త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పడి 800 రోజులు పూర్త‌యినా.. అమ‌లుకాని ఆరు గ్యారంటీలు: హ‌రీశ్ రావు

G

Telangana | Published On Feb 20, 2026, 1.09 pm IST

Harish Rao | కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పడి 800 రోజులు పూర్త‌యినా.. అమ‌లుకాని ఆరు గ్యారంటీలు: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ (Budget) రూపొందించాల‌ని, కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయింద‌న్నారు. ఎన్నిక‌ల‌ప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రేవంత్ రెడ్డి అంద‌రూ బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు (Six Guarantees) అమలు చేస్తామని హామీలు ఇచ్చార‌ని గుర్తుచేశారు. కానీ, 100 రోజులు కాదు కదా.. 800 రోజులు పూర్తయినా ఇప్పటికీ ఆరు గ్యారెంటీలు అమలవుతున్న దాఖలాలు లేవ‌ని విమ‌ర్శించారు. సిద్దిపేట ప‌ట్ట‌ణంలోని 37వ వార్డులో బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని హ‌రీశ్ రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. `ఎస్సీ డిక్లరేషన్ పేరిట దళితులకు 18 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని మోసం చేశారు. చదువుకునే పిల్లలకు టెన్త్ పాస్ అయితే రూ.10 వేలు, ఇంటర్ పాస్ అయితే రూ.25 వేలు, డిగ్రీకి రూ.50వేలు, పీజీ చదివితే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి.. ఈరోజు వరకు ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. కనీసం కేసీఆర్ ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు కూడా రావడం లేదు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభకు క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్దరామయ్యను తీసుకొచ్చి బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఏటా రూ. 20 వేల‌ కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక బీసీలకు కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపింది. వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ మాయమాటలు చెప్పారు. ఏటా రూ.15 వేలు రైతుబంధు, పంటల బీమా, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను నిలువునా దగా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, యువత.. ఇలా అన్ని వర్గాలను మోసం చేసింది.

27 నెలలు గడుస్తున్నా..

గతంలో అవ్వాతాతలకు కేవలం రూ.200 ఉన్న పెన్షన్‌ను కేసీఆర్ రూ.2 వేలు చేశారు. కానీ కాంగ్రెస్ నేతలు తాము డిసెంబర్‌లో గెలిచిన మరుసటి నెల నుంచే రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. 27 నెలలు గడుస్తున్నా ఆ రూ.4 వేల‌ పెన్షన్ రాలేదు. ఈనెల 26న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ బాధితులు, గీత, చేనేత కార్మికులందరికీ తక్షణమే రూ.4 వేలు పెన్షన్ ఇచ్చేలా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క‌ను డిమాండ్ చేస్తున్నాను.

మహిళకు ఆ డబ్బులు ఇవ్వలే

మహిళలందరికీ నెలకు రూ.2,500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పటిదాకా ఒక్క మహిళకు కూడా ఆ డబ్బులు ఇవ్వలేదు. తక్షణమే ఈ బడ్జెట్‌లో మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చేలా నిధులు కేటాయించాలి. గత బడ్జెట్‌లో అసెంబ్లీలో గొప్పగా స్పీచులు దంచి, బల్లలు చరిచి చెప్పిన పథకాలు ఏవీ అమలు కాలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇప్పటికీ కూలీలకు డబ్బులు అందలేదు, పంటల బీమా రాలేదు.

ఒక్క రూపాయి కూడా..

యువత కోసం ప్రవేశపెడతామన్న రాజీవ్ యువ వికాసం అమలు కాలేదు. ఏ ఒక్క యువతీయువకుడికి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. బడ్జెట్‌లో చెప్పిన మాటలకు కూడా విలువ లేకుండా చేశారు. కనీసం ఈ బడ్జెట్‌నైనా వాస్తవాల ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా రూపొందించాలి. రూ.4 వేలు పెన్షన్, మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే హామీలను అమలు చేసేలా బడ్జెట్‌లో నిధులు పొందుపరచాలని` హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement