త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్‌ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ (రీజినల్‌ రింగ్‌ రోడ్‌) ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్‌ విలువకు తగ్గకుండా పరిహారం అందించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. భూమి కోల్పోతున్న రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ట్రిపుల్ ఆర్‌ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అంశంపై శుక్రవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతితో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

P

Telangana | Published On Jul 24, 2026, 9.20 pm IST

Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్‌ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
Advertisement

Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ (రీజినల్‌ రింగ్‌ రోడ్‌) ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్‌ విలువకు తగ్గకుండా పరిహారం అందించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. భూమి కోల్పోతున్న రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ట్రిపుల్ ఆర్‌ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అంశంపై శుక్రవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతితో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో చౌటుప్పల్‌ ప్రాంత భూనిర్వాసిత రైతులతో కలిసి నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్‌ ధర కంటే తక్కువ పరిహారం తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. భూముల విలువకు అనుగుణంగా నష్టపరిహారం నిర్ణయించాలని కోరారు.

రైతులను ఉద్దేశించి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి కోసం కొన్ని సందర్భాల్లో రైతులు తమ భూములను త్యాగం చేయాల్సి వస్తుందని, అయితే ఆ త్యాగానికి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అన్నారు. రైతుకు భూమితో కేవలం ఆర్థిక సంబంధమే కాకుండా భావోద్వేగ అనుబంధం కూడా ఉంటుందని పేర్కొన్నారు. త్రిపుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌కు సంబంధించిన 3డీ నోటిఫికేషన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే జారీ అయిందని గుర్తు చేశారు. అప్పట్లోనే ఈ అలైన్‌మెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు. దివీస్‌ పరిశ్రమకు అనుకూలంగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అలైన్‌మెంట్‌ను మార్చిందని ఆరోపించారు. భూ సేకరణలో 2013 భూ స్వాధీనం, పునరావాసం, పునర్నిర్మాణ చట్టం ప్రకారమే నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తున్నామని చెప్పారు.

ఈ చట్టం ప్రకారం అందరికీ ఒకే విధమైన ప్రమాణాలతో పరిహారం నిర్ణయిస్తారని వివరించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జీవో 123 ద్వారా ప్రాంతాల వారీగా వేర్వేరు విధానాలు అనుసరించిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం చట్టబద్ధంగా రైతులకు సాధ్యమైనంత మెరుగైన పరిహారం అందించేందుకు కట్టుబడి ఉందని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అందుబాటులో ఉండే నాయకుడని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కలిసి ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించే అవకాశం ఉందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అలాంటి పరిస్థితి లేదని విమర్శించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement