త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | నిరుపేద‌ల‌ను డాక్ట‌ర్ల‌ను చేసే బాధ్య‌త నాదే.. ప‌ట్టుద‌ల‌తో చ‌దివి గొప్ప ఆఫీస‌ర్లుగా ఎద‌గండి

Harish Rao | నిరుపేద విద్యార్థుల‌ను డాక్ట‌ర్ల‌ను చేసే బాధ్య‌త త‌న‌దేన‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డి చ‌దివి ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో మాదిగ ఉద్యోగులంతా ‘న్యూస్’ సొసైటీని ఏర్పాటు చేసి ప్ర‌తినెలా రూ.1000 ప‌క్క‌న పెడుతూ రూ.10 ల‌క్ష‌ల నిధిని ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. హౌసింగ్‌బోర్డుకు చెందిన రోహిత్ త‌న ఏడాది సంపాద‌న రూ.6 ల‌క్ష‌లు తెచ్చి పేద విద్యార్థుల కోసం ఖ‌ర్చు చేయ‌మ‌ని నాకే ఇచ్చాడ‌న్నారు.

S

Telangana | Published On Aug 9, 2026, 3.38 pm IST

Harish Rao | నిరుపేద‌ల‌ను డాక్ట‌ర్ల‌ను చేసే బాధ్య‌త నాదే.. ప‌ట్టుద‌ల‌తో చ‌దివి గొప్ప ఆఫీస‌ర్లుగా ఎద‌గండి
Advertisement
  • మాదిగ ఉద్యోగులంతా ఏర్పాటు చేసిన ‘న్యూస్’ సొసైటీ సేవ‌లు అభినంద‌నీయం
  • ప్ర‌తి నెలా రూ.1000 ప‌క్క‌న పెట్టి రూ.10 ల‌క్ష‌ల నిధిని ఏర్పాటు చేశారు
  • రోహిత్ త‌న ఏడాది సంపాద‌న తెచ్చి పేద విద్యార్థుల కోసం ఖ‌ర్చు చేయ‌మ‌ని నాకే ఇచ్చాడు
  • శ్రీ‌జకు ఈ ఏడాది ఫీజు కూడా మీ అంద‌రి స‌మ‌క్షంలో క‌డుతున్నా
  • న్యూస్ సొసైటీకి ఈసారి కూడా ల‌క్ష రూపాయ‌ల ఆర్థిక సాయం అంద‌జేస్తున్నా
  • ద‌ళిత విద్యార్థుల ప్ర‌తిభ అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో మాజీ మంత్రి హ‌రీశ్‌రావు వెల్ల‌డి

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్: నిరుపేద విద్యార్థుల‌ను డాక్ట‌ర్ల‌ను చేసే బాధ్య‌త త‌న‌దేన‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డి చ‌దివి ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో మాదిగ ఉద్యోగులంతా ‘న్యూస్’ సొసైటీని ఏర్పాటు చేసి ప్ర‌తినెలా రూ.1000 ప‌క్క‌న పెడుతూ రూ.10 ల‌క్ష‌ల నిధిని ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. హౌసింగ్‌బోర్డుకు చెందిన రోహిత్ త‌న ఏడాది సంపాద‌న రూ.6 ల‌క్ష‌లు తెచ్చి పేద విద్యార్థుల కోసం ఖ‌ర్చు చేయ‌మ‌ని నాకే ఇచ్చాడ‌న్నారు. ఇది ఎంద‌రికో స్ఫూర్తిదాయ‌క‌మ‌ని కొనియాడారు. సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ (న్యూస్) ఆధ్వర్యంలో దళిత విద్యార్థుల ప్రతిభ అవార్డుల కార్య‌క్ర‌మానికి ఆదివారం ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. న్యూస్ సొసైటీకి రూ.ల‌క్ష విరాళం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌దో త‌ర‌గ‌తిలో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన ద‌ళిత విద్యార్థుల‌కు అవార్డులు అంద‌జేశారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీటు సాధించి, ఫీజు కట్టలేని నిరుపేద దళిత విద్యార్థులను డాక్టర్లను చేసే బాధ్యత నాదే. విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు ఇవ్వకపోవడంతో సర్టిఫికెట్లు రాక విద్యార్థులు రోడ్డున ప‌డుతున్నారు. దళిత, గిరిజన, బీసీ కార్పొరేషన్లు కేవలం కాగితాలకే పరిమితమ‌య్యాయి. బడ్జెట్‌లో వేల కోట్లు కేటాయించినట్లు చూపిస్తూ, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయ‌లేదు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ లాంటి మహనీయులు కల్పించిన రిజర్వేషన్ల వల్లే మనమంతా చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నాం. ఆ రిజర్వేషన్ల ఫలాలతో గౌరవంగా బతుకుతున్న మనం తిరిగి సమాజానికి ఏదో ఒకటి చేయాలనే బాధ్యతను పదేళ్ల క్రితమే గుర్తించి సిద్దిపేటలో మాదిగ సామాజిక వర్గం ఉద్యోగులంతా కలిసి 'న్యూస్' సొసైటీని స్థాపించడం అభినందనీయం. నాకు సమాజం ఏం చేసింది అని అడిగేవాళ్లే ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో, మేం సమాజానికి ఏం చేయగలం అని ఆలోచించి, ఉద్యోగులు తమ వేతనం నుంచి ప్రతి నెలా వెయ్యి రూపాయలు పక్కన పెట్టి 10 లక్షల రూపాయల నిధిని ఏర్పాటు చేయడం గర్వకారణం. ఫీజులు కట్టలేని పేద విద్యార్థులకు అండగా నిలబడుతూ, ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్స్‌ ఇవ్వడం రాష్ట్రానికే ఆదర్శం అని మాజీ మంత్రి కొనియాడారు.

రోహిత్ ఆలోచ‌న అంద‌రికీ స్ఫూర్తిదాయకం..

ఐదేళ్ల క్రితం ఫీజు కట్టలేక నా దగ్గరకు వచ్చిన హౌసింగ్ బోర్డుకు చెందిన రోహిత్ అనే అబ్బాయికి నేను సహాయం చేశాను. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏడాదికి 6 లక్షల జీతం వస్తోంది. తన తొలి ఏడాదంతా సంపాదించిన 6 లక్షల రూపాయలను తీసుకొచ్చి తిరిగి పేద విద్యార్థుల కోసం ఖర్చు చేయమని నాకే ఇచ్చాడు. కష్టపడి పైకొచ్చిన ఆ అబ్బాయి ఆలోచనా విధానం అందరికీ స్ఫూర్తిదాయకం అని హ‌రీశ్ రావు ప్ర‌శంసించారు.

శ్రీ‌జ‌కు ఈ ఏడాది ఫీజు కూడా క‌డుతున్నా..

శ్రీజ అనే దళిత విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు వస్తే ఫీజు కట్టలేని పరిస్థితిలో నా దగ్గరకు వచ్చింది. ఐదేళ్ల పాటు ఆమె ఫీజు నేనే కడతానని మాట ఇచ్చాను. గత ఏడాది ఫీజు కట్టాను. ఈరోజు మీ అందరి సమక్షంలో ఆమె రెండో సంవత్సరం ఫీజును కూడా చెల్లిస్తున్నాను. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించి, ఫీజు కట్టలేక ఇబ్బంది పడే దళిత బిడ్డలు ఎవరైనా నా దృష్టికి వస్తే వాళ్ళను డాక్టర్లను చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మంచి కార్యక్రమాలు చేస్తున్న న్యూస్ సొసైటీకి నా వంతు సహాయంగా ఈ సంవత్సరం కూడా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నాను అని హ‌రీశ్ రావు తెలిపారు.

ఎస్సీ క‌ర్పొరేష‌న్‌కు 5,403 కోట్లు కేటాయించి కేవ‌లం 74 కోట్లే ఖ‌ర్చు పెట్టారు..

కేసీఆర్ హయాంలో దళిత విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు పెంచాం. సిద్దిపేటలో ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ తెచ్చాం. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, దళిత బంధు లాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేశాం. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ కు బడ్జెట్ లో 5,403 కోట్లు కేటాయించి, ఖర్చు పెట్టింది కేవలం 74 కోట్లు మాత్రమే. ఆ 74 కోట్లు కూడా జీతాలు, కరెంట్ బిల్లులకే సరిపోయాయి. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క నిరుపేద దళిత యువకుడికి గానీ, రైతుకు గానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పైసా సహాయం అందలేదు అని ఆయ‌న మండిప‌డ్డారు.

కార్పొరేష‌న్ల‌ను కాగితాల‌కే ప‌రిమితం చేశారు..

దళితబంధు కింద 12 లక్షలు ఇస్తామని చెప్పి, బడ్జెట్‌లో 2000 కోట్లు పెట్టి.. ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి సహాయం చేశారా? ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులు ల్యాప్స్ కావొద్దని, క్యారీ ఫార్వర్డ్ కావాలని మేం చట్టం తెస్తే.. ఈ ప్రభుత్వం 2024-25లో 33 వేల కోట్లు ఎస్సీ నిధి కింద చూపి, ఖర్చు చేసింది కేవలం 14 వేల కోట్లే. అందులో పెన్షన్లు అన్నీ కలిపి ఖర్చుగా చూపిస్తున్నారు. మాదిగ, మాల, ఏకలవ్య, సేవాలాల్, కొమురం భీమ్, బీసీ కార్పొరేషన్లు అని పేర్లు పెట్టి కాగితాలకే పరిమితం చేశారు. ఆ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం శోచనీయం.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్షిప్‌లు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లలో 19 వేల కోట్లు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ కింద చెల్లించి పిల్లల చదువులకు ఆటంకం లేకుండా చూశాం. ఇప్పుడు డిగ్రీలు, ఇంజినీరింగ్ పూర్తయినా కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల హక్కుల కోసం, నిధుల కోసం అసెంబ్లీలో మేం కొట్లాడుతాం. విద్యావంతులైన మీరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని గమనించాలి అని మాజీ మంత్రి సూచించారు.

నాలుగైదేళ్లు క‌ష్ట‌ప‌డితే భ‌విష్య‌త్ అద్భుతంగా ఉంటుంది..

విద్యార్థులు బాగా చదవాలి. చదువుకు పేదరికం, కులం అడ్డుకాదు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. నాలుగైదేళ్లు క్రమశిక్షణతో కష్టపడితే మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. మీరు గొప్ప ఆఫీసర్లుగా ఎదిగి మీ తల్లిదండ్రులు, మన సిద్దిపేట గర్వపడేలా చేయాలని మనసారా దీవిస్తున్నాను అని హ‌రీశ్ రావు అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement