త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CBSE Tender Controversy | టెండర్ వివాదంపై CBSE మౌనం: తక్షణమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఇవే

లక్షలాది మంది విద్యార్థులు పరీక్షల్లో సమాధానాలు రాస్తుంటే, CBSE మాత్రం తన టెండర్ వివాదంపై ఎందుకు మౌనంగా ఉంది? కచ్చితంగా సమాధానం చెప్పాల్సిన 3 ప్రశ్నలివే.

J

National | Published On Jun 1, 2026, 2.46 pm IST

CBSE Tender Controversy | టెండర్ వివాదంపై CBSE మౌనం: తక్షణమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఇవే
Advertisement

CBSE Tender Controversy | త్రినేత్ర.న్యూస్ : పరీక్షా కేంద్రంలో కూర్చున్న విద్యార్థి తాను రాసే ప్రతి జవాబుకూ మార్కులు ఆశిస్తాడు, ఆ సమాధానానికి జవాబుదారీగా ఉంటాడు. కానీ, అదే విద్యార్థులు తిరిగి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టెండర్ ప్రక్రియ గురించి అడగడం మొదలుపెడితే మాత్రం.. బోర్డు దగ్గర ఎలాంటి సమాధానాలూ లేవు.

బోర్డుపై వస్తున్న ఆరోపణలు నిజమా కాదా అనేది పక్కనపెడితే, విద్యార్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలు మాత్రం కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సినవే. ఈ Coempt టెండర్ వివాదంపై బోర్డు నేరుగా స్పందించేంత వరకు, ఇది కేవలం ఒక కాంట్రాక్ట్ సమస్య మాత్రమే కాదు, పారదర్శకతకు సంబంధించిన పెద్ద డిబేట్‌గా మిగిలిపోతుంది.

సాధారణంగా రిజల్ట్స్ వచ్చాక విద్యార్థులకు బోర్డు పరీక్షల టెన్షన్ తీరిపోతుంది. కానీ ఈ ఏడాది అలా జరగలేదు. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (On-Screen Marking) సిస్టమ్‌తో మొదలైన చిన్న ఆందోళన, ఇప్పుడు భారతీయ విద్యావ్యవస్థలోనే అతిపెద్ద జవాబుదారీతనపు చర్చగా మారింది.

ఈ వివాదానికి కేంద్ర బిందువు హైదరాబాద్‌కు చెందిన Coempt Eduteck అనే సంస్థ. ఈ సంస్థకు డిజిటల్ వ్యాల్యుయేషన్ కాంట్రాక్ట్‌ను ఏ ప్రాతిపదికన కట్టబెట్టారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రశ్నలు అడుగుతున్నది ప్రతిపక్ష నాయకులు కాదు, కాంపిటీటర్స్ అంతకంటే కాదు. ఈ కుంభకోణాన్ని బయటపెట్టింది సాక్షాత్తు విద్యార్థులే.

వివాదానికి కేంద్ర బిందువైన ఆ 3 ప్రశ్నలు

టెండర్ ప్రక్రియ మధ్యలో నిబంధనలను మార్చడం ద్వారా కాంపిటీషన్‌ను దెబ్బతీశారా? ఆ మార్పుల గురించి ఎందుకు వివరణ ఇవ్వట్లేదు? అన్నదే ప్రధాన ఆరోపణ.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ టెండర్ అక్రమంగా జరిగిందని కానీ, అవినీతి జరిగిందని కానీ ఏ అధికారిక దర్యాప్తు సంస్థా ఇంకా నిర్ధారించలేదు. కానీ, ప్రజల విశ్వాసం అనేది కేవలం చట్టపరమైన తీర్పుల మీదే ఆధారపడి ఉండదు, పారదర్శకత కూడా ముఖ్యం.

ఇప్పుడు ప్రతి ఒక్కరూ అడుగుతున్న ఆ మూడు ముఖ్యమైన ప్రశ్నలు ఇవే:

  • టెండర్ ప్రాసెస్ మధ్యలో కొన్ని ఎలిజిబిలిటీ (Eligibility) నిబంధనలను ఎందుకు మార్చాల్సి వచ్చిందో CBSE సరైన వివరణ ఇచ్చిందా?
  • టెక్నికల్ లేదా అడ్మినిస్ట్రేటివ్ కోణంలో చూస్తే ఆ మార్పులు చేయడం నిజంగా అవసరమా?
  • ఆ మార్పుల వల్ల ఫైనల్ గా TCS లాంటి దిగ్గజ సంస్థను కాదని, Coempt Eduteck సంస్థకు లబ్ధి చేకూరిందా?

ఈ సిస్టమ్ వల్ల నష్టపోతున్న విద్యార్థులే రంగంలోకి దిగి డాక్యుమెంట్లను పరిశీలించకపోతే, ఈ ప్రశ్నలన్నీ రికార్డుల్లోనే కనుమరుగైపోయేవి.

డాక్యుమెంట్ల డొంక కదిపిన టీనేజర్లు

సార్థక్ సిద్ధాంత్ (Sarthak Sidhant) అనే 12వ తరగతి విద్యార్థి ఆన్-స్క్రీన్ మార్కింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్లను పబ్లిక్ డొమైన్‌లో పరిశీలించడం ప్రారంభించిన తర్వాత ఈ వివాదం ఊపందుకుంది. వేర్వేరు డాక్యుమెంట్లలో ఎలిజిబిలిటీ నిబంధనలు ఎలా మారుతూ వచ్చాయో అతడు విశ్లేషించాడు.

ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాయి. ఆ తర్వాత మరికొంత మంది విద్యార్థులు, యువ పరిశోధకులు, టెక్నాలజీ నిపుణులు రంగంలోకి దిగారు. మార్కుల కోసం కాదు, టెండర్ క్లాజుల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆన్సర్ కీల కోసం కాకుండా, ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియపై ఆడిట్ చేశారు.

ఇదొక విచిత్రమైన పరిస్థితి. విద్యార్థులను అంచనా వేయాల్సిన సంస్థ, ఇప్పుడు విద్యార్థుల చేతిలోనే ఆడిట్‌కు గురవుతోంది.

జాతీయ స్థాయికి చేరిన డిబేట్

రాజకీయ నాయకులు ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఇష్యూ విద్యాసంస్థలకే పరిమితం కాలేదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఈ టెండర్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రాజకీయ నాయకులు ఈ వివాదాన్ని సృష్టించలేదు, విద్యార్థులు బయటపెట్టిన తర్వాత దాన్ని ఫాలో అయ్యారు.

పెద్దలు చదవడానికి కూడా బద్ధకించే డాక్యుమెంట్లను విద్యార్థులు వారాల తరబడి చదివి అడిగిన ప్రశ్నలకు.. బోర్డు కనీసం బాధ్యతాయుతమైన జవాబు ఇవ్వాల్సింది.

అదే సమయంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులు కూడా రంగంలోకి దిగి డేటా భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇది కేవలం టెండర్ వ్యవహారంగా మాత్రమే కాకుండా, విద్యార్థుల డేటా భద్రత, సుపరిపాలన లాంటి అంశాలకు దారితీసింది. ఆన్సర్-షీట్ పోర్టల్‌లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని అంగీకరించిన CBSE.. వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. కానీ కోర్ సిస్టమ్ భద్రంగానే ఉందని స్పష్టం చేసింది.

CBSE కంటితుడుపు చర్యలు సరిపోవు

Coempt కి టెండర్ ఇవ్వడంలో తాము ఎలాంటి ఫేవరిటిజం చూపించలేదని CBSE మొదటినుంచీ చెప్తూనే ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అంతా జరిగిందని, ఆన్‌లైన్‌లో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. కానీ ఆ మాటలు ఈ డిబేట్‌ను ఆపలేకపోయాయి.

ఎందుకంటే, విద్యార్థులు అడిగిన పాయింట్-టు-పాయింట్ ప్రశ్నలకు బోర్డు దగ్గర నుంచి ఎలాంటి వివరణ లేదు. టెండర్ ప్రక్రియ అంతా సక్రమంగా జరిగినప్పుడు, ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో పబ్లిక్‌గా చెప్పడానికి ఎందుకంత భయం అన్నది విమర్శకుల ప్రశ్న.

జాతీయ మీడియా సంస్థలు గత కొన్ని రోజులుగా ఈ టెండర్ మార్పులు, విద్యార్థుల ఆందోళనల గురించి వివరణ కోరుతూ పలుమార్లు మెయిల్స్ చేసినప్పటికీ, CBSE నుంచి కనీస స్పందన లేదు. ఆ మౌనమే ఇప్పుడు అసలు అనుమానాలకు తావిస్తోంది.

ఇది ఒక కాంట్రాక్టుకు మించిన సమస్య

ఇది కేవలం ఒక వెండర్ లేదా టెండర్ గురించిన సమస్య కాదు. ప్రభుత్వ సంస్థలకు, ప్రజలకు మధ్య ఉండాల్సిన నమ్మకానికి సంబంధించిన విషయం. ప్రతి ఏడాదీ లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పారదర్శకత, ఆధారాలు, లాజిక్ ముఖ్యమని వారికి పాఠాలు నేర్పుతున్నారు.

ఇప్పుడు అదే విద్యార్థులు ఆ పాఠాలను ప్రాక్టికల్‌గా అప్లై చేస్తూ, తప్పులను ఎత్తిచూపుతున్నారు. ఆధారాలతో సహా డాక్యుమెంట్లను చూపుతూ సమాధానాలు డిమాండ్ చేస్తున్నారు.

వారి వాదనలతో CBSE విభేదించవచ్చు. కానీ, సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోతే మాత్రం ఆ ప్రశ్నలు గాల్లో కలిసిపోతాయని బోర్డు భావిస్తే అంతకంటే పొరపాటు మరొకటి లేదు.

Advertisement
Advertisement