త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రాష్ట్రంలో కుప్పకూలిన వైద్య వ్యవస్థ.. బతికించేందుకు 108 రాదు, చనిపోతే పరమపద వాహనాలు లేవు: హ‌రీశ్ రావు

Harish Rao | రాష్ట్రంలో వైద్య వ్య‌వ‌స్థ కుప్ప‌కూలింద‌ని బీఆర్ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) విమ‌ర్శించారు. బతికించేందుకు 108 రాద‌ని, చనిపోతే పరమపద వాహనాలు లేవ‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ (KCR) తెచ్చిన సేవలను రేవంత్ స‌ర్కార్ (Revanth Reddy) మూలనపడేసింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

G

Telangana | Published On May 25, 2026, 10.15 am IST

Harish Rao | రాష్ట్రంలో కుప్పకూలిన వైద్య వ్యవస్థ.. బతికించేందుకు 108 రాదు, చనిపోతే పరమపద వాహనాలు లేవు: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో వైద్య వ్య‌వ‌స్థ కుప్ప‌కూలింద‌ని బీఆర్ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) విమ‌ర్శించారు. కాంగ్రెస్ (Congress Govt)ప్రభుత్వ నిర్లక్ష్యానికి తాండూరు, భద్రాచలం అమానవీయ ఘటనలే సజీవ సాక్ష్యాల‌ని మండిప‌డ్డారు. బతికించేందుకు 108 రాద‌ని, చనిపోతే పరమపద వాహనాలు లేవ‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ (KCR) తెచ్చిన సేవలను రేవంత్ స‌ర్కార్ (Revanth Reddy) మూలనపడేసింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముగ్గురు మంత్రులున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంబులెన్స్ ఇవ్వక శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన దయనీయ స్థితి ఏర్ప‌డింద‌ని చెప్పారు. భద్రాచలం ఘటనకు కారణమైన హాస్పిట‌ల్‌ సిబ్బందిపై చర్యలు తీసుకుని, రాష్ట్రవ్యాప్తంగా అంబులెన్స్ సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

`కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వైద్య వ్యవస్థ ఎంత దారుణంగా కుప్పకూలిందో చెప్పడానికి తాజాగా జరిగిన ఈ రెండు అమానవీయ ఘటనలే సజీవ సాక్ష్యాలు. నిరుపేదల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం, ఎందుకు ఇంత చులకన భావం?.

తాండూరు రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి పురిటి నొప్పులతో ఓ నిరుపేద గర్భిణీ ప్రాణాలతో పోరాడుతుంటే… 108కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. చివరికి దిక్కుతోచని పరిస్థితిలో రైల్వే ప్లాట్‌ఫాం పైనే ఆ తల్లి ఆడబిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చింది. ఒక ఆటో డ్రైవర్ చూపించిన కనీస మానవత్వం, స్పందన కూడా ప్రభుత్వ యంత్రాంగానికి లేకపోవడం సిగ్గుచేటు. గర్భిణులకు అండగా ఉండాల్సిన 108 అంబులెన్సులు, అమ్మఒడి వాహనాలు ఎక్కడ? మాయమయ్యాయి?.

మరోవైపు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మరణించిన బంధువు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలని వేడుకున్నా ఆసుపత్రి సిబ్బంది కనికరించలేదు. ప్రైవేట్ వాహనం మాట్లాడుకునే స్థోమత లేక.. ఆ నిరుపేద కుటుంబం మృతదేహాన్ని భుజాలపై మోస్తూ వీధుల గుండా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం ప్రతి మనసును కలిచివేస్తోంది. ముగ్గురు రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఇంతటి దారుణం జరగడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.

కేసీఆర్ ప్రభుత్వంలో పేదల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఉచిత ‘హర్స్‌’ వెహికిల్స్‌ (పరమపద వాహనాలు) ఏమయ్యాయి? ఎందుకు మూలన పడ్డాయి?. బతికించేందుకు 108 అంబులెన్సులు రావు… చనిపోయాక కడసారి ఇంటికి తీసుకెళ్లేందుకు పరమ పద వాహనాలు లేవు.. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే పాలన?. మనుషుల ప్రాణాలు అంటే ఈ ప్రభుత్వానికి గౌరవం లేదా? ఆయన వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారికి అండగా ఉండే బాధ్యత లేదా?. యావత్ ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన అమానవీయ ఘటన ఇది.

ముఖ్యమంత్రి, మంత్రులు ప్రచారాలకే పరిమితం కాకుండా ప్రజల అసలు బాధలను చూడండి. భద్రాచలం ఘటనలో అమానవీయంగా వ్యవహరించిన ఆసుపత్రి అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా 108 అంబులెన్సులు, పరమపద వాహన సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలి` అని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement