త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Goud | బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ పవన్ క‌ల్యాణ్‌.. పీసీసీ చీఫ్ మ‌హేశ్‌గౌడ్ ధ్వ‌జం

Mahesh Goud | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న వెనుక ఉన్న త్యాగాలను అవమానించేలా మాట్లాడటం బాధాక‌ర‌మ‌న్నారు.

P

Telangana | Published On Jun 15, 2026, 3.56 pm IST

Mahesh Goud | బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ పవన్ క‌ల్యాణ్‌.. పీసీసీ చీఫ్ మ‌హేశ్‌గౌడ్ ధ్వ‌జం
Advertisement

Mahesh Goud | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న వెనుక ఉన్న త్యాగాలను అవమానించేలా మాట్లాడటం బాధాక‌ర‌మ‌న్నారు. పవన్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌లు బీజేపీ వైఖరినే ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందని, ఎన్నో ఏళ్ల ఉద్యమం, అనేక మంది అమరుల త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. అలాంటి చారిత్రక అంశాలను తక్కువ చేసి మాట్లాడటం సమంజసం కాదన్నారు. "మోదీ, బీజేపీ నేతలు కించపరుస్తున్నారు.. బీజేపీ ఆడించే తోలుబొమ్మ పవన్ కళ్యాణ్.. ఇదేమీ సినిమా కాదు.. విచ్చలవిడిగా మాట్లాడటానికి" అంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు.

ఇంత పెద్ద హీరో ఎలా అయ్యావ్‌..

తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. రాష్ట్ర ప్రజల మద్దతు లేకుండా ఎవరికీ రాజకీయ గుర్తింపు రాదన్నారు. "తెలంగాణ ప్రజలు చూడనిదే నీ సినిమాలు ఆడాయా.. ఇంత పెద్ద హీరో అయ్యావా?" అంటూ పవన్‌పై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించిన ఆయన, రాజకీయాల్లో పవన్ క‌ల్యాణ్ ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. అధికారంలో ఉన్నామనే భావనతో తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్య‌మంలో నెహ్రూ, గాంధీ కుటుంబాల పాత్ర గురించి అవగాహన పెంచుకోవాలని పవన్‌కు సూచించారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేయాలంటే వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ చేసిన సేవలను గుర్తు చేస్తూ "మీ నాయకుడు మోదీ రాకెట్ ముందు ఫొటోలు దిగుతున్నారు అది కాంగ్రెస్ ఘనత" అని వ్యాఖ్యానించారు. తెలంగాణ విభజనను ఇప్పటికీ ప్రశ్నించడం సరికాదని, రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడే ముందు తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ పాత్ర ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.

ఉద్య‌మంలో ప‌వ‌న్ క‌ల్యాన్ ఎక్క‌డ‌?

"తెలంగాణ ఉద్యమంలో పవన్ కల్యాణ్ ఎక్కడున్నాడు.. ఏ సినిమాల్లో ఉన్నాడు" అంటూ నిలదీశారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదని పేర్కొన్న మహేశ్‌కుమార్ గౌడ్, బీజేపీ-జనసేన మధ్య లోపాయికారీ అవగాహన ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు వేరైనా ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని, రాజకీయ ప్రయోజనాల కోసం విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించకపోవడంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. వారి మౌనం వెనుక రాజకీయ ఒప్పందాలు ఉన్నాయని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌న్నారు.

Advertisement
Advertisement