త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ భగ్గుమన్న హింస: 29 ఇండ్ల దహనం.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్!

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. మయన్మార్ బార్డర్‌కు దగ్గర్లో ఉన్న గ్రామాల్లో దుండగులు 29 ఇళ్లకు నిప్పుపెట్టారు. అసలు ఈ దాడుల వెనుక ఉన్నదెవరు?

J

National | Published On Jul 2, 2026, 6.50 pm IST

Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ భగ్గుమన్న హింస: 29 ఇండ్ల దహనం.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్!
Advertisement
  • మణిపూర్-మయన్మార్ బార్డర్‌లోని కమ్జోంగ్ జిల్లాలో మళ్లీ చెలరేగిన హింస
  • కుకీ, నాగా గ్రామాల్లో మొత్తం 29 ఇళ్లకు నిప్పుపెట్టిన దుండగులు
  • దాడులకు పాల్పడింది మీరంటే మీరని కుకీ, నాగా సంస్థల పరస్పర ఆరోపణలు
  • మోదీ సర్కార్ విభజన రాజకీయాలే ఈ దాడులకు కారణమంటూ రాహుల్ గాంధీ ఫైర్

Manipur Violence | త్రినేత్ర.న్యూస్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. ఇండియా-మయన్మార్ బార్డర్‌కు ఆనుకుని ఉన్న కమ్జోంగ్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం వరకు వరుస దాడులు జరిగాయి. సాయుధ దుండగులు ఏకంగా 29 ఇండ్లకు నిప్పుపెట్టడంతో ఆ ప్రాంతమంతా మళ్లీ ఉద్రిక్తంగా మారింది.

అసలేం జరిగింది? టార్గెట్ ఎవరంటే..

కమ్జోంగ్ జిల్లాలోని కుకీ, తంగ్ఖుల్ నాగా గ్రామాలను టార్గెట్ చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడులకు తెగబడ్డారు. ఫైమోల్ అనే కుకీ గ్రామంలో దాదాపు 15 ఇండ్లను తగులబెట్టారు. అదృష్టవశాత్తూ భద్రతా కారణాల దృష్ట్యా గ్రామస్తులు ముందే వేరే చోట రిలిఫ్ క్యాంప్‌లలో తలదాచుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. దీనికి ప్రతీకారంగానే షంగ్ఖాలోక్ అనే నాగా గ్రామంలో మరో 7 ఇళ్లను పాక్షికంగా దహనం చేశారు. హుయిమైన్ థానా, లైకోట్ గ్రామాల్లోనూ ఇలాంటి దాడులే జరిగాయి.

కుకీ - నాగా గ్రూపుల మధ్య వార్

ఈ ఇండ్ల దహనం వెనుక నాగా మిలిటెంట్ల హస్తం ఉందని కుకీ గ్రూపులు ఆరోపిస్తుండగా.. నాగా ఆర్గనైజేషన్స్ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి. కుకీ సాయుధ గ్రూపులే వ్యూహాత్మకంగా తమ గ్రామాల్లో దాడులకు పాల్పడుతున్నాయని, మయన్మార్ శరణార్థుల క్యాంపులను ధ్వంసం చేశాయని నాగా కమ్యూనిటీ నేతలు మండిపడుతున్నారు. 2023 మే నుంచి మైతీ-కుకీ వర్గాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలు.. ఇప్పుడు కుకీ-నాగా కమ్యూనిటీల మధ్య పోరుగా మారడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

రాహుల్ గాంధీ ఫైర్

మణిపూర్ తాజా హింసపై కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ మోదీ సర్కార్ విభజన రాజకీయాల ఫలితమేనని ఆయన మండిపడ్డారు. "మణిపూర్ ఏళ్ల తరబడి మండుతూనే ఉంది. ద్వేషపు మంటల్లో మరో 20 ఇండ్లు బూడిదయ్యాయి. మతం, కులం, ప్రాంతం పేరుతో ప్రజలను విడదీస్తున్న బీజేపీ ఐడియాలజీ వల్లే ఈ దుస్థితి వచ్చింది. మణిపూర్ ప్రజల బాధ వర్ణనాతీతం" అని ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు.

మారుతున్న రాజకీయ సమీకరణాలు

సరిహద్దుల్లో ఉన్న ఈ ఉద్రిక్తతల కారణంగా రాష్ట్రంలో భారీగా బఫర్ జోన్లు ఏర్పాటు చేశారు. 2023 నుంచి జరుగుతున్న హింసలో సుమారు 260 మంది ప్రాణాలు కోల్పోగా, 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. భద్రతా వైఫల్యాల నేపథ్యంలో సీఎం ఎన్.బీరెన్ సింగ్ రాజీనామా చేయగా.. కొంతకాలం రాష్ట్రపతి పాలన తర్వాత, ఫిబ్రవరి 2026లో యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్ నేతృత్వంలో కొత్త బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అయినా సరే, మణిపూర్‌లో శాంతి స్థాపన ఇంకా మృగతృష్ణగానే మిగిలిపోయిందని తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement
Advertisement