త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha | సుశ్మిత వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు.. తెగేసి చెప్పిన మంత్రి కొండా సురేఖ‌

Konda Surekha | తన కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనకు షోకాజ్‌ నోటీసు ఇవ్వడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి తప్పు చేయని తనను బాధ్యురాలిని చేయడం సరికాదని పేర్కొన్నారు. తనపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకూ షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని ఇవ్వాల‌న్నారు.

P

Telangana | Published On Sep 2, 2026, 5.51 pm IST

Konda Surekha | సుశ్మిత వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు.. తెగేసి చెప్పిన మంత్రి కొండా సురేఖ‌
Advertisement
  • షోకాజ్ నోటీసులు ఇవ్వ‌డాన్ని త‌ప్పుప‌ట్టిన మంత్రి
  • తనను టార్గెట్‌ చేసిన వారికి నోటీసులివ్వాలని డిమాండ్‌

Konda Surekha | తన కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనకు షోకాజ్‌ నోటీసు ఇవ్వడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి తప్పు చేయని తనను బాధ్యురాలిని చేయడం సరికాదని పేర్కొన్నారు. తనపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకూ షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని ఇవ్వాల‌న్నారు. ఈ మేరకు తన ఆవేదనను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బుధవారం ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. మంత్రిగా తాను సమర్థంగా పనిచేస్తున్నానని, తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని చెప్పారు. తనకు అప్పగించిన శాఖలను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహిస్తున్నానని, ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నానని పేర్కొన్నారు.

భ‌ర్త‌ర‌ఫ్ అంశంపై మాట్లాడ‌లేదు..

తనను మంత్రిగా కొనసాగించాలని పార్టీ పెద్దలను కోరినట్లు తెలిపారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారని వెల్లడించారు. తనను బర్తరఫ్‌ చేయడం, సస్పెండ్‌ చేయడం వంటి అంశాలపై అధిష్ఠానం తనతో ఏమీ మాట్లాడలేదని సురేఖ స్పష్టం చేశారు. తనపై కొందరు నేతలు చేసిన వ్యాఖ్యల వెనుక ఇతరుల ప్రమేయం ఉందని ఆరోపించారు. అయితే వారి పేర్లు వెల్లడిస్తే వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని పేర్కొంటూ పేర్లు చెప్పేందుకు నిరాకరించారు. తనపై వ్యాఖ్యలు చేసిన వారు ఆ తర్వాత ఫోన్‌ చేసి, కొందరు పిలవడంతోనే వెళ్లి మాట్లాడామని చెప్పినట్లు తెలిపారు. తనపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపైనా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సురేఖ చెప్పారు. ‘‘నేను తప్పు చేయకుండానే నన్ను టార్గెట్‌ చేశారు. నాపై మాట్లాడిన వారికి కూడా షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలి. వారి వెనుక ఉండి ఎవరు మాట్లాడించారన్నదానిపైనా పార్టీ ఆలోచించాలి’’ అని అన్నారు.

చెప్పాల్సిందంతా చెప్పేశా..

మీనాక్షి నటరాజన్‌తో జరిగిన భేటీలో తనకు చెప్పాల్సిన విషయాలన్నీ వివరించినట్లు తెలిపారు. ఆమె తన వాదనను కేసీ వేణుగోపాల్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారని వెల్లడించారు. పీసీసీకి వచ్చిన ఫిర్యాదు మేరకే తనపై చర్యకు సిఫారసు చేశారని ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే తనకు షోకాజ్‌ నోటీసు ఇవ్వడమే తప్పని సురేఖ అభిప్రాయపడ్డారు. మంత్రివర్గం నుంచి తనను తప్పించేందుకు కుట్ర జరుగుతోందా? అన్న ప్రశ్నకు సురేఖ సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతానికి తన సమస్య షోకాజ్‌ నోటీసులేనని, దానిపైనే పార్టీ పెద్దలతో మాట్లాడినట్లు తెలిపారు. నోటీసుకు ఇప్పటికే సమాధానం ఇచ్చానని, తాను ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్నందున తన గోడును అధిష్ఠానానికి చెప్పుకున్నానని వివరించారు. తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని, వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉందన్నారు.

పార్టీ న‌న్ను ఏమీ అడుగ‌లేదు..

సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఈ వ్యవహారంపై ఇ-మెయిల్స్‌ పంపినట్లు తెలిపారు. ఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు కూడా తన వాదనను తెలియజేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి టికెట్లు ప్రకటిస్తున్నారన్న ప్రశ్నపై స్పందించేందుకు నిరాకరించారు. ఆ అంశాన్ని పార్టీకి వదిలేస్తున్నానని, దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. పార్టీ తనకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారా అన్న ప్రశ్నకు.. ఇప్పటివరకు తనను పార్టీ ఏమీ అడగలేదని చెప్పారు. నిర్ణయం తీసుకున్న తర్వాతే స్పందిస్తానన్నారు. కుమార్తె సుష్మిత ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా అన్న ప్రశ్నకు సురేఖ స్పందిస్తూ.. అవి ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలని చెప్పారు. వాటిని ఖండించడం, సమర్థించడం గురించి తాను మాట్లాడదలచుకోలేదన్నారు.

రోజు వంద మంది వ్యాఖ్య‌లు చేస్త‌రు

ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు చేస్తూ మంత్రి కుమార్తె చేసిన వ్యాఖ్యలను సమర్థించినట్లవుతుందని విలేకరులు ప్రశ్నించగా.. రోజూ వందల మంది ఎన్నో వ్యాఖ్యలు చేస్తుంటారని, వారిలో తన కుమార్తె కూడా ఒకరని అన్నారు. వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని స్పష్టం చేశారు. తన బాధలన్నింటినీ మీనాక్షి నటరాజన్‌కు వివరించానని, ఆమె అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి తనకు వెసులుబాటు కల్పిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement