త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | సామాజిక తెలంగాణ సాధించే వ‌ర‌కు పోరాటం చేస్తా : క‌ల్వ‌కుంట్ల క‌విత‌

Kalvakuntla Kavitha | తెలంగాణ‌లోని అన్ని వ‌ర్గాల‌కు అధికారం రావాల‌న్న‌దే త‌న ధ్యేయ‌మ‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత స్ప‌ష్టం చేశారు. అంద‌రికీ అధికారం అని మాట్లాడ‌డం ప్రారంభించాకే త‌న‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ప్ర‌తి క‌ష్టాన్ని పాఠంగా భావిస్తూ.. సామాజిక తెలంగాణ సాధించే వ‌ర‌కు పోరాటం చేస్తాన‌ని క‌విత తేల్చిచెప్పారు.

S

Telangana | Published On Apr 17, 2026, 5.36 pm IST

Kalvakuntla Kavitha | సామాజిక తెలంగాణ సాధించే వ‌ర‌కు పోరాటం చేస్తా : క‌ల్వ‌కుంట్ల క‌విత‌
Advertisement

Kalvakuntla Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లోని అన్ని వ‌ర్గాల‌కు అధికారం రావాల‌న్న‌దే త‌న ధ్యేయ‌మ‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత స్ప‌ష్టం చేశారు. అంద‌రికీ అధికారం అని మాట్లాడ‌డం ప్రారంభించాకే త‌న‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ప్ర‌తి క‌ష్టాన్ని పాఠంగా భావిస్తూ.. సామాజిక తెలంగాణ సాధించే వ‌ర‌కు పోరాటం చేస్తాన‌ని క‌విత తేల్చిచెప్పారు.

తెలంగాణ జాగృతి పెట్టబోయే పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా జాగృతి కార్యాలయంలో కవితను సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న సహచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు క‌లిసి మ‌ద్ద‌తు ప‌లికారు.

ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. మారోజు వీరన్న అనుచరుల మద్దతు ఎంతో శక్తినిచ్చింది. మారోజు వీరన్న అభిమానుల ఈ మీటింగ్‌లో ఎక్కువ మంది మహిళలు కనిపిస్తున్నారు. ఇదే విధంగా రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి. మూడు, నాలుగేళ్ల క్రితం మనం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసి మహిళ బిల్లు వచ్చేలా చేశాం. గతంలోనే ఈ బిల్లు ఆమోదం పొందింది. కానీ మళ్లీ అదే బిల్లును పాస్ అంటూ మోసం చేస్తున్నారు. ఏ వర్గాలకు రావాల్సిన ప్రయోజనాలను ఆ వర్గాలకు అందించకుండా ప్రతి దాంట్లో రాజకీయ ప్రయోజనం చూసుకుంటున్న పరిస్థితి ఉంది. మనందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు చాలా మంది బహుజన తెలంగాణ అంటూ జయశంకర్ సార్ వద్ద ప్రస్తావించారు. జయశంకర్ సార్ జాగృతి సంస్థకు మార్గదర్శకులు, నేను ఆయనకు వీరాభిమానిని. బహుజన తెలంగాణ అనే అంశాన్ని ఆయన ముందు నేను కూడా ప్రస్తావించాను. ఇదే పరిస్థితి భారత్ కు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేడ్కర్, గాంధీ ముందు కూడా వచ్చిందని ఆయన చెప్పారు. భారత కుల వ్యవస్థలో నిరంతరం ఈ అంశం మన ముందుకు వస్తూనే ఉంటుందని అన్నార‌ని క‌విత గుర్తు చేశారు.

రాష్ట్రంలో కుల సంఘాల ఏర్పాటుకు కర్త, కర్మ, క్రియ అన్ని ఆయనే..

అయితే ముందు మనం భౌగోళిక తెలంగాణ సాధించుకోవాలి. ఆ తర్వాత సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయాలని జయశంకర్ సార్ చెప్పారు. కానీ తెలంగాణ వచ్చిన 12 ఏళ్లలో సామాజిక తెలంగాణ రాలేదు, ఏ వర్గానికి సంపూర్ణంగా న్యాయం జరగలేదు. ఇప్పటికీ చాలా కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం తప్పుల తడకగా చేసిన సర్వేలో కూడా చాలా కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయన్న విషయం స్పష్టంగా తెలిసింది. గ్రామాల్లో వార్డు మెంబర్, సర్పంచ్ కూడా కాని కులాలు ఎన్నో ఉన్నాయి. కులాలు బలంగా మారినప్పుడు మాత్రమే వారికి న్యాయం జరగుతుందని మారోజు వీరన్న నమ్మేవారు. అందుకే ఆయన కులాల అస్తిత్వ పోరాటాలకు విప్లవ పోరాటాలను జత చేశారు. రాష్ట్రంలో కుల సంఘాల ఏర్పాటుకు కర్త, కర్మ, క్రియ అన్ని ఆయనే. అన్ని కులాలకు న్యాయం జరగాలంటే కుల సంఘాలు బలపడాలంటూ కుల సంఘాలను ఆయన ఏర్పాటు చేశారు. ఆయన మన ముందు పెట్టిన బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముంది. తెలంగాణలో అందరికీ ప్రాధాన్యం ఉండాలని మనం అనుకున్నాం అని క‌విత తెలిపారు.

ఎన్ని కష్టాలు వస్తే అంత కసి నాలో పెరిగింది..

నేను ఎప్పుడైతే అందరికీ అధికారం కావాలని మాట్లాడటం మొదలుపెట్టనే అప్పటి నుంచే నాకు కష్టాలు మొదలయ్యాయి. కానీ ఎన్ని కష్టాలు వస్తే అంత కసి నాలో పెరిగింది. ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా నేను భావించాను. కచ్చితంగా తెలంగాణలో సామాజిక న్యాయం అన్ని వర్గాలకు జరిగే వరకు పోరాటం చేస్తాను. ఈ నెల 25న మేము నూతన రాజకీయ శక్తిగా వస్తున్నాం. తెలంగాణ ప్రాంతీయ తత్వాన్ని, సామాజిక కోణాన్ని రంగరించే ప్రయత్నం చేస్తున్నాం. మారోజు వీరన్న లాంటి గొప్ప వ్యక్తి ఫాలోవర్స్ మాకు మద్దతివ్వటం చాలా సంతోషంగా ఉంది. పార్టీ పెడుతున్న సందర్భంగా మీరిస్తున్న ధైర్యం మామూలుది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో దాదాపు లక్ష మంది మాజీ మావోయిస్టులు బీఆర్ఎస్‌లో చేరారు. బీఆర్ఎస్ బలోపేతం కావటానికి వాళ్లంతా ఒక చోదక శక్తిగా మారారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాళ్లెవరికీ కూడా న్యాయం జరగలేదు. తెలంగాణ ఉద్యమకారులు, అమర వీరుల కుటుంబాల కోసం ఏ విధంగా భూపోరాటం చేస్తున్నామో...మాజీ మావోయిస్టుల కోసం కూడా అదే విధంగా పోరాటం చేస్తామ‌ని క‌విత పేర్కొన్నారు.

సర్వోదయ తెలంగాణ సాధించటమే నా గోల్..

మా పోరాటానికి ఇప్పుడు మారోజు వీరన్న అనుచరులు తోడయ్యారు. ఇక మనల్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. మారోజు వీరన్న ఫాలోవర్స్ అంటే ఎంతో నైతికతో ఉంటారు. తెలంగాణ ప్రజల కోసం మనమందరం కలిసి పనిచేద్దాం. సర్వోదయ తెలంగాణ సాధించటమే నా గోల్. మీరిస్తున్న నైతిక ధైర్యం తో నా లక్ష్యం కోసం ముందుకు వెళ్తాన‌ని క‌విత స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement