త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao vs Revanth Reddy | కేసీఆర్ ‘పశుపతి’ అయితే.. రేవంత్ ‘భూతుపతి’

సీఎం రేవంత్ రెడ్డిలో ఓటమి భయం కనిపిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కరీంనగర్ సభలో కాంగ్రెస్ వైఫల్యాలు, ఓటరు నమోదుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

J

Karimnagar | Published On Jul 1, 2026, 3.55 pm IST

Harish Rao vs Revanth Reddy | కేసీఆర్ ‘పశుపతి’ అయితే.. రేవంత్ ‘భూతుపతి’
Advertisement
  • 2034 దాకా నేనే సీఎం అనడంలోనే రేవంత్ ఓటమి భయం
  • రైతుబంధు, రుణమాఫీ అమలు చేయని కాంగ్రెస్ సర్కార్‌ను రైతులు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే
  • కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయడం లేదు
  • కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
  • జులై 25 లోపు కొత్త ఓటరు నమోదు (Voter Enrollment) ప్రక్రియను ప్రతి బూత్ ఏజెంట్ పకడ్బందీగా పూర్తి చేయాలని పిలుపు

Harish Rao vs Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని, 'అధికారం శాశ్వతం కాదు' అనే మాటలే ఆయన జారుడుబండ మీద ఉన్నాడనడానికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లోని కొండ సత్య లక్ష్మీ గార్డెన్స్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్ తదితర ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Harish Rao Slams CM Revanth Reddy in Karimnagar BRS Meeting

రైతు డిక్లరేషన్ పేరుతో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ రైతులను నిలువునా వంచించిందని హరీశ్ రావు మండిపడ్డారు. "30 వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టి.. వేములవాడ రాజన్న సాక్షిగా రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ నాయకులను రైతులు కాగడాలు పట్టుకుని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. రైతులను, పాడిని కాపాడిన కేసీఆర్ 'పశుపతి' అయితే.. రాష్ట్రాన్ని ఆగం చేస్తున్న రేవంత్ రెడ్డి ఒక 'భూతుపతి'" అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. డిసెంబర్ 2023లో తెలంగాణకు రేవంత్ రెడ్డి రూపంలో పట్టిన అతిపెద్ద 'ఎల్‌నినో' (El Nino) ను పారదోలాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.

రైతులు రేవంత్‌ను ఎందుకు కాపాడాలి?

రైతులకు ఏ మేలు చేశారని తనను కంచె వేసి కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి అడుగుతున్నారో సమాధానం చెప్పాలన్నారు.

  • మూడు విడతల రైతుబంధు ఎగ్గొట్టినందుకా?
  • యాసంగి బోనస్ బోగస్ చేసినందుకా?
  • కరెంటు కోతలతో రైతులను గోస పెడుతున్నందుకా?
  • చనిపోయిన 7,600 మంది రైతులకు బీమా డబ్బులు ఇవ్వనందుకా?

గతంలో ఆటో డ్రైవర్‌కు చెబితే ఎరువులు ఇంటికి వచ్చేవని, ఇప్పుడు చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం ఎదురుచూసే దౌర్భాగ్య పరిస్థితి మళ్లీ వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Harish Rao Slams CM Revanth Reddy in Karimnagar BRS Meeting

బురద రాజకీయాలు మాని.. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలి

ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును హరీశ్ రావు తప్పుబట్టారు. కరువు వస్తుందని ముందే ఊహించి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని గుర్తుచేశారు. "గత రెండేళ్లు ఎల్లంపల్లి, మిడ్ మానేరు ద్వారా కాళేశ్వరం మోటార్లతోనే బ్రహ్మాండంగా పంటలు పండాయి. కానీ ఇప్పుడు మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నా ప్రభుత్వం కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయడం లేదు. కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న అక్కసుతో నీళ్లను వృథా చేస్తున్నారు. వెంటనే మోటార్లు ఆన్ చేసి పంటలు కాపాడాలి" అని డిమాండ్ చేశారు.

Harish Rao Slams CM Revanth Reddy in Karimnagar BRS Meeting

ఓటరు నమోదుపై కార్యకర్తలకు దిశానిర్దేశం

కరీంనగర్ గడ్డకు, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న పేగుబంధాన్ని హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రాబోయే ఎన్నికల కోసం ఓటరు నమోదు (Voter Enrollment) ప్రక్రియలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కుట్రలు తిప్పికొట్టండి: ఇతర రాష్ట్రాల తరహాలో కాంగ్రెస్, బీజేపీ.. ప్రతిపక్షాల ఓట్లు తొలగించే కుట్రలు చేసే ప్రమాదం ఉంది. బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) చురుకుగా పనిచేసి ఓట్లను కాపాడుకోవాలి.

ప్రతి ఒక్కరూ ఫారం నింపాల్సిందే: గతంలో ఓటు వేసిన వారైనా సరే.. ఇప్పుడు మళ్లీ ఎన్‌రోల్‌మెంట్ ఫారం నింపి బూత్ లెవెల్ ఆఫీసర్‌కు (BLO) ఇవ్వకపోతే ఓటు హక్కు కోల్పోతారు.

కుటుంబ సభ్యుల తరఫున: కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్నా వారు ఇక్కడికి రావాల్సిన పనిలేదు. రక్తసంబంధం ఉన్న ఇంటి యజమాని వివరాలు రాసి సంతకం చేస్తే ఓటు చెల్లుబాటు అవుతుంది.

కొత్త ఓటర్లు: అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువత కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 25 చివరి తేదీ కావడంతో పది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.

 

ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ 20 బూత్‌ల ఏజెంట్లతో ప్రత్యేక సమీక్షలు జరుగుతున్నాయని, పార్టీకి కళ్లు, చెవులు బూత్ ఏజెంట్లే అని హరీశ్ రావు స్పష్టం చేశారు. బూత్ ఏజెంట్లుగా కష్టపడిన వారే భవిష్యత్తులో సర్పంచులు, ఎమ్మెల్యేలుగా ఎదుగుతారని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

Advertisement
Advertisement