త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy on Kavitha | తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ మరమనిషి అయితే.. ఇంకెవరు హృదయం ఉన్న మనుషులు?: కవితపై జీవన్‌రెడ్డి ఫైర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన ‘మరమనిషి’ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడిని అలా అనడం సరికాదని, వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాలనను సైతం ఆయన విమర్శించారు.

J

Telangana | Published On Apr 25, 2026, 9.33 pm IST

Jeevan Reddy on Kavitha | తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ మరమనిషి అయితే.. ఇంకెవరు హృదయం ఉన్న మనుషులు?: కవితపై జీవన్‌రెడ్డి ఫైర్
Advertisement

Jeevan Reddy on Kavitha | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "కేసీఆర్‌ను మరమనిషి (మెషిన్ మ్యాన్) అనడం ఏంటి? తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడిని, ఉద్యమకారుడిని అలా అనడం కరెక్ట్ కాదు. ఆ మాటలను కవిత వెంటనే వెనక్కి తీసుకోవాలి" అని ఆయన డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కవిత వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితోనే ఎదిగావు

కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితోనే, ఆయన నీడలోనే కవిత నాయకురాలిగా ఎదిగారనే విషయాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు. "తెలంగాణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమించిన గొప్ప నాయకుడు కేసీఆర్. రెండు పర్యాయాలు రాష్ట్రాన్ని, ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించారు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి గొప్ప నాయకుడిని, రాష్ట్రాన్ని ఇచ్చిన దాతను పట్టుకుని మరమనిషి అని ఎట్లా అంటావ్ తల్లి?" అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. "కేసీఆర్ మరమనిషి అయితే, ఇంకెవరు హృదయం ఉన్న మనుషులు?" అని ఆయన నిలదీశారు. కవిత తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుంటేనే ఆమెకు గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు.

రేవంత్ పాలనపై సెటైర్లు

ఇదే సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై జీవన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "తల్లి.. ఈరోజు అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి. మరి ఆయన పాలన బాగుందా? ఒకసారి ఆలోచించు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టి, ఆర్టీసీని, శంకర్ గౌడ్‌ను బలిచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పది వేల కోట్లకు ఆపారు. సింగిల్ విండో నామినేషన్లంటూ కాలయాపన చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడతారో తెలియదు. కేసీఆర్ పాలనతో పోలిస్తే ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు" అని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు పెట్టుకోవచ్చు, రాజకీయాలు చేయొచ్చు తప్పులేదని.. కానీ ఒక గొప్ప నాయకుడి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, ఆయన స్థాయిని తగ్గించేలా మాట్లాడటం సరికాదని జీవన్‌రెడ్డి కవితకు సూచించారు.

Advertisement
Advertisement