త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఒకప్పుడు కరువుతో అల్లాడిన సిద్దిపేటకు వ‌రంలా మారిన కాళేశ్వరం: హరీశ్ రావు

Harish Rao | నాడు ప‌శుగ్రాస కేంద్రాలు పెట్టిన ప్రాంతంలో.. నేడు కాళేశ్వ‌రంతో (Kaleshwaram) రెండు పంట‌లు పండుతున్నాయ‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. కాళేశ్వ‌రం జ‌లాల‌తో సిద్దిపేట‌లో (Siddipet) పంట సాగు 8 వేల‌ నుంచి 80 వేల ఎక‌రాల‌కు పెరిగింద‌ని చెప్పారు.

G

Telangana | Published On Mar 21, 2026, 11.07 am IST

Harish Rao | ఒకప్పుడు కరువుతో అల్లాడిన సిద్దిపేటకు వ‌రంలా మారిన కాళేశ్వరం: హరీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: నాడు ప‌శుగ్రాస కేంద్రాలు పెట్టిన ప్రాంతంలో.. నేడు కాళేశ్వ‌రంతో (Kaleshwaram) రెండు పంట‌లు పండుతున్నాయ‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. కాళేశ్వ‌రం జ‌లాల‌తో సిద్దిపేట‌లో (Siddipet) పంట సాగు 8 వేల‌ నుంచి 80 వేల ఎక‌రాల‌కు పెరిగింద‌ని చెప్పారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన సిద్దిపేట ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరంలా మారిందని తెలిపారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మొన్న అసెంబ్లీలో తాము గట్టిగా చేసిన ఒత్తిడితో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చింద‌న్నారు.

`మా పోరాటం ఫలితంగానే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. క్వింటాల్‌కు రూ. 2400 మద్దతు ధర ఉంటే.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో నిన్నటిదాకా రైతులు బయట దళారులకు రూ.1600 నుంచి రూ.1700లకే అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ముందే ఈ కేంద్రాలను ప్రారంభించి ఉంటే రైతులందరికీ మేలు జరిగేది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే 20 నుంచి 25 శాతం మొక్కజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికైనా రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలి.

మన ప్రాంతంలో సన్‌ఫ్లవర్ కూడా బాగా సాగు చేస్తున్నారు. దానికి కూడా ఈరోజు కొనుగోలు కేంద్రం ప్రారంభించాం. పొద్దుతిరుగుడు క్వింటాల్‌కు రూ.7721 మద్దతు ధర ఉంది. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఆదాయం పొందాలి. సన్‌ఫ్లవర్ తక్కువ కాలంలో పూర్తయ్యే పంట. దీనివల్ల అధిక ఆదాయంతో పాటు మంచి దిగుబడి కూడా వస్తుంది. పంట మార్పిడికి కూడా ఇది ఎంతో ఉపయోగకరం. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని రైతులకు పిలుపునిస్తున్నా.

ఈ యాసంగిలో మన సిద్దిపేట ప్రాంతంలో ఇంత మంచి దిగుబడి వస్తుందంటే, ఈ స్థాయిలో పంటలు పండుతున్నాయంటే దానికి ఏకైక కారణం కాళేశ్వరం ప్రాజెక్టే. ఒకప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో యాసంగి సాగు కేవలం 8 వేల ఎకరాలు మాత్రమే ఉండేది. కానీ ఇవాళ కాళేశ్వరం జలాల పుణ్యమా అని అది పదింతలు పెరిగి ఏకంగా 80 వేల ఎకరాల్లో యాసంగి సాగు జరుగుతున్న‌ది. 2005లో కరువు వచ్చిన పరిస్థితులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. తాగడానికి నీళ్లు లేక, పశువులకు గడ్డి లేక అల్లాడిపోయాం.

పశువులను బతికించుకోవడానికి చిన్నకోడూరు, రాజగోపాల్‌పేట, నంగునూరులో పశుగ్రాస కేంద్రాలు పెట్టి ఆంధ్రా నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల గడ్డి తెచ్చి రైతులకు పంపిణీ చేశాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక సిద్దిపేట దరిదాపుల్లో కరువు అనే మాటే లేదు. వానలు పడినా, పడకపోయినా కాలంతో సంబంధం లేకుండా రైతులు రెండు పంటలు పండిస్తూ బంగారం లాంటి దిగుబడులు సాధిస్తున్నారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన మన ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరంలా మారింది. ఈ ప్రాజెక్టు మన ప్రాంత రూపురేఖలను మార్చేసి, వ్యవసాయానికి కొత్త దిశానిర్దేశం చేసింది. రైతులు ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దు, కొనుగోలు కేంద్రాల ద్వారానే తమ పంటను అమ్ముకుని ప్రభుత్వ మద్దతు ధరను పూర్తిస్థాయిలో పొందాలి.` అని హ‌రీశ్ రావు సూచించారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement