త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | ‘తెలంగాణ జాగృతి’ టు ‘తెలంగాణ ప్ర‌జా జాగృతి’.. వ‌యా బీఆర్ఎస్

Kalvakuntla Kavitha | బీఆర్ఎస్ పార్టీ నుంచి స‌స్పెండ్ అయ్యాక‌.. దాదాపు ఐదు నెల‌ల త‌ర్వాత క‌ల్వ‌కుంట్ల క‌విత( Kalvakuntla Kavitha ) కొత్త‌ పార్టీని ప్ర‌క‌టించారు. ఆ పార్టీ పేరే తెలంగాణ ప్ర‌జా జాగృతి( Telangana Praja Jagruthi ). తెలంగాణ జాగృతి నుంచి తెలంగాణ ప్ర‌జా జాగృతి వ‌ర‌కు.. ఆమె రాజ‌కీయ ప్ర‌స్థానం సంక్షిప్తంగా..

S

Telangana | Published On Feb 21, 2026, 10.49 pm IST

Kalvakuntla Kavitha | ‘తెలంగాణ జాగృతి’ టు ‘తెలంగాణ ప్ర‌జా జాగృతి’.. వ‌యా బీఆర్ఎస్
Advertisement

Kalvakuntla Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌( Kalvakuntla kavitha ).. ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మంలో త‌న‌వంతు పాత్ర పోషించారు. ఉద్య‌మ స‌మ‌యంలోనే 2006లో తెలంగాణ జాగృతి( Telangana Jagruthi )ని స్థాపించి.. తెలంగాణ అస్తిత్వాన్ని, చ‌రిత్ర‌ను వెలికితీశారు. అంత‌టితో ఆగ‌కుండా ప్ర‌పంచానికి చాటిచెప్పారు. బ‌తుక‌మ్మ‌( Bathukamma )ను ఖండాంత‌రాల‌కు వ్యాపింప‌జేశారు. 2009 నుంచి బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) ప‌క్షాన ప్ర‌త్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు.

ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి తొలిసారిగా లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు ఆమె. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై ఓటమి పాల‌య్యారు. 2020లో స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా క‌విత శాస‌న మండ‌లిలో అడుగుపెట్టారు. 2022లో రెండోసారి అదే శాస‌న‌మండ‌లికి మ‌ళ్లీ ఎన్నిక‌య్యారు. అలా ఆమె రాజ‌కీయ ప్ర‌స్థానం తెలంగాణ ఉద్య‌మం నుంచి ప్రారంభ‌మైంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి స‌స్పెండ్ అయ్యాక‌.. దాదాపు ఐదు నెల‌ల త‌ర్వాత కొత్త పార్టీని ప్ర‌క‌టించారు. ఆ పార్టీ పేరే తెలంగాణ ప్ర‌జా జాగృతి( Telangana Praja Jagruthi ). ఈ పార్టీని అధికారికంగా మే నెల‌లో ప్ర‌క‌టించి.. ఆవిర్భావ వేడుక‌ల‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హించ‌నున్నారు.

సెప్టెంబ‌ర్ 2న క‌విత‌పై వేటు

గ‌తేడాది సెప్టెంబ‌ర్ 2వ తేదీన క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను బీఆర్ఎస్ పార్టీ స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స‌స్పెండ్ చేసిన‌ట్లు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టీ ర‌వీంద‌ర్ రావు, పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ వ్య‌వ‌హారాల బాధ్యులు సోమ భ‌ర‌త్ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

సెప్టెంబ‌ర్ 3న ఎమ్మెల్సీ ప‌ద‌వికి, బీఆర్ఎస్‌కు రాజీనామా

బీఆర్ఎస్ నుంచి స‌స్పెండ్ అయిన మ‌రుస‌టి రోజే క‌విత త‌న ఎమ్మెల్సీ పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆమె అదే రోజు రాజీనామా చేశారు.

జ‌న‌వ‌రి 5న మండ‌లిలో క‌విత ప్ర‌సంగం

ఈ ఏడాది జ‌న‌వ‌రి 5న కల్వకుంట్ల కవిత మొదటిసారి శాసనమండలిలో బోరున ఏడుస్తూ ప్రసంగం కొనసాగించారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూనే మండలిలో ప్రసంగించారు. తన మనసులోని బాధను, అవమానాలను, ఆవేదనను మండలి సాక్షిగా ఆమె బయపెట్టేశారు. నేను గత ఏడాది సెప్టెంబర్ 3వ తేది నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. ఆరోజు మీరు ఆవేశపడకండి, ఆలోచించుకోండి సమయం ఇస్తున్నానని చెప్పారు. నాలుగు నెలల సమయంలో కూడా మీరు నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు సభకు చెప్పాలని భావించాను. నాకు ఈ గౌరవాన్ని ఇచ్చిన బీఆర్ ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా భాద్యతలను నిర్వర్తించడానికి ఇప్పుడు అదే పార్టీ నుండి నాకు అనేక కట్టుబాట్లు ఎదురవుతున్నాయి.అందుకే ఆపార్టీకి రాజీనామా చేయాలని అనుకుంటున్నాను. పార్టీ ఇచ్చిన పదవిలో కొనసాగడం నైతికత కాదు కాబట్టి , పార్టీ ఇచ్చిన పదవకిి రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. మీరు నా రాజీనామా ఆమోదించాలని సభాముఖంగా కోరుతున్నాను అని మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి క‌విత విజ్ఞ‌ప్తి చేశారు.

జ‌న‌వ‌రి 7న రాజీనామాకు ఆమోదం

శాసనమండలి సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ ఏడాది జ‌న‌వ‌రి 7న ఆమోదించిన విష‌యం విదిత‌మే. 2021లో నిజామాబాద్‌ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసనమండలికి కవిత సభ్యురాలిగా ఎన్నికయ్యారు. రాజీనామా ఆమోదంతో ఆమె ఎమ్మెల్సీ ప‌ద‌విని కోల్పోయారు. ప్ర‌స్తుతం క‌విత తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలిగా కొన‌సాగుతున్నారు.

Advertisement
Advertisement