త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhusudhana Chary | మండలిలో మాదే మెజారిటీ.. ఆరుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఎలా తీర్మానం పాస్ చేస్తుంది?

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మార్షల్స్ బలవంతంగా లాక్కెళ్లారు. ఈ ఘటనపై దేశపతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

J

Telangana | Published On Sep 8, 2026, 7.25 pm IST

Madhusudhana Chary | మండలిలో మాదే మెజారిటీ.. ఆరుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఎలా తీర్మానం పాస్ చేస్తుంది?
Advertisement
  • అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న తాతా మధు, నవీన్ కుమార్‌లను లాక్కెళ్లిన మార్షల్స్
  • సభ బయట జరిగిన దానికి సస్పెన్షన్ వేటు ఎలా వేస్తారని నిలదీసిన బీఆర్ఎస్ నేతలు
  • ప్రభుత్వ తీరుపై మండిపడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
  • మండలిలో 20 మంది బలమున్న తమను కాదని, మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ తీర్మానాలు పాస్ చేయడాన్ని తప్పుబట్టిన వైనం
  • కాంగ్రెస్ దొంగతనంగా తీర్మానాన్ని పాస్ చేసుకుందన్న మధుసూదనా చారి 
  • రేవంత్ సర్కార్‌పై దేశపతి శ్రీనివాస్ నిప్పులు

Madhusudhana Chary | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ శాసనసభ (Telangana Assembly) మీడియా పాయింట్ వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమను అక్రమంగా సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మీడియా ముందు మాట్లాడుతుండగానే.. అసెంబ్లీ మార్షల్స్ (Marshals) రంగంలోకి దిగి వారిని బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు. మీడియా కెమెరాల సాక్షిగా జరిగిన ఈ ఘటనతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

మాదే సంపూర్ణ మెజారిటీ 

తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. శాసనమండలిలో బీఆర్ఎస్ కు 20 మంది సభ్యులతో సంపూర్ణ మెజారిటీ ఉందని స్పష్టం చేశారు. మండలిలో బీఆర్ఎస్ బలం 20 కాగా, కాంగ్రెస్ కు కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. మెజారిటీ ఉన్న తమకు అవకాశం ఇవ్వకుండా, సభను వాయిదాలు వేస్తూ కాంగ్రెస్ దొంగతనంగా తీర్మానాన్ని పాస్ చేసుకుందని ఆయన మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతుండగానే.. మార్షల్స్ వచ్చి ఆయనను, నవీన్ కుమార్ రెడ్డిని బలవంతంగా ఈడ్చుకెళ్లారు.

చెత్తబుట్టలోకి కాంగ్రెస్ ప్రభుత్వం: దేశపతి శ్రీనివాస్

కళ్ల ముందే తమ తోటి సభ్యులను మార్షల్స్ లాక్కెళ్లడంపై బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరంకుశ, పిరికిపంద ప్రభుత్వంగా అభివర్ణించారు. "మీడియా ముందు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? సభ బయట జరిగిన ఘటనకు సస్పెన్షన్ (Suspension) ఎట్లా విధిస్తారు? దానికి సంబంధించిన రూల్ బుక్ కాపీ అడిగినా ఇవ్వలేదు" అని ఆయన అధికారులను నిలదీశారు. త్వరలోనే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు చెత్తబుట్టలో పారేస్తారని హెచ్చరించారు.

పక్షిని బంధించగలరు.. పాటను కాదు

సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ దేశపతి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. "పోరాటాల్ని పోలీసులతో అణచలేరు. పక్షిని బంధించగలరు కానీ పక్షిలోని పాటను బంధించలేరు. రైతన్నల కన్నుల్లో రగులుతున్న కన్నీటి మంటల్లో ఈ ప్రభుత్వం మాడి మసైపోతుంది" అని శాపనార్థాలు పెట్టారు.

బీఆర్ఎస్ పార్టీని ఫ్యూడల్స్ అంటున్నారని మండిపడుతూ.. యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కింద కూర్చున్నప్పుడు తామంతా ఎంతో బాధపడ్డామని గుర్తుచేశారు. దళితబంధు ఆపేయడం, లాకప్ డెత్‌లు, అంబేద్కర్ విగ్రహాన్ని కవర్లతో బంధించడం లాంటి ఘటనలు చూస్తుంటే దళితుల పట్ల ఎవరికి గౌరవం ఉందో అర్థమవుతోందని ఆయన చురకలు అంటించారు. ప్రజాకోర్టులో ఈ ప్రభుత్వానికి శిక్ష తప్పదన్నారు.

Advertisement
Advertisement