త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Minister Kishan Reddy | నీలా హాజ‌రు వేయించుకునే వ్య‌క్తిని కాదు.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌కు కిష‌న్‌రెడ్డి కౌంట‌ర్‌..!

Union Minister Kishan Reddy | ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, బీజేపీతో పాటు వ్యక్తిగతంగా తనపై దాడి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిప‌డ్డారు. అభద్రత, అహంకారం, నిరాశ, నిస్పృహలతో తప్పుడు ప్రచారం చేస్తూ అసభ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వ‌జ‌మెత్తారు.

P

Telangana | Published On Jun 9, 2026, 9.15 pm IST

Union Minister Kishan Reddy | నీలా హాజ‌రు వేయించుకునే వ్య‌క్తిని కాదు.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌కు కిష‌న్‌రెడ్డి కౌంట‌ర్‌..!
Advertisement

Union Minister Kishan Reddy | ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, బీజేపీతో పాటు వ్యక్తిగతంగా తనపై దాడి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిప‌డ్డారు. అభద్రత, అహంకారం, నిరాశ, నిస్పృహలతో తప్పుడు ప్రచారం చేస్తూ అసభ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వ‌జ‌మెత్తారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దయాదాక్షిణ్యాలతో కేంద్రంలో బీజేపీ అధికారంలో లేదన్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు. తాను అంబర్‌పేట, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతోనే ఢిల్లీకి వెళ్లానని, తాను ఎవరికీ జవాబుదారిని కాదని స్పష్టం చేశారు. తాను తెలంగాణ ప్రజలకు, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు, బీజేపీ పార్టీకి మాత్రమే బాధ్యత వహిస్తానని చెప్పారు.

“రేవంత్ రెడ్డి మాదిరిగా ప్రతి నెలా రాహుల్ గాంధీ వద్ద హాజరు వేయించుకునే వ్యక్తిని నేను కాదు” అంటూ ఎద్దేవా చేశారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, అభివృద్ధి అంశాలపై చర్చకు తాను ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, ప్రాజెక్టుల విషయంలో ఎవరు కలిసినా సానుకూలంగా స్పందిస్తానని, తనకు ముఖ్యమంత్రి సర్టిఫికెట్ అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తనపై చేసిన ఆరోపణల్లో ఒక్క ప్రాజెక్టు అయినా తాను అడ్డుకున్నానని నిరూపించాలని సవాల్ విసిరారు. ఇందుకోసం సీనియర్ జర్నలిస్టులతో కమిటీ వేసి విచారణ జరిపించాలని సూచించారు. ఆరోపణలు నిజమని తేలితే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.

రేవంత్ రెడ్డి తరహాలో తాను “చిల్లర మాటలు” మాట్లాడనని, బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని, ప్రెస్ క్లబ్‌కైనా లేదా అసెంబ్లీ వద్ద అమరవీరుల స్తూపం వద్దకైనా రావాలని సవాల్ చేశారు. తెలంగాణను మిగులు రాష్ట్రం నుంచి అప్పుల కుప్పగా మార్చారని బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలపై ఆరోపణలు గుప్పించారు. రెండు పార్టీలు ఒకే తరహా దోపిడీకి పాల్పడుతున్నాయని విమర్శించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో తనపై చేసిన ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. అపాయింట్‌మెంట్ కావాలంటే అడగాల్సిందేనని, అడ్డుకోవడం అన్న ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. అలాగే మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని తెలిపారు.

Advertisement
Advertisement