త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | వ‌డ్ల కొనుగోలుపై కేటీఆర్ అసంతృప్తి.. రోడ్ల‌పై వ‌చ్చి ఆందోళ‌న చేస్తామ‌ని వార్నింగ్‌..!

KTR | సిరిసిల్లలో వడ్ల కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు న్యాయం చేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

P

Telangana | Published On Apr 25, 2026, 9.30 pm IST

KTR | వ‌డ్ల కొనుగోలుపై కేటీఆర్ అసంతృప్తి.. రోడ్ల‌పై వ‌చ్చి ఆందోళ‌న చేస్తామ‌ని వార్నింగ్‌..!
Advertisement

KTR | సిరిసిల్ల నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రాలను సందర్శించిన ఆయన, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత నెల రోజులుగా రైతులు వడ్లు కొనుగోలు కేంద్రాలకు తెస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదని కేటీఆర్ ఆరోపించారు. మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లు చేపట్టడం లేదని విమర్శించారు. రైస్ మిల్లుల కేటాయింపు లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు.

మిల్లులు కేటాయించకపోతే వడ్లు ఎవరు కొనాలి? ఎలా తూకం వేయాలి..? అని ప్రశ్నించారు. ఈ పరిస్థితిని దళారులకు వదిలేసి కమిషన్ల కోసం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రైతుబంధు పథకం పేరుతో ప్రకటించిన సాయం కూడా అందడం లేదని కేటీఆర్ అన్నారు. స్థానిక అధికారులను అడిగితే ఇప్పటివరకు 1000 క్వింటాళ్ల వడ్లు కూడా కొనలేదని చెప్పడం పరిస్థితి తీవ్రతను చూపుతోందని వ్యాఖ్యానించారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు తెచ్చిన ధాన్యం తడిసిపోతూ నష్టపోతున్నారని, టార్పాలిన్ కవర్లు కొనుగోలు చేసి కప్పుకోవాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. ఇలాంటి దౌర్భాగ్యకర పరిస్థితులు ఎక్కడా చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైతుల వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్, లేనిపక్షంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మరో రెండేళ్లలో తిరిగి తమ ప్రభుత్వం వస్తుందని, అప్పటివరకు రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు.

Advertisement
Advertisement