త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Srihari | నిరుద్యోగుల గురించి కేటీఆర్ మాట్లాడ‌డం సిగ్గుచేటు : మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి

Minister Srihari | తొమ్మిదిన్నర ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణ యువతను మోసం చేసిన బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు. సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్‌ నిర్వహించిన నిరుద్యోగుల సభలో కేటీఆర్‌ చేసిన ప్రసంగంపై ఆయన తీవ్రంగా స్పందించారు.

P

Telangana | Published On Jul 18, 2026, 5.42 pm IST

Minister Srihari | నిరుద్యోగుల గురించి కేటీఆర్ మాట్లాడ‌డం సిగ్గుచేటు : మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి
Advertisement

Minister Srihari | తొమ్మిదిన్నర ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణ యువతను మోసం చేసిన బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు. సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్‌ నిర్వహించిన నిరుద్యోగుల సభలో కేటీఆర్‌ చేసిన ప్రసంగంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సరూర్‌నగర్‌ సభలో కేటీఆర్‌ ప్రసంగమంతా “అధికారం ఇవ్వండి.. రాష్ట్రాన్ని మళ్లీ ఆగం చేస్తాం” అన్నట్లుగా సాగిందని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలోని యువతకు అండగా నిలబడతామని కేటీఆర్‌ చెబుతున్నారని, ముందుగా మీ కుటుంబంలోనే అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న ఆడబిడ్డకు అండగా నిలబడాలని ఆయన వ్యాఖ్యానించారు. “రాష్ట్రంలోని యువతకు అండగా నిలబడతామని కేటీఆర్‌ చెబుతున్నారు. ముందుగా మీ కుటుంబంలోనే అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న ఆడబిడ్డకు అండగా నిలబడండి కేటీఆర్‌” అని మంత్రి వాకిటి శ్రీహరి ఘాటుగా వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్‌ ప్రభుత్వం 114 నెలలు అధికారంలో ఉండి రెండు మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా అమలు చేయలేదని మంత్రి ఆరోపించారు. కేవలం 31 నెలల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతోందని, అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల్లోనే లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని మంత్రి తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసింది బీఆర్ఎస్‌ ప్రభుత్వమేనని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించింది ఎవరో కేటీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

దళితులకు మూడెకరాల భూమి, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు, అమరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, 10 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం వంటి హామీలను బీఆర్ఎస్‌ ఎందుకు అమలు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది కూడా బీఆర్ఎస్‌ ప్రభుత్వమేనన్నారు. “అధికారం కోసం రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ను క్షమించరు. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్‌ పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు మొసలి కన్నీరు కార్చినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు” అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు, రైతులకు సంక్షేమం, మహిళలకు భరోసా, పేదలకు ఇళ్లు, బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement