త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajeev Sagar | హైకోర్టు తీర్పు ప్రభుత్వ వైఫల్యానికి చెంపపెట్టు.. ఇండ్లు కూల్చ‌డం పాల‌న అనిపించుకోదు

Rajeev Sagar | హైడ్రా కమిషనర్ ఏ.వీ.రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. ఈ తీర్పుతో న్యాయ‌వ్య‌వ‌స్థ మీద ప్ర‌జ‌ల‌కు మ‌రింత న‌మ్మ‌కం పెరిగింద‌న్నారు.

S

Telangana | Published On Jul 27, 2026, 7.43 pm IST

Rajeev Sagar | హైకోర్టు తీర్పు ప్రభుత్వ వైఫల్యానికి చెంపపెట్టు.. ఇండ్లు కూల్చ‌డం పాల‌న అనిపించుకోదు
Advertisement
  • 63 కోర్టు ధిక్కరణ కేసులే హిట్ల‌ర్ పాల‌న‌కు నిదర్శనం
  • పెద్దల అక్రమ నిర్మాణాలపై అదే వేగంతో చర్యలు తీసుకున్నారా?
  • బాధిత కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి
  • బాధ్యులైన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి
  • తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ డిమాండ్‌

Rajeev Sagar | త్రినేత్ర‌.న్యూస్‌: హైడ్రా కమిషనర్ ఏ.వీ.రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. ఈ తీర్పుతో న్యాయ‌వ్య‌వ‌స్థ మీద ప్ర‌జ‌ల‌కు మ‌రింత న‌మ్మ‌కం పెరిగింద‌న్నారు. హైడ్రా చ‌ర్య‌లు హిట్ల‌ర్ పాల‌న‌ను త‌ల‌పిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. బాధిత కుటుంబాల‌కు వెంట‌నే న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌లో మాట్లాడారు.

అధికార దుర్వినియోగం జ‌రిగింది..

హైడ్రా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అమాయక ప్రజలపై అక్రమ కూల్చివేతలు, అధికార దుర్వినియోగం చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజలకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, న్యాయపరమైన అవకాశాలు కల్పించకుండా ఇళ్లను, వ్యాపారాలను కూల్చివేయడం చట్టబద్ధ పాలన కాదని అన్నారు. హైడ్రా కమిషనర్‌పై నమోదైన 63 కోర్టు ధిక్కరణ కేసులే ఆయన విధానానికి అద్దం పడుతున్నాయన్నారు. న్యాయస్థానాల ఆదేశాలను సైతం పట్టించుకోకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోందన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి అధికారి న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని రాజీవ్ సాగ‌ర్‌ గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరును హిట్లర్ పాలన నుంచి ప్రేరణగా తీసుకున్నట్లు గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రజలు మరచిపోలేదని చెప్పారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలు కూడా అదే నియంతృత్వ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో భయపెట్టి పాలించడం స‌రికాద‌న్నారు. చట్టబద్ధంగా పరిపాలించడం ప్రభుత్వ బాధ్యతని స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని మున్సిపల్ శాఖ పరిధిలోనే హైడ్రా పనిచేస్తున్నందున, హైకోర్టు తాజా వ్యాఖ్యలు నేరుగా ప్రభుత్వ పనితీరుపై వచ్చిన తీవ్రమైన హెచ్చరికగా పరిగణించాలన్నారు.

లోతుకుంట, బహదూర్‌గూడ, అమీన్‌పూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో హైడ్రా చర్యల వల్ల వందలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. జీవితాంతం కూడబెట్టుకున్న ఆస్తులను కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పరిహారం అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేదలు, మధ్యతరగతి ప్రజల విషయంలో ఒక విధానం, అధికార పార్టీకి చెందిన నాయకుల విషయంలో మరో విధానం అమలు కావడం ఆమోద‌యోగ్యం కాద‌న్నారు. చట్టం అందరికీ సమానమైతే ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై కూడా అదే వేగంతో చర్యలు తీసుకున్నారా అని ఎండ‌గ‌ట్టారు.

హైడ్రా వ్యవస్థను అడ్డంగా పెట్టుకుని రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే చర్యలు తీసుకోవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలన్నారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా ఇప్పటివరకు చేపట్టిన అన్ని చర్యలపై స్వతంత్ర న్యాయపరమైన విచారణ జరిపించాలని కోరారు. బాధితుల ఫిర్యాదులను స్వీకరించి, చట్టవిరుద్ధంగా జరిగిన కూల్చివేతలపై బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాజీవ్ సాగ‌ర్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement