త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | మా అస్తిత్వంపై దాడి చేస్తే ఊరుకోం.. మూతి ప‌ళ్లు రాలుత‌య్‌: క‌విత హెచ్చ‌రిక‌

Kavitha | తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రావాళ్ల విగ్రహాలు పెడుతున్నారని.. అందుకు కార‌ణ‌ణం ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఉండటం అని తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలకొట్టి పార్సల్ పంపుతామ‌ని హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Jun 1, 2026, 1.43 pm IST

Kavitha | మా అస్తిత్వంపై దాడి చేస్తే ఊరుకోం.. మూతి ప‌ళ్లు రాలుత‌య్‌: క‌విత హెచ్చ‌రిక‌
Advertisement
  • జెండా రాక‌ముందు ఒక‌లా, ఇప్పుడు ఒక‌లా ఉన్నాం
  • టీఆర్ఎస్ 2.0తో పెట్టుకుంటే మూతి ప‌ళ్లు రాలుతాయ్‌
  • నేను మీర‌నుకున్నంత మంచిదాన్ని కాదు
  • మ‌హానాడులో పిచ్చి వాగుడు వాగారు..
  • మీ డిక్షనరీ లో తెలంగాణ ప‌దం ఉంటే ఎంత? లేకుంటే ఎంత?
  • ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, లోకేష్.. మీ సెక్రెటేరియ‌ట్‌ల‌కు నీళ్లు రాకుండా చూసుకోండి
  • తెలంగాణ‌లో ఆంధ్రావాళ్ల‌కు ఓట్లేసే సంస్కృతి ఎప్పుడో పోయింది
  • ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఆంధ్రావాళ్ల విగ్ర‌హాలు పెడుతున్న‌రు
  • ఇక్క‌డ ఆంధ్రా నేత‌ల ఏజెంట్ సీఎంగా ఉండ‌డ‌మే కార‌ణం
  • రౌండ్‌టేబుల్ స‌మావేశంలో టీఆర్ఎస్ చీఫ్ క‌విత ధ్వ‌జం

Kavitha | త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రావాళ్ల విగ్రహాలు పెడుతున్నారని.. అందుకు కార‌ణ‌ణం ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఉండటం అని తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇదేదో యాధృచ్ఛికంగా జరుగుతుంది కాదని, ఒక కుట్ర ప్రకారం మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో సోమ‌వారం జ‌రిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు - సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్ర‌సంగించారు. తాము అధికారంలోకి రాగానే ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలకొట్టి పార్సల్ పంపుతామ‌ని హెచ్చ‌రించారు.

మా అస్తిత్వంపై దాడి చేస్తూ మీ సంస్కృతి రుద్దుతామంటే ఊరుకోం. టీఆర్ఎస్ జెండా రాకముందు ఒకలా, ఇప్పుడు ఒకలా ఉన్నాం. టీఆర్ఎస్ 2.0 తో పెట్టుకుంటే మూతి పళ్లు రాలుతాయ్. తెలంగాణలో ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్ సీఎంగా ఉండటంతో డ్రామాలు చేస్తున్నారు. తెలంగాణ వాదుల విమర్శలకు ఆంధ్రా రాజకీయ నాయకులు మాత్రమే స్పందించే వాళ్లు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక వారిలో కొంత భయం ఉండేది. తెలంగాణ వాదం గీత దాటితే మంచిది కాదన్న సోయితో ఉండేవాళ్లు. ఒకసారి పెట్టుకుంటే తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్లీ మా జోలికి వస్తే మూతి పళ్లు రాలుతాయి అని క‌విత హెచ్చ‌రించారు.

త‌ర్వాత నవ నిర్మాణ స‌భ పెట్టుకోండి..

ఆంధ్రాలో రాజధాని కట్టడం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు.. ముందు మీ సెక్రటేరియేట్ లోకి నీళ్లు రాకుండా చూసుకోండి. తర్వాత తెలంగాణలో నవ నిర్మాణ సభ పెట్టుకోండి. తెలంగాణలో ఎక్స్ టెన్షన్ అవ్వటానికి ఇది మీ సామ్రాజ్యం కాదు లోకేష్ బాబు. ఆంధ్రా పార్టీలకు ఇక్కడి ప్రజలు ఓట్లు వేయకపోవటంతోనే దుకాణం బంద్ పెట్టుకున్నది మర్చిపోయారా? మహానాడులో మన మీద పిచ్చి వాగుడు వాగారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదంటూ మన వాళ్ల చేతనే అనిపించారు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా తెలంగాణ పదం డిక్షనరీలో లేదని అంటాడా? మీ డిక్షనరీ లో ఉంటే ఎంత? లేకుంటే ఎంత? మీతో మాకు ఏం అవసరం? అని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పారు.

బిడ్డ‌ల త్యాగాలే ఇంధ‌నంగా..

తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. గత 60, 70 ఏళ్లుగా మన బిడ్డలను పొగొట్టుకుంటూనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కూడా మనం చాలా మంది బిడ్డలను పొగొట్టుకున్నాం. వారి త్యాగాలు ఇంధనంగా మారి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ వారి కుటుంబాలకు మాత్రం ఇప్పటి వరకు న్యాయం జరగలేదు అని టీఆర్ఎస్ చీఫ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

షూటింగ్‌, వ్యాపారాలు చేసుకుంటే అభ్యంత‌రం లేదు..

తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మనందరం కూడా సహచరులమే. తెలంగాణ ఉద్యమాన్ని మనం ఎంతో గొప్పగా చేశాం. వంటవార్పు, సకల జనుల సమ్మె ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాం. పక్క వాళ్లను ఏమీ అనకుండా మన ఉద్యమ ఆకాంక్షలను మాత్రమే తెలిపాం. ఉద్యమాలు చేస్తే తెలంగాణ ప్రజల మాదిరిగా చేయాలనే విధంగా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాం. ఉద్యమ సమయంలో మనం విమర్శలు చేస్తే కూడా ఆంధ్ర ప్రజలు ఏమీ అనేవాళ్లు కాదు. ప్రజలు, ప్రజల మధ్య వాణిజ్య సంబంధాలు, చుట్టరికాలు ఉండేవి. షూటింగ్, వ్యాపారాలు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. వ్యాపారులకు రెడ్ కార్పేట్ పరుస్తాం అని ఆమె అన్నారు.

రాజ్యాంగ బద్దంగా తెలంగాణను మనం సాధించుకున్నాం. రాజ్యాంగం తెలంగాణను ఇచ్చింది. మేము తెలంగాణ వాళ్ల ఎంతో పరిణితితో ఉంటాం. వేరే వాళ్లను ఇబ్బంది పెట్టం. కానీ మన సెక్రటేరియట్ లో మా రాజకీయాల్లో వేలు పెడతామంటే ఊరుకోం. నేను అసలే మొండిదాన్ని, మీరు అనుకున్నంతా మంచిదాన్ని కాదు అని క‌ల్వ‌కుంట్ల క‌విత వ్యాఖ్యానించారు.

ఉద్యమకారుల కోసం పెట్టుకున్న సభలో ఆంధ్రా వాళ్ల గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు. కానీ మనం తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో ముఖ్యమైనది మన అస్తిత్వం. ఇప్పుడు మన అస్తిత్వం మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఆ కుట్ర గురించి మనందరం తెలుసుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. అందుకే ఈ అంశంపై నేను మాట్లాడుతున్నాను.

13 ఏండ్ల‌యినా రాజ‌ధాని క‌ట్టుకోలే..

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి దాదాపు 13 ఏళ్లు అవుతున్న వాళ్లు రాజధాని కట్టుకోలేదు. తెలంగాణతో కలిసినప్పుడు కూడా మన రాజధాని మీద కన్నేసి...ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని కలుపుకున్నారు. కానీ ఇప్పుడు 13 ఏళ్లు అయిన సరే అక్కడ అధికారంలోకి వచ్చిన రెండు పార్టీలు రాజధాని కట్టలేదు. ఏపీలో ఇప్పుడు ఉన్న తెలుగుదేశం, జనసేన సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంట్ లో వాళ్ల రాజధాని మీద తీర్మానం చేయించుకున్నారు. ఎవరైనా రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం చేయించుకుంటారు. కానీ వీళ్లు మాత్రం పార్లమెంట్ లో తీర్మానం చేయించుకున్నారు. అమరావతి రాజధాని అంటే జగన్ మాత్రం మావిగన్ పేరుతో వారిపై రాజకీయ బాంబు వేశారు. రాజధాని నిర్మాణం విషయంలో సంకీర్ణ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. ఈ సమయంలో ఆంధ్రా ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నం మొదలు పెట్టారు.

పవన్ కళ్యాణ్ తెలంగాణ నవ నిర్మాణం అంటూ సభ పెడుతారంట. లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ముందు మీ సెక్రటేరియేట్ లోని వానకాలం నీళ్లు రాకుండా చూసుకోండి. ప్రతి వానకాలంలో మీ రాజధాని మునుగుతుంటే, సెక్రటేరియేట్ లోని నీళ్లు వస్తుంటే ఆంధ్రా ప్రజలకు ఎంత అవమానం? ఆంధ్రా నాయకులకు ఏమైనా అయ్యిందంటే హైదరాబాద్ కు వచ్చి వైద్యం చేయించుకుంటారు. కానీ ఆంధ్రాలో మాత్రం హాస్పిటల్స్ కట్టటం లేదు. నెల్లూరు వాళ్లు చెన్నైయ్ కి, అనంతపురం వాళ్లు బెంగళూరుకు, విజయవాడ వాళ్లు హైదరాబాద్ కు వైద్యం కోసం వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పటికీ కూడా మీ ప్రజలకు మీరు ఎందుకు వసతులు ఇవ్వటం లేదు? అని క‌విత ప్ర‌శ్నించారు.

ఇవ్వాళ తెలంగాణలో ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అందుకే తెలంగాణ మేధావుల ఇళ్లకు ఆంధ్రా పోలీసులు వస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్, పాశం యాదగిరి మాట్లాడితే ఎదురుదాడి చేస్తున్నారు. దమ్ముంటే మీరు రాజకీయంగా ఎదుర్కొండి. ఈ జెండా రాకముందు ఒకలా, ఇప్పుడు ఒకలా. టీఆర్ఎస్ 2.0. మాతో పెట్టుకుంటే మంచిగ ఉండదు. మీ పంచాయితీలు, మీ సంస్కృతి మా మీద రుద్దుతామంటే ఊరుకోం.
ఇక్కడ సెటిలైన ఆంధ్రావాళ్లంతా కూడా మావాళ్లే. వాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. కానీ మన నీళ్లు, మా రాజకీయాల్లో వేలు పెడుతామంటే ఊరుకోం. మా అస్తిత్వాన్ని పరిరక్షించుకోవటమే మాకు ముఖ్యం అని టీఆర్ఎస్ చీఫ్ క‌విత స్ప‌ష్టం చేశారు.

కోదండ‌రాం వంటి వాళ్ల‌కు లాభం జ‌రిగితే స‌రిపోదు..

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచిన సరే ఉద్యమకారుల ఆకాంక్షలు నేరవేర్చటం లేదు. కేకే, పీకే కమిటీలు అంటూ కాలయాపన చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన రేపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నేరవేరుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించాలి. కోదండరాం లాంటి ఒకరిద్దరికీ లాభం జరిగితే సరిపోదు. ఎవరినీ చూసి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఓటు వేశారో...ఆయా నాయకుల ఉద్యమకారులకు న్యాయం జరిగేలా కొట్లాడాలి అని క‌విత పిలుపునిచ్చారు.

పాంచ‌జ‌నం అంశాల‌తో ముందుకెళ్తున్నాం..

ఈ ముఖ్యమంత్రి గోదావరి, కావేరి లింక్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పి మనకు అన్యాయం చేస్తున్నాడు. ఇది సరికాదు. తెలంగాణ హక్కులు, అస్తిత్వ పరిరక్షణ కోసమే మేం పార్టీ పెట్టాం. పాంచజనం అనే ఐదు అంశాలతో ముందుకు వెళ్తున్నాం. రైతుకు మంచి చేయటమనేది నినాదం కాదు.. విధానం కావాలి. యువతకు ఉద్యోగాలు రావాలి. వారిని ప్రోత్సహించేందుకు రూ. 2 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు రుణాలు ఇస్తాం. అత్యంత ముఖ్యంగా సామాజిక తెలంగాణ సాధించుకోవాలి. భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండాలన్నది దానిపై మీరంతా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నా అని రౌండ్ టేబుల్ స‌మావేశంలో క‌విత చెప్పారు.

Advertisement
Advertisement