త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Leaders | జ‌య‌శంక‌ర్ సార్ చెప్పిన‌ట్టు మాట్లాడితే.. అసెంబ్లీ ఇటుక‌లు సైతం జై తెలంగాణ అన‌క త‌ప్ప‌లే

BRS Leaders | జయశంకర్ సార్ సలహాలతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడేవారని ఎమ్మెల్సీ దేశ‌ప‌తి శ్రీ‌నివాస్ గుర్తు చేశారు. సార్ సూచనలతో మాట్లాడినప్పుడు అసెంబ్లీ ఇటుకలు సైతం జై తెలంగాణ అనక తప్పలేదన్నారు. సార్ జ‌యంతిని పురస్క‌రించుకొని గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌లు ఆయ‌న చిత్ర‌ప‌టానికి ఘ‌న నివాళుల‌ర్పించారు.

S

Telangana | Published On Aug 6, 2026, 2.51 pm IST

BRS Leaders | జ‌య‌శంక‌ర్ సార్ చెప్పిన‌ట్టు మాట్లాడితే.. అసెంబ్లీ ఇటుక‌లు సైతం జై తెలంగాణ అన‌క త‌ప్ప‌లే
Advertisement
  • సార్ సూచ‌న‌ల‌తోనే కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీశ్‌రావు మాట్లాడేవారు
  • పదవి ఉంటే పోరాట కార్యాచరణ పక్కకు వెళ్తుందని చెప్పిన మహోన్నత వ్యక్తి
  • ఒక్కో మాట అణుబాంబుతో సమానంగా ఉండేది
  • నాటికీ, నేటికీ ఆయ‌న చిర‌స్మ‌ర‌ణీయులు
  • సార్ జ‌యంతి వేడుక‌ల్లో బీఆర్ఎస్ నేత‌లు

BRS Leaders |  త్రినేత్ర‌.న్యూస్‌: జయశంకర్ సార్ సలహాలతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడేవారని ఎమ్మెల్సీ దేశ‌ప‌తి శ్రీ‌నివాస్ గుర్తు చేశారు. సార్ సూచనలతో మాట్లాడినప్పుడు అసెంబ్లీ ఇటుకలు సైతం జై తెలంగాణ అనక తప్పలేదన్నారు. ప‌ద‌వి ఉంటే పోరాట కార్యాచ‌ర‌ణ ప‌క్కకు వెళ్తుంద‌ని చెప్పిన మ‌హోన్న‌త వ్య‌క్తి జ‌యశంక‌ర్ సార్ అని కొనియాడారు. సార్ జ‌యంతిని పురస్క‌రించుకొని గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌లు ఆయ‌న చిత్ర‌ప‌టానికి ఘ‌న నివాళుల‌ర్పించారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప‌లువురు నేతలు ప్ర‌సంగించారు.

క‌డ వ‌ర‌కూ తెలంగాణ వాద‌న‌లే వినిపించారు: ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి బౌద్ధిక వాది అయితే కేసీఆర్ వాది. కడశ్వాస వరకు శ్రీ కృష్ణ కమిటీతో తెలంగాణ వాదనలు వినిపించిన వ్యక్తి జయశంకర్ సార్. పదవి ఉంటే పోరాట కార్యాచరణ పక్కకు వెళ్తుందని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి. సార్‌ను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తండ్రిగా భావించేవారు. డిసెంబర్ 9 ప్రకటనతో తెలంగాణ రాష్ట్రం తప్పకుండా వస్తుందని జయశంకర్ భావించారు. సార్‌ను ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఆయ‌న స్ఫూర్తితో మనం ముందుకు వెళ్దాం.

సామాజిక తెలంగాణ కోసం ఆలోచ‌న చేసేవారు: తుల ఉమ, జడ్పీ మాజీ చైర్పర్సన్

జయశంకర్ సార్‌తో కలిసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అంకెలతో సహా సార్ చెప్పేవారు. కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి కావాలని అనుకునేవారు. నాలుగు కోట్ల ప్రజలను ఏకం చెయ్యడంలో కేసీఆర్, జయశంకర్ సార్ కృషి మరవలేనిది. సామాజిక తెలంగాణ కోసం ఆలోచన చేసేవారు. సార్‌ను మనం స్పూర్తిగా తీసుకొని భవిష్యత్ కోసం క‌లిసి న‌డుద్దాం.

ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా మాట్లాడేవారు: నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి

డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేసిన తరువాతనే తెలంగాణ అనే పదం గట్టిగా వినిపించింది. ఇదే విషయం నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు మెయిల్ ద్వారా తెలిసింది. గొప్ప ఆర్థికవేత్త ఆదర్శప్రాయుడు, గొప్ప యోధుడు జయశంకర్ సార్. సార్ ఒక్కో మాట అణుబాంబుతో సమానంగా ఉండేది. ప్రజలకు అర్థమయ్యేలా జయ అద్భుతంగా మాట్లాడేవాడు. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఎంతో వివరంగా చెప్పేవాడు. కేసీఆర్‌పై కొందరు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్న వారిపై నాకు కోపం వస్తుంది.
కాంగ్రెస్ పార్టీ మూడు తరాలు ప్రజల జీవితాలను నాశనం చేసిందని ఆనాడే జయశంకర్ సార్ చెప్పారు. మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్‌తో సార్‌కు మంచి పరిచయం ఉంది. నాటికైనా, నేటికైనా జయశంకర్ సార్ చిరస్మరణీయులే.

కేసీఆర్‌తోనే తెలంగాణ వ‌స్తుంద‌ని న‌మ్మేవారు: మధుసూదనా చారి, శాసన మండలి ప్రతిపక్ష నేత

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా జయశంకర్ సార్ ఆలోచన అలానే ఉండేది. ఒక లక్ష్యాన్ని నిర్దేశంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని చెప్పేవాడు. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అనేక సార్లు వివరంగా చెప్పేవాడు. నిండు జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన మహానుభావుడు సార్. పనిలో ఉండే వైవిద్యం చాలా గొప్పది. 1976 CKM కాలేజ్‌లో చదువుతున్న వారిని సమాజం చీదరించుకుంది. 1975-1980 వరకు జయశంకర్ సార్ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అప్పటి నుంచి CKM కాలేజ్ స్టూడెంట్స్ అంటే సమాజంలో మంచి పేరు వచ్చింది. కేసీఆర్‌తోనే కచ్చితంగా తెలంగాణ వస్తుందని నమ్మేవాడు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నర ఏండ్ల పాలనలో అనేక అనర్థాలు మనం చూస్తున్నాం. సార్ స్ఫ‌ర్తితో మనం ముందుకు వెళ్దాం.

నాతో మాట్లాడ‌న‌ని అన్నారు: డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి

నేను అదనపు SP (ఆపరేషన్ )గా వరంగల్‌లో పనిచేశాను. మావోయిస్టు, పీపుల్స్ వార్ రాజకీయ నాయకులపై దాడులు చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందనే విషయాన్ని జయశంకర్ సార్‌తో తెలుసుకోవాలని అనుకున్నాం. IPS ఆఫీసర్‌గా నేను జయశంకర్ సార్‌తో మాట్లాడేందుకు వెళ్లినప్పుడు, నాతో సార్ మాట్లాడనని చెప్పాడు. ఆ తర్వాత ఒప్పించి వరంగల్ జిల్లా పోలీస్ కార్యాలయానికి తీసుకొచ్చాం. యువత ఎక్కువగా మావోయిస్ట్‌ల వైపు ఎందుకు వెళ్తున్నారని అడిగాం. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై వివరంగా చెప్పాడు.
అప్పటి నుంచి మేం మావోయిస్టులను చంపొద్దని నిర్ణయానికి వచ్చాం. సాయుధలైన మావోయిస్టు కుటుంబాల దగ్గరకు వెళ్ళాలనే నిర్ణయం జయశంకర్ సార్ చెప్పిన తర్వాత వచ్చింది.

మంచి ఉర్ధూ మాట్లాడేవారు: మహమూద్ అలీ, మాజీ ఉప ముఖ్యమంత్రి

జయశంకర్ సార్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. కేసీఆర్‌కు జయశంకర్ గాడ్ ఫాదర్‌లా దారి చూపారు. తెలంగాణ రాష్ట్రం చూడకుండానే జయశంకర్ కన్ను మూయడం బాధాకరం. జయశంకర్ మంచి ఉర్ధూ మాట్లాడేవారు. నిజమైన గంగా జమున సంస్కృతికి వారు ప్రతిబింబాలు.

Advertisement
Advertisement