youth Promises

మళ్లీ పాత రోజులు.. రోడ్డెక్కిన రైతులు

మా తెలంగాణ మాకు కావాలని రోడ్ల మీద వంటా వార్పు చేస్తే రాష్ట్రం సిద్ధించిందని, కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల పాటు రైతులు అంతా చల్లగా ఉన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ, రేవంత్ రెడ్డి పుణ్యమా అని మళ్లీ రోడ్ల మీదకు వచ్చి వంటా వార్పు చేయాల్సిన ఖర్మ రైతులకు పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కేసీఆర్ లాగా రైతులకు అండగా నిలవాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామన్నారు. కేసీఆర్ హయాంలో 24 గంటల పాటు కరెంట్ ఉంటే.. ఇందిరమ్మ పాలన, పాత రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి నిజంగానే పవర్ కట్స్ (Power cuts) తో కరెంట్ కష్టాల పాత రోజులను వెనక్కి తెచ్చారని మండిపడ్డారు. ఎనిమిది గంటల కరెంట్ కూడా సరిగ్గా రాక, పొద్దున లేస్తే రైతుల నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు.

Harish Rao Demands CM Revanth Reddy's Resignation Over Failed Youth Promises

రైతుబంధు ఎగ్గొట్టి.. బీమాను బంద్ చేసి..

ఓట్ల కోసం ఏనాడూ హామీ ఇవ్వకపోయినా, రైతుల కష్టం చూసి రైతుబంధు (Rythu Bandhu) ప్రారంభించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని హరీశ్ రావు కొనియాడారు. కరోనా లాక్‌డౌన్ (Lockdown) లాంటి కష్టకాలంలో ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలు సగం ఆపి, కాంట్రాక్టర్ల బిల్లులు (Bills) పెండింగ్‌లో పెట్టి మరీ రైతులకు పక్కాగా సాయం చేశారన్నారు. కానీ కేసీఆర్ పది వేలు ఇస్తే, తాను రూ.15 వేలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి, ఉన్నదాన్నే ఎగ్గొట్టిన మోసగాడని ఫైర్ అయ్యారు. వచ్చిన ఈ మూడేళ్లలో సుమారు రూ.29 వేల కోట్ల రైతుబంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆరోపించారు. అలాగే, పాముకాటుకో, కరెంట్ షాక్ తోనో రైతు చనిపోతే దినవారాలు కాకముందే దక్కే రూ.5 లక్షల రైతు బీమాను కూడా సర్కార్ ఉసురు పోసుకుంటూ నిలిపివేసిందన్నారు. ఈ నెల 13న ప్రీమియం (Premium) కట్టకుండా రేవంత్ రెడ్డి బీమాను బంద్ చేశారని మండిపడ్డారు.

Harish Rao Demands CM Revanth Reddy's Resignation Over Failed Youth Promises

యాప్ లతో అవస్థలు.. దళారులకే దన్ను

దుకాణానికి వెళ్లి నాలుగు సంచుల యూరియా (Urea) తెచ్చుకునే రోజులు పోయాయని, వ్యవసాయానికి డీఏపీ, యూరియా కావాలంటే యాప్ లలో (Apps) బుక్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందన్నారు. బుక్ చేసిన 15 రోజులకు గానీ ఎరువులు దొరకడం లేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీఏపీ ధరలను రూ.900 నుంచి రూ.2200కి పెంచితే, రాష్ట్ర ప్రభుత్వం యాప్‌లతో రైతుల ఉసురు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు కొనుగోలులో బస్తాకు 5 కిలోల తరుగు పెడుతూ రైతుల కడుపు కొడుతున్న మిల్లర్ల చేతిలో ముఖ్యమంత్రి కీలుబొమ్మగా మారారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తరుగు తీస్తే తోలు తీస్తానన్న సీఎం.. నేడు మిల్లర్లకే వత్తాసు పలుకుతున్నారన్నారు. ఏ పంట పండినా కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ ది అయితే, రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రం ఏది కొనమంటే అదే కొంటానని చేతులెత్తేస్తున్నారని విమర్శించారు. "కేంద్రం కొనకపోతే రాష్ట్ర సీఎంగా నీ బాధ్యత ఏంటి? చేతకాకపోతే కుర్చీ దిగిపో" అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Harish Rao Demands CM Revanth Reddy's Resignation Over Failed Youth Promises

ఇది రేవంత్ తెచ్చిన కరువే..

మండుటెండల్లో మల్లన్న సాగర్ గేట్లు ఎత్తి కూడెల్లి వాగులో నీళ్లు పారించి రైతుల పొలాలను పచ్చగా ఉంచిన భగీరథుడు కేసీఆర్ అని హరీశ్ రావు ప్రశంసించారు. కానీ, రేవంత్ రెడ్డి వచ్చిన మూడేళ్లలో మెదక్, దుబ్బాక, సిద్దిపేటలో ఒక్క ఎకరా కాలువ కూడా తవ్వలేదన్నారు. మేడిగడ్డ వద్ద చిన్న బుడ్డ పిల్లర్ (Pillar) కు మరమ్మతులు చేయకుండా, మోటార్లు ఆన్ చేయకుండా కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టును పడుకోబెట్టారని ఆరోపించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువేనని స్పష్టం చేశారు.

Harish Rao Demands CM Revanth Reddy's Resignation Over Failed Youth Promises

మోసపూరిత హామీలపై బుద్ధి చెప్పాలి

రైతులను ఆదుకున్న కేసీఆర్ రైతు బాంధవుడైతే, రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షసంగా మారిందని, వెయ్యి రోజుల పాలనలో రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి రాబందులా మారారని ఫైర్ అయ్యారు. ఈ 1000 రోజుల పాలనలో వెయ్యి అబద్ధాలు, కబ్జాలు, మోసాలు తప్ప మరేమీ లేదన్నారు. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి మాట తప్పిన రేవంత్ అసలు మనిషేనా అని ప్రశ్నించారు. రూ.4 వేల పెన్షన్ ఇస్తానని మోసం చేయడమే కాకుండా ఉన్న 3 లక్షల 50 వేల పెన్షన్లు (Pensions) తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి మచ్చుకైనా కనిపించడం లేదని, తులం బంగారం పేరుతో ఆడబిడ్డలను నిలువునా మోసం చేశారన్నారు. కరెంట్, రైతుబంధు, రైతుబీమా పక్కాగా రావాలంటే మళ్లీ కేసీఆర్ నాయకత్వం రావాలని, కాంగ్రెస్ మోసాలకు రైతులు, మహిళలు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Harish Rao Demands CM Revanth Reddy's Resignation Over Failed Youth Promises Harish Rao Demands CM Revanth Reddy's Resignation Over Failed Youth Promises Harish Rao Demands CM Revanth Reddy's Resignation Over Failed Youth Promises Harish Rao Demands CM Revanth Reddy's Resignation Over Failed Youth Promises

Advertisement
Advertisement