త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | కేసీఆర్ హత్యకు రేవంత్‌రెడ్డి కుట్ర.. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు..!

RS Praveen Kumar | కేసీఆర్ హత్యకు రేవంత్‌రెడ్డి కుట్ర చేశారని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్ట‌ర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. కేసీఆర్ ఇంటిపైకి కాంగ్రెస్ గూండాలను కొందరు ఎమ్మెల్యేల నాయకత్వంలో దాడికి పంపారని, పోలీస్ ఎస్కార్ట్‌తో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ నివాసం వైపు వెళ్లారని అన్నారు. కేసీఆర్ లేకుంటే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా? 200 కోట్ల భవనం కట్టుకునేవారా? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

P

Telangana | Published On Sep 8, 2026, 6.42 pm IST

RS Praveen Kumar | కేసీఆర్ హత్యకు రేవంత్‌రెడ్డి కుట్ర.. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు..!
Advertisement

RS Praveen Kumar | కేసీఆర్ హత్యకు రేవంత్‌రెడ్డి కుట్ర చేశారని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్ట‌ర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. కేసీఆర్ ఇంటిపైకి కాంగ్రెస్ గూండాలను కొందరు ఎమ్మెల్యేల నాయకత్వంలో దాడికి పంపారని, పోలీస్ ఎస్కార్ట్‌తో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ నివాసం వైపు వెళ్లారని అన్నారు. కేసీఆర్ లేకుంటే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా? 200 కోట్ల భవనం కట్టుకునేవారా? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, దుశ్శాసన పర్వం నడుస్తోందని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలంగాణ సాధకులు, ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై ఘోరమైన భాష ఉపయోగించారని ఆరోపించారు. "కేసిఆర్ చావు కోరుకుంటున్నాం.. అందుకే వెయ్యి డప్పులతో ర్యాలీ తీస్తున్నాం" అంటూ ఆయన మాట్లాడారని తెలిపారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని, వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అయ్యేవారు కాదని, రేవంత్‌రెడ్డి సీఎం అయ్యేవారు కాదని అన్నారు.

కేసిఆర్ చావు కోరుతే కోరితే..

కేసిఆర్ చావు కోరుతే కోరితే.. ఉద్యమకారుల చావును కోరుకున్నట్టే అని వ్యాఖ్యానించారు. వీర్లపల్లి శంకర్‌కు మార్గదర్శకులు రేవంత్‌రెడ్డేనని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి కూడా కొల్లాపూర్, కొడంగల్ సభల్లో మార్చురీ, స్ట్రేచర్ అంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఇలాంటి క్రూరమైన భాషను ఖండిస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, వీర్లపల్లి శంకర్‌పై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అటెన్షన్ డైవర్షన్‌లో రేవంత్‌రెడ్డి సిద్ధహస్తుడని విమర్శించారు. ఎస్సీ, గిరిజనుల హక్కులను కాలరాస్తూ వారి భూములను 22ఏ కింద చేర్చారని, దళిత బంధు లాంటి పథకాలు అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా లక్ష మంది పోలీసులను దగ్గర పెట్టుకుని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఇంటికి కాంగ్రెస్ గూండాలను కొందరు ఎమ్మెల్యేల నాయకత్వంలో పంపారని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అల్లరి మూకలను ఏనాడైనా కాంగ్రెస్ నేతల ఇళ్లకు పంపారా? అని ప్రశ్నించారు. వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, అనిల్‌కుమార్‌రెడ్డి వంటి నేరచరిత ఉన్నవారి నాయకత్వంలో దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. "కేసీఆర్ హత్యకు కుట్ర. ఈ కుట్రను తెలంగాణ మరిచిపోదు" అని అన్నారు.

ఎర్ర‌వెల్లికి వెళ్తుంటే అడ్డుకొని అరెస్టు చేశారు..

బీఆర్‌ఎస్ నాయకులు ఎర్రవల్లికి వెళ్తుంటే అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు పంపారని, కాంగ్రెస్ వాళ్లను మాత్రం అడ్డుకోకుండా పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి ఫామ్‌హౌస్‌కు పంపారని ఆరోపించారు. తాజా మధు, నవీన్‌రెడ్డిలను నిద్ర లేవకముందే పోలీసులు ఇంటికి వెళ్లి అరెస్టు చేశారని, జడ్జి ఇంటికి తీసుకెళ్లి, అనంతరం కోర్టుకు తీసుకెళ్లి జైలులో పెట్టాలని చూశారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ 7/9న విడుదలైందని, ప్రజల సమస్యలపై ప్రశ్నించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారని చెప్పారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్లారని, వాటిపై ఎలాంటి బూతులు, ఎవరినీ తిట్టే వ్యాఖ్యలు, ఎవరి పేర్లు లేవని అన్నారు. రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలను నిందించలేదని, అగౌరవపరచలేదని తెలిపారు. "తొండలు,పేగులు, గోటీల భాష టీ షర్ట్స్ మీద వాడలేదు." అని అన్నారు. రేవంత్‌రెడ్డి గురువు చంద్రబాబు గతంలో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ రాసి ఉన్న నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చారని గుర్తుచేశారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ కూడా "మోడీ అదానీ ఏక్ హై, అదాని సేఫ్ హే" అనే నినాదంతో వెళ్లారని, వారిని ఎవరూ అడ్డుకోలేదన్నారు. అలాంటప్పుడు బీఆర్‌ఎస్ నాయకులను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.

దేశంలోనే తొలి మ‌హిళా హోంమంత్రి అని చూడ‌లేదు..

టీషర్ట్ లేకున్నా మహిళా ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మిలను మగ పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. కింద పడేసి, చీర పట్టి లాగారని, సబితా ఇంద్రారెడ్డిని జుట్టు పట్టి లాగి గొంతు పిసికారని అన్నారు. దేశంలోనే మొదటి మహిళా హోం మంత్రి అని కూడా చూడలేదని మండిపడ్డారు. మహిళలపై జరిగిన దాడిని తట్టుకోలేక ఆవేశంలో తాతా మధు, నవీన్‌రెడ్డి స్పీకర్‌ను "గాడు" అని సంబోధించారని చెప్పారు. అనంతరం క్షమాపణ కోరారని, వివరణ ఇచ్చి విచారం వ్యక్తం చేశారని తెలిపారు. ఎవరినీ కులం పేరుతో దూషించలేదని స్పష్టం చేశారని, వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని చెప్పారు. తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్టుకు సంబంధించిన గ్రౌండ్స్‌లో పోలీసులు కూడా కులం పేరుతో దూషించినట్లు చెప్పలేదన్నారు. స్పీకర్‌ను నిజంగా అవమానించింది కాంగ్రెస్ నేతలేనని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. "దళిత దళిత దళిత అంటూ నిరంతరం అవమానిస్తున్నారు." అని అన్నారు. పరిపాలనా దక్షత, ప్రతిభ ఆధారంగానే మాజీ మంత్రి స్పీకర్ అయ్యారని, కానీ దళితుడు కాబట్టి స్పీకర్ అయ్యారని పదేపదే అవమానిస్తున్నారని ఆరోపించారు. శ్రీధర్‌బాబు, సీతక్క, అడ్లూరి వరకు ప్రతి ఒక్కరూ దళిత స్పీకర్ అంటూ అవమానించారని అన్నారు.

సీత‌క్క వ్యాఖ్య‌లు ఉప‌సంహ‌రించుకోవాలి..

సీతక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. "సునీత ఏడ్వడం నాటకమా?" అని ప్రశ్నించారు. "మీ మనస్సాక్షిగా మాట్లాడుతున్నారా రేవంత్ స్క్రిప్ట్ చదువుతున్నారా? ఆత్మపరిశీలన చేసుకోండి." అని అన్నారు. అడ్లూరి కూడా అసెంబ్లీలో బూతులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. వేముల వీరేశం గురించి రేవంత్‌రెడ్డి గతంలో ఏం మాట్లాడారో మరిచిపోలేదని అన్నారు. నల్గొండ క్లాక్ టవర్ వద్ద పిర్రలు పలిగేటట్టు కొడతానన్నారని, ఈ రోజు అదే వేముల వీరేశం గ్యాంగ్‌ను వేసుకొని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్నారని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో మాదిగోళ్లను, మాదిగలను డప్పులు కొట్టాలని అవమానించారని వీరేశంపై ఆరోపణలు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టిని యాదాద్రిలో కింద కూర్చోబెట్టారని, అది అవమానం కాదా? అని ప్రశ్నించారు. గోచీ కట్టుకున్నవాళ్లను కూడా అవమానించారని అన్నారు. నకిరేకల్‌లో 100 పడకల దవాఖాన ప్రారంభోత్సవానికి హెల్త్ మంత్రిని పిలవకుండా అవమానించారని ఆరోపించారు.

భంగం క‌లిగేలా మాట్లాడింది కాంగ్రెస్ నేత‌లే..

స్పీకర్ గౌరవం, ఆత్మగౌరవానికి భంగం కలిగేలా మాట్లాడింది కాంగ్రెస్ నాయకులేనని అన్నారు. మనుషులను మనుషులుగా గౌరవించేది కేసీఆర్ అని, ఆయన ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు చేయరని పేర్కొన్నారు. దేశంలో ఎవరూ చేయలేని గొప్ప పనులు కేసీఆర్ చేశారని చెప్పారు. దళిత బంధు ఆలోచన దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాలేదని అన్నారు. మూడు ఎకరాల భూమి, 1000 గురుకులాలు, ఎస్సీ సబ్‌ప్లాన్, గిరిజనుల రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచడం, స్పెషల్ డెవలప్‌మెంట్ కింద రూ.90 వేల కోట్లు ఖర్చు చేయడం వంటి కార్యక్రమాలు కేసీఆర్ చేశారని వివరించారు. రాహుల్‌గాంధీ పుట్టుక గురించి బీజేపీ ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ మాట్లాడితే అసెంబ్లీలో తీర్మానం చేసి ఖండించిన నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. స్పీకర్ తల్లిని ఏమనకపోయినా కావాలని సీతక్క స్పీకర్‌కు ఆపాదించి అవమానిస్తున్నారని ఆరోపించారు.

నికృష్ట రాజ‌కీయాలు చేయం..

మందుల సామేలు ఇంటిపై బీజేపీ నేతలు దాడి చేసినప్పుడు సీతక్క ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వందల మంది విద్యార్థులు గురుకులాల్లో శవాలైతే ఎందుకు కన్నీళ్లు రాలేదని ప్రశ్నించారు. కర్ల రాజేష్ లాకప్ డెత్‌పై ఎందుకు మాట్లాడలేదన్నారు. శిరీష అనే ఆదివాసీ అమ్మాయి రేప్‌కు గురై హత్యకు గురైతే హోం మంత్రిని తీసుకుని వెళ్లి సీతక్క ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఎర్ర రాజశేఖర్ హత్యను సీతక్క ఎందుకు ఖండించలేదని నిలదీశారు. గురుకులాల్లో విద్యార్థులు విషాహారం తిని ఆస్పత్రిలో పడితే ఎందుకు మాట్లాడలేదని అడ్లూరిని ప్రశ్నించారు. "మేం కూడా రాజకీయాలు చేయగలం. కానీ మీలాగా నికృష్ట రాజకీయాలు చేయం." అని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను చంపాలనే కుట్రతోనే వేల మందిని పోలీసు బందోబస్తుతో పంపారని ఆరోపించారు. వీర్లపల్లి శంకర్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ రేవంత్‌రెడ్డి ఉచ్చులో పడ్డారని, వారి రాజకీయాల కోసం స్పీకర్ కుర్చీని వాడుకుంటున్నారని ఆరోపించారు. మిమ్మల్ని పదేపదే దళిత స్పీకర్ అంటూ అవమానిస్తున్నారని అన్నారు. చేపలు పట్టుకునే శ్రీహరిని మంత్రిని చేశానంటూ అవమానించారని ఆరోపించారు. తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్టును తప్పుపట్టింది కోర్టు అని, కాంగ్రెస్ నాయకుల తప్పుడు ప్రచారాలకు కోర్టు తీర్పుతో చెంప చెల్లుమందని అన్నారు. 22ఏ, రైతు, నిరుద్యోగ, పాలిటెక్నిక్, దోపిడీలపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement