త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maktal | మ‌క్త‌ల్ – నారాయ‌ణ‌పేట.. రూ. 237 కోట్ల‌తో నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు శంకుస్థాప‌న‌

Maktal | మక్తల్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రూ. 237 కోట్లతో మక్తల్ - నారాయణపేట నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు మంత్రులు వాకిటి శ్రీహ‌రి, జూప‌ల్లి కృష్ణారావుతో క‌లిసి రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు.

S

Telangana | Published On Jul 13, 2026, 2.59 pm IST

Maktal | మ‌క్త‌ల్ – నారాయ‌ణ‌పేట.. రూ. 237 కోట్ల‌తో నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు శంకుస్థాప‌న‌
Advertisement

Maktal | త్రినేత్ర‌.న్యూస్ : మక్తల్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రూ. 237 కోట్లతో మక్తల్ - నారాయణపేట నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు మంత్రులు వాకిటి శ్రీహ‌రి, జూప‌ల్లి కృష్ణారావుతో క‌లిసి రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా హ్యామ్ రోడ్ల పైలాన్‌ను మంత్రులు ఆవిష్క‌రించారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభమైన రోడ్ల నిర్మాణ పనులు చారిత్రాత్మకమైనవని అన్నారు. ప్రజాప్రభుత్వం ప్రజల అవసరాలనే ప్రాధాన్యంగా తీసుకొని ఈ భారీ రహదారి ప్రాజెక్టులను మంజూరు చేసిందని తెలిపారు. మక్తల్ నుంచి నారాయణపేట వరకు రహదారి నిర్మాణం ఎన్నో ఏళ్లుగా అగ్నిపరీక్షగా మారిందన్నారు. దాదాపు పది మంది కలెక్టర్లు, పలువురు ఎమ్మెల్యేలు మారినా ఈ రోడ్డు మంజూరు కాలేదని గుర్తు చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పిందని, కానీ నాణ్యమైన రహదారుల నిర్మాణంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పదేళ్ల పాటు మాటలు, ప్రచార ఆర్భాటాలు, రంగురంగుల హామీలతో ప్రజలను మోసం చేశారని అన్నారు. నిర్మించిన రహదారులు కూడా నాసిరకంగా ఉండటంతో వందలాది గుంతలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల రవాణా కష్టాలు తొలగించాలనే సంకల్పంతో రూ.237 కోట్లతో మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారిని ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. మక్తల్ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి పని కోరినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులు వెంటనే సానుకూలంగా స్పందిస్తూ నిధులు మంజూరు చేస్తున్నారని, ఇందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన మక్తల్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధి బాటలో దూసుకుపోతోందని, ప్రజలు స్వేచ్ఛగా, గౌరవంగా జీవించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. మక్తల్ అభివృద్ధి ప్రయాణానికి ప్రజల ఆశీర్వాదం, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.

Advertisement
Advertisement