త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఆధారాల‌తో కాంగ్రెస్ మంత్రి మైనింగ్ దోపిడీని బ‌య‌ట‌పెట్టిన హ‌రీశ్‌రావు

Harish Rao | మంత్రుల అక్రమ మైనింగ్ దోపిడీపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు నిల‌దీశారు. అసెంబ్లీలో మైనింగ్ శాఖ పద్దులపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ చేస్తున్న అక్ర‌మ మైనింగ్ దోపిడీపై ప‌క్కా ఆధారాలు, అధికారుల నోటీసుల‌తో స‌హా మైనింగ్ కుంభ‌కోణాన్ని సభ ముందుంచారు.

P

Telangana | Published On Mar 28, 2026, 4.42 pm IST

Harish Rao | ఆధారాల‌తో కాంగ్రెస్ మంత్రి మైనింగ్ దోపిడీని బ‌య‌ట‌పెట్టిన హ‌రీశ్‌రావు
Advertisement
  • రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ దోపిడీపై చ‌ర్య‌ల‌కు డిమాండ్‌
  • ప్ర‌తిప‌క్షాల‌తో క‌మిటీ వేయాల‌ని డిమాండ్‌

Harish Rao | మంత్రుల అక్రమ మైనింగ్ దోపిడీపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు నిల‌దీశారు. అసెంబ్లీలో మైనింగ్ శాఖ పద్దులపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ చేస్తున్న అక్ర‌మ మైనింగ్ దోపిడీపై ప‌క్కా ఆధారాలు, అధికారుల నోటీసుల‌తో స‌హా మైనింగ్ కుంభ‌కోణాన్ని సభ ముందుంచారు. అసెంబ్లీలో హార‌శ్‌రావు మాట్లాడుతూ 'మైనింగ్ డిపార్ట్మెంట్ అనేది ప్రభుత్వానికి నాన్-టాక్స్ రెవెన్యూ తెచ్చిపెట్టే అత్యంత కీలకమైన శాఖ. ఇలాంటి శాఖలో అధికారులు, ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా పని చేస్తే ఖజానాకు అంత డబ్బు వస్తుంది. ఆ నిధులతో అభివృద్ధి, సంక్షేమం చేప‌ట్టొచ్చు. కానీ, ఇవాళ మైనింగ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. నేను ఏది చెప్పినా పక్కా ఆధారాలతో సహా చెబుతున్నాను. రాష్ట్ర ఆదాయానికి తూట్లు పడొద్దు అన్నదే మా తపన' అని తెలిపారు.

హైద‌రాబాద్ న‌డిబొడ్డునే అక్ర‌మ మైనింగ్‌..

'హైదరాబాద్ నడిబొడ్డున, నగరాన్ని ఆనుకునే పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ వ్యాపారాలు జరుగుతున్నాయి. కంచె చేను మేసిన విధంగా, రక్షకుడే భక్షకుడిగా మారితే ఏం జరుగుతుందో.. అలాంటి పరిస్థితే ఇవాళ రాష్ట్రంలో దాపురించింది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన మనందరికీ రాష్ట్ర వనరులను కాపాడే బాధ్యత ఉంది. జీవో 111 పరిధిలోనే రాఘవ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ అక్ర‌మ దందా జ‌రుగుతోంది. జీవో 111 ఉల్లంఘిస్తూ.. రూల్స్ లేవు. పర్మిషన్స్ లేవు. దర్జాగా దందాలు జరుగుతున్నాయి. శంషాబాద్ మండలం కోత్వాల్ గూడ గ్రామంలో (సర్వే నెంబర్ 62, 63) ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదు. అక్కడ రాఘవ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ భారీ స్టోన్ క్రషర్‌ను డీజిల్ జనరేటర్లపై యథేచ్ఛగా నడుపుతోంది' అని పేర్కొన్నారు.

ప‌రిశ్ర‌మ‌కు మిన‌ర‌ల్ డీల‌ర్ లైసెన్స్ కావాల్సిందే..

'ఈ ప్రభుత్వం తెచ్చిన జీవో 26 (స్టోన్ క్రషర్ రూల్స్ 2026) ప్రకారం, స్టోన్ క్రషర్ పెట్టాలంటే మినరల్ డీలర్ లైసెన్స్ (MDL) ఉండాలి. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సీఎఫ్‌సీ, సీఎఫ్‌వో సర్టిఫికెట్లు తీసుకోవాలి. ఇందులో ఏ ఒక్క నిబంధన కూడా రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ పాటించ‌లేదు. వారికి ఎండీఎల్ లైసెన్స్ లేదు. సీఎఫ్ఈ, సీఎఫ్‌వో, రిజిస్ట్రేష‌న్ లేదు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేకుండా డీజిల్ జనరేటర్ల మీద ఎందుకు నడపవలసి వస్తున్నది అంటే.. కరెంట్ కనెక్షన్ తీసుకోవాలంటే పైన పేర్కొన్న పర్మిషన్లన్నీ ఉండాలి. అవి లేవు కాబట్టే దొంగచాటుగా డీజిల్ జనరేటర్లతో క్రషింగ్ చేస్తున్నారు. ఈ దారుణమైన దోపిడీని క్రోనాలజీ ప్రకారం సభ ముందు పెడుతున్నాను' అని చెప్పారు.

  • 21 మే 2025 నాడు మైనింగ్ డైరెక్టర్ జనరల్ స్వయంగా ఈ క్రషర్ పై తనిఖీకి ఆదేశించారు. రెవెన్యూ, పీసీబీ, ఎస్‌పీడీసీఎల్‌, మైనింగ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి 5,130 మెట్రిక్ టన్నుల అక్రమ రఫ్ స్టోన్ నిల్వలను పట్టుకున్నారు.
  • 13-02-2026న డిమాండ్ నోటీసు (నం. 1216) జారీ చేసి, రూ.24,00,840 (నార్మల్ ఫీజు + 5 రెట్ల పెనాల్టీ) చెల్లించాలని ఆదేశించారు. కానీ రాఘవ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ సంస్థ అస‌లు ప‌ట్టించుకోలేదు.
  • 04-03-2026న మళ్లీ తనిఖీ చేయగా.. ఈసారి ఏకంగా 11,200 ఎంటీల ముడి సరుకు దొరికింది. 13-03-2026 న మరో షోకాజ్ నోటీసు (నం. 788) ఇచ్చారు.
  • 05-03-2026న ఎలాంటి అనుమతులు లేకుండా డీజిల్ జనరేటర్‌పై స్టోన్ క్రషర్ నడుపుతున్నారు, కాలుష్యానికి పాల్పడుతున్నారు అని స్వయంగా మైనింగ్ అధికారులే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి లేఖ రాశారు.

ప్ర‌భుత్వం మౌనం ఎందుకు?

'మైనింగ్ చట్టం ప్రకారం.. ఎండీఎల్ లైసెన్స్ లేకుండా క్వారీ చేస్తే మొదటిసారి రూ.10వేలు, రెండోసారి కూడా పట్టుబడితే రూ.25వేల జరిమానాతో పాటు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించాలి. రాఘవ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ రెండుసార్లు పట్టుబడింది. మరి ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది? ఆ కంపెనీ పట్ల ఎందుకింత ప్రేమ? ఇప్పటివరకు మీరు తీసుకున్న కఠిన చర్యలు ఏంటో సమాధానం చెప్పాలి' అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు.. తన స్టోన్ క్రషర్ లో చిన్న తప్పు జరిగిందని చెప్పి, రాత్రికి రాత్రి అరెస్టు చేసి నెల రోజులు జైల్లో పెట్టారు. మరి ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పార్టీ మంత్రులకు ఒక న్యాయం ఉంటుందా? అంటూ నిల‌దీశారు. ముఖ్యమంత్రి మూసీలో కాలుష్యం జరగవద్దు అంటారు. కానీ ఇక్కడ మైనింగ్ అధికారులే.. రాఘవ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌తో మూసీ నది కాలుష్యానికి, గండిపేట్, హిమాయత్ సాగర్ లో కాలుష్యానికి కారణం అవుతోంద‌ని లిఖిత‌పూర్వ‌కంగా రాశారంటూస హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

ముఖ్య‌మంత్రి స‌మాధానం ఏంటీ?

'ఈ వ్య‌వ‌హారంపై సీఎం ఏం సమాధానం చెబుతారు. మైనింగ్ శాఖ మంత్రి మాట్లాడుతూ.. రాఘవ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌కి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏం సంబంధం? అని అడుగుతున్నారు. గతంలో ఇదే రాఘవ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ అక్ర‌మాల‌పై ట్విట్ట‌ర్‌లో పెడితే మంత్రి పొంగులేటి ప్రెస్ మీట్ పెట్టి "నాపై మొరిగే కుక్కలను గొలుసు కట్టి ఎలా కట్టేయాలో మాకు బాగా తెలుసు" అని మాట్లాడారు. సంబంధం లేకపోతే మీరెందుకు భుజాలు తడుముకున్నారు? మంత్రి పొంగులేటి తక్షణమే నైతికంగా రాజీనామా చేసి, విచారణ ఎదుర్కోవాలి. నిన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి. మేం చేస్తే తప్పేంటి? అన్నట్లు మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా తప్పు చేయడానికి వీల్లేదు. మీరు అధికారంలో ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ వేశారు, విద్యుత్ కమిషన్ వేశారు.. మీ చేతుల్లో పవర్ ఉంది ఎంక్వయిరీ చేసుకోండి' అని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌తిప‌క్షంతో హౌస్ క‌మిటీ వేయాలి..

'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓబులాపురం మైన్స్‌పై ఆరోపణలు వస్తే.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హౌస్ కమిటీ వేసి, ఆరోపణలు చేసిన నాగం జనార్దన్ రెడ్డి గారినే ఆ కమిటీకి చైర్మన్‌గా వేశార‌ని, ఇప్పుడు నేను ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాను. మీ దగ్గర నిజాయితీ ఉంటే, ఈ కుంభకోణంతో మీకు సంబంధం లేకపోతే.. ప్రతిపక్ష సభ్యులతో హౌస్ కమిటీ వేయండి.. లేదా ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. ఆయన గతంలో మాతో కలిసి పని చేశారు. కానీ, ఒక తప్పు జరిగినప్పుడు.. ఆ తప్పును ఆధారాలతో సహా బయటకు తీయడం, రాష్ట్ర ఖజానాను కాపాడటం ప్రతిపక్షంగా మా బాధ్యత' అంటూ హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement