త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | జీవో 97ని త‌క్ష‌ణం ర‌ద్దు చేయాలి.. హ‌రీశ్‌రావు డిమాండ్‌

Harish Rao | పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. పాలిటెక్నిక్‌ కళాశాలలను ఐటీఐలతో విలీనం చేయొద్దని, సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే యథాతథంగా కొనసాగించాల‌న్నారు.

P

Telangana | Published On Aug 22, 2026, 6.15 pm IST

Harish Rao | జీవో 97ని త‌క్ష‌ణం ర‌ద్దు చేయాలి.. హ‌రీశ్‌రావు డిమాండ్‌
Advertisement

Harish Rao | పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. పాలిటెక్నిక్‌ కళాశాలలను ఐటీఐలతో విలీనం చేయొద్దని, సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే యథాతథంగా కొనసాగించాల‌న్నారు. పాలిటెక్నిక్‌ కళాశాలలను ఐటీఐలతో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సిద్దిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు రాజగోపాల్‌పేట్‌ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన హరీశ్‌రావు విద్యార్థులను కలిసి వారి ఆందోళనకు మద్దతు తెలిపారు.

నేను పాలిటెక్నిక్ విద్యార్థినే..

తాను కూడా పాలిటెక్నిక్‌ విద్యార్థినేనని, ఆ చదువుల ప్రాముఖ్యత, విద్యార్థుల కష్టాలు తనకు తెలుసని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ విద్యాసంస్థలకు ఏడు దశాబ్దాల ఘన చరిత్ర ఉందన్నారు. ఎందరో నిరుపేద విద్యార్థులు పాలిటెక్నిక్‌ విద్య ద్వారా దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో చదువుతున్న వారిలో 95 శాతం మంది నిరుపేద విద్యార్థులేనని హరీశ్‌రావు తెలిపారు. నామమాత్రపు ఫీజులతో నాణ్యమైన ఇంజనీరింగ్‌ స్థాయి విద్యను డిప్లొమా కోర్సుల్లో అభ్యసిస్తున్నారని చెప్పారు. పాలిటెక్నిక్‌ను ఐటీఐల్లో విలీనం చేస్తే దాని ప్రత్యేకత, స్థాయి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

స్కిల్ యూనివ‌ర్సిటీలోకి మార్చ‌డం స‌రికాదు..

ప్రస్తుత విధానం ప్రకారం పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్‌లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశం పొందే అవకాశం ఉందని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఐటీఐలతో విలీనం చేస్తే ఇంజినీరింగ్‌లో చేరేందుకు మళ్లీ ఇంటర్‌ చదవాల్సిన పరిస్థితి వస్తుందని, దీనిపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఇంజినీరింగ్‌లో నేరుగా రెండో సంవత్సరం ప్రవేశం కల్పించే విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. పటిష్టమైన పాలిటెక్నిక్‌ విద్యావ్యవస్థను తెలంగాణ విద్యాచట్టం పరిధి నుంచి తొలగించి యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ పరిధిలోకి మార్చడం సరికాదన్నారు. దీనివల్ల నిరుపేద విద్యార్థులు పాలిటెక్నిక్‌ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని, చివరకు వ్యవస్థ బలహీనపడుతుందని పేర్కొన్నారు. పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ పేరుతో 95 శాతం నిరుపేద విద్యార్థులు చదువుతున్న వ్యవస్థను నాశనం చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు.

బిల్లును ఉప‌సంహ‌రించుకోవాలి..

విద్యార్థులు, మేధావులతో ముందస్తుగా అభిప్రాయ సేకరణ చేయకుండా, విధివిధానాలను బహిర్గతం చేయకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని హరీశ్‌రావు విమర్శించారు. దీంతో విద్యార్థులు తమ భవిష్యత్తుపై అయోమయానికి గురవుతున్నారని అన్నారు. మంత్రిమండలి ఆమోదించిన పాలిటెక్నిక్‌ కళాశాలలను శక్తి శాఖలోకి విలీనం చేసే బిల్లును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. జీవో 97ను రద్దు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశానని, అసెంబ్లీలోనూ విద్యార్థుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.
ఏఐసీటీఈ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే, ఎస్‌బీటీఈటీ బోర్డు పర్యవేక్షణలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు కొనసాగాలని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట ఉమెన్స్‌ పాలిటెక్నిక్‌ విద్యార్థుల పోరాటానికి బీఆర్‌ఎస్‌, ఆ పార్టీ విద్యార్థి విభాగం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. పాలిటెక్నిక్‌ విద్యావ్యవస్థను పాత విధానంలోనే కొనసాగించే వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటం ఆగదని హెచ్చరించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement