త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | కేసీఆర్‌ మారిన మనిషి.. మర మనిషి..

Kavitha | తెలంగాణ‌లో మ‌రో నూత‌న పార్టీ ఆవిర్భ‌వించింది. తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) కొత్త రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించారు. పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన (TRS) అని నామ‌క‌ర‌ణం చేశారు.

G

Telangana | Published On Apr 25, 2026, 11.03 am IST

Kavitha | కేసీఆర్‌ మారిన మనిషి.. మర మనిషి..
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ‌లో మ‌రో నూత‌న పార్టీ ఆవిర్భ‌వించింది. తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) కొత్త రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించారు. పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన (TRS) అని నామ‌క‌ర‌ణం చేశారు. మేడ్చ‌ల్ జిల్లా మునీరాబాద్ జ‌రుగుతున్న పార్టీ ఆవిర్భావ స‌భ వేదిక‌గా ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అనంత‌రం పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) ఉద్యమంలో కీలక పాత్ర పోషించాన‌ని చెప్పారు. త‌న‌కు సింగరేణి అంటే చాలా ఇష్టమ‌ని చెప్పారు.

`తెలంగాణ ఆడబిడ్డలను ఏకం చేసిన ఘనత జాగృతిదే. బతుకమ్మతో తెలంగాణ సంస్కృతిని చాటాం. బతుకమ్మను ప్రపంచానికి పునఃపరిచయం చేసుకున్నాం. తెలంగాణ ఉద్యమానికి బలమైన సాంస్కృతి పునాది వేసింది జాగృతి. అయితే వచ్చిన తెలంగాణ ఎక్కడో దారి తప్పింది. 12 ఏండ్లు గడిచినా తెలంగాణ కలలన్నీ ఇంకా నిజం కాలేదు. సామాజిక తెలంగాణ రథచక్రం ఎక్కడో విరిగి ముక్కలైంది. తెలంగాణ ఆనాడు పాలించిన కుటుంబంలో నేను భాగమైనందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నా. ఆనాడు ఇసుక మాఫియా ఎన్నో దారుణాలకు పాల్పడింది. అలాగే తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు మాత్రం గర్వపడుతున్నా.

తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలి. తప్పు సరిదిద్దుకునేందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేనతో మీ ముందుకు వచ్చాను. బీఆర్‌ఎస్‌ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. మంచి చేయాలంటే రాజకీయ పార్టీ ఉండాలి. తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మందికి అమ్మగా మారాలనుకుంటున్నా. బిడ్డల కష్టం అమ్మకే తెలుస్తుంది. అప్పుడే రాష్ట్ర ప్రజల కష్టాలు తీరతాయన్నారు.

గుంట‌న‌క్క‌ల చేతిలో కేసీఆర్‌

పార్టీ ఆవిర్భావ స‌భ వేదిక బీఆర్ఎస్ అధినేత, త‌న తండ్రి కేసీఆర్‌పై క‌విత‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ప్రస్తుతం గుంటనక్కల చేతిలో చిక్కుకున్నారని ఆరోపించారు. ఇండ్ల‌ను కూల్చివేస్తున్న సమయంలో బాధితులను అమ్మలా ఆదుకోవాల్సిన కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయ పరిపక్వత కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. కేసీఆర్ మరబొమ్మలా మారారని, అందుకే తాను యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

`ఆనాటి కేసీఆర్‌ వేరు.. ఇప్పటి కేసీఆర్‌ వేరు. చేనేత కార్మికులు చనిపోతుంటే.. ఆనాటి కేసీఆర్‌ భిక్షాటన చేశారు. ఇవాళ్టి కేసీఆర్‌ మారిన మనిషి.. మర మనిషి.. మన మనిషి కాదు. ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ఆ సార్‌ రారు.. ఎందుకంటే ఆయన మారిన మనిషి. గుంటనక్కలు, తోడేళ్ల చేతిలో కేసీఆర్‌ ఖైదీ అయ్యారు. పంజాబ్‌, గుజరాత్‌, బిహార్‌ వెళ్లి జాతీయ పార్టీ పెట్టాలని చూశారు. కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉండి ఉంటే పాలమూరు పూర్తయ్యేది. నేను ఎన్ని మాట్లాడినా బీఆర్‌ఎస్‌ నేతలు బయటకు వచ్చి జవాబివ్వట్లేదు. సమాధానం చెప్పకపోతే.. ప్రజలే బయటకు లాగి జవాబు చెప్పేలా చేస్తారు.` అని క‌విత అన్నారు.

తెలంగాణ బిడ్డ‌లైతే..

బీజేపీకి తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు. తల్లిని చంపారు, పిల్లను బతికించారని ఒకరు అంట‌రు. భారత్‌, పాక్‌ను విడదీసినట్లు ఆంధ్ర‌, తెలంగాణ‌ను విడ‌దీశార‌ని త‌ల‌కాయ మీద మెడ‌కాయ లేని ఓ ఎంపీ అంట‌రు. వాళ్ల అగ్ర‌నాయ‌క‌త్వం ఇన్ని మాట‌లు అంటుంటే.. మ‌న ప్రాంతంలో ఉన్న‌ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట మాట్లాడరు. ఫెడ‌ర‌ల్ స్ఫూర్తికి వ్య‌తిరేకంగా తెలంగాణ నుంచి 7 మండలాలు లాక్కుంటే బీజేపీ ఎంపీలు మాట్లాడరు. మ‌న‌కు రూ.8 ఇవ్వ‌క‌పోతే ఒక్కమాట మాట్లాడ‌రు. విభజన హామీలు నెరవేర్చకపోతే బీజేపీ ఎంపీలు మాట్లాడరు. సామాజిక న్యాయానికి బద్ధ వ్యతిరేకి బీజేపీ. మహిళా బిల్లు అయితే మోసం.. రెండుసార్లు ఆమోదించి.. మొత్తానికే పక్కనపెట్టారు. బీసీ బిల్లును తొక్కి పెట్టారు. కుల‌గ‌ణ‌న చేస్త‌మ‌న్న‌రు.. దానినీ తొక్కిపెట్టారు. పేద‌ల‌కు అన్న‌పెట్టే ఉపాధి హామీ ప‌థ‌కాన్ని కూడా మొత్తానికి బంద్ చేశారు. అయిన‌ప్ప‌టికీ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడ‌రు.

తెలంగాణ బీజేపీ ఎంపీలకు కవిత సవాల్‌ విసిరారు. తెలంగాణ తల్లి బిడ్డలైతే ఏపీలో కలిసిన కనీసం 5 గ్రామాలను వెనక్కి వచ్చేలా చూడాలని చాలెంజ్ చేశారు. భద్రాచలం వద్ద ఉన్న 5 గ్రామాలు పోతే రాముడి గుడి మునుగుతుందని, గ్రామాలను వెనక్కి తీసుకురావడానికి జాగృతి తరఫున కేంద్రానికి లేఖ రాశామని అన్నారు. భ‌ద్రాచ‌లం రాముడు రాముడు కాదా.. ద‌మ్ముంటే ఆ 5 గ్రామాల‌ను వెనక్కు తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు.

క‌ర్కోట‌కుడి చేతిలో పాల‌న‌..

`రాష్ట్రంలో క‌ర్కోట‌కుడి చేతిలో పాల‌న సాగుతున్న‌ది. ఒక రాజ‌కీయ నాయ‌కుడిని క‌ర్కోట‌కుడు అనాలంటే బాధ అనిపిస్తుంది. కానీ అన‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఎందుకంటే ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల‌లో అన్ని అనుమ‌తులు ఉన్న ఇండ్ల‌ను అర్ధ‌రాత్రి పోయి కూల‌గొట్టారు. ఒక నిండు గ‌ర్భిణికి టెన్ష‌న్‌తో అబార్ష‌న్ అయింది. ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోధ‌న ఇంకా ఈ చెవుల‌కు విన‌బ‌డుతుంది. అందుకే ఈ సీఎంని క‌ర్కోట‌కుడు అనే అంటా.. హిట్ల‌ర్ అనే అంటా. రెండు నెల‌ల ప‌సికందు కుమ్మెర గ్రామంలో చ‌నిపోతే ఇప్ప‌టికీ కేసు పెట్ట‌డం లేదు. హోం మంత్రి కూడా ముఖ్య‌మంత్రే. ఆయ‌న‌కు తీరిక‌లేదు పాపం!. అందుకే అంటున్న క‌ర్కోట‌కుడైన సీఎం పాల‌న‌లో మ‌నం ఉన్నం.

గురుకులాల్లో విషం పెట్టి పిల్ల‌ల‌ను చంపుతున్న‌రు. అయిన‌ప్ప‌టికీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడుత‌లేడు. అందుకే క‌ర్కోట‌కుడు అంటున్నాం. క‌ర్ల రాజేశ్ అనే ద‌ళిత యువ‌కుడు పోలీస్ క‌స్ట‌డీలో చ‌నిపోతే ఇప్పటికి కూడా దానికి బాధ్యులైన పోలీసుల‌పై ఏ చ‌ర్య‌లూ తీసుకోలే. పిడికిలి బిగించి ఇప్పుడున్న రాక్ష‌స కాంగ్రెస్‌పై కొట్లాడుతాం. అంద‌రిక‌న్నా ఎక్కువ కొట్లాడుతాం. ఇప్పుడు మ‌న‌మే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అయితం. రెండేండ్ల త‌ర్వాత అధికార ప‌క్షం అయితం. క‌చ్చితంగా అధికారంలోకి వ‌స్తం.` అని క‌విత అన్నారు.

 

 

Advertisement
Advertisement