త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ స‌భ్యులుంటే తేజ‌స్వి సూర్య‌తో క్ష‌మాప‌ణ చెప్పించేవాళ్లం : కేటీఆర్‌

P

Telangana | Published On Apr 27, 2026, 7.35 pm IST

KTR | లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ స‌భ్యులుంటే తేజ‌స్వి సూర్య‌తో క్ష‌మాప‌ణ చెప్పించేవాళ్లం : కేటీఆర్‌
Advertisement

KTR | బీఆర్‌ఎస్ ఎంపీ లోక్‌సభలో ఉంటే తేజస్వి సూర్యను నిలదీసి క్షమాపణ చెప్పించేవారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో సోమ‌వారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోలుస్తూ చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

భావోద్వేగాల‌ను గాయ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని చెప్పా..

ఈ అంశంపై తేజస్వి సూర్య త‌న‌కు ఫోన్ చేసి మాట్లాడార‌ని కేటీఆర్ వెల్ల‌డించారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని, అవి అనేక మంది భావోద్వేగాలను గాయపరిచే విధంగా ఉన్నాయన్నారు. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని తాను ఆయనకు స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. “మీరు మాట్లాడింది చాలా తప్పు. చాలా మంది హృదయాలు గాయపడేలా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా లేక పార్టీ అభిప్రాయమా అనేది నాకు తెలియదు. కానీ మాట్లాడిన విధానం మాత్రం సరైంది కాదు” అని తాను తేజస్వి సూర్యకు గట్టిగా చెప్పినట్లు కేటీఆర్ వివరించారు.

బీఆర్ఎస్ ఎంపీలు లేక‌నే..

తేజస్వి సూర్య స్వయంగా తనకు ఫోన్ చేసి “బ్రదర్, నేను ఏదో అన్నాను.. మీవాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారు” అని చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలోనే తాను స్పష్టంగా స్పందించినట్లు తెలిపారు. అంతకుముందు, పార్లమెంటులో తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మొత్తం 16 మంది ఉన్నప్పటికీ, ఇలాంటి వ్యాఖ్యలపై సరైన స్పందన లేకపోవడం పట్ల కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు అక్కడ కూర్చుని ఉత్సవ విగ్రహాల్లా వ్యవహరించారని విమర్శించారు. కనీసం బీఆర్‌ఎస్ ఎంపీ లోక్‌సభలో ఉంటే అక్కడికక్కడే స్పందించి తేజస్వి సూర్యను నిలదీసి క్షమాపణ చెప్పించేవారని స్ప‌ష్టం చేశారు. రాజ్యసభలో బీఆర్‌ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు వెంటనే స్పందించి తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ పౌరుషం నిలబెట్టే బీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని, ప్రజలు దీనిపై ఆలోచించాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement