Harish Rao | విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాఫ్ అయ్యారని తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. త్రీ ట్రిలియన్ ఎకానమీ, ఫ్యూచర్ సిటీ అని గొప్పలు చెప్పడం కాదు.. ముందు హాస్టల్ పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టాలని హితువు పలికారు. బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కింగ్ కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను హరీశ్ రావు పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ఉన్నారు. ఈసందర్భంగా విదార్థులకు అందుతున్న వైద్యం గురించి హరీశ్ రావు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై, రాహుల్ గాంధీ పర్యటనపై తీవ్ర స్థాయిలో హరీశ్ రావు మండిపడ్డారు. పిల్లల పాలిట పాయిజన్గా మారిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రభుత్వ, గురుకుల పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలు అవుతున్నారు. మొన్న శామీర్ పేట్ రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలవుతున్నారు. మొన్న శామీర్ పేట్ లో బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విద్యార్థులే ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. నిన్న మాదాపూర్ లోని చందు నాయక్ తండాలో మధ్యాహ్న భోజనం వికటించి 43 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు ముషీరాబాద్ నియోజకవర్గంలో బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకులంలో కలుషిత ఆహారం తిని 90 మంది ఆసుపత్రి పాలయ్యారు. రేవంత్ రెడ్డి విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇది విజన్ 2047 కాదు.. విద్యార్థుల పాలిట పాయిజన్ 2047 గా మారింది. నీకు నిజాయితీ ఉంటే గురుకులాల్లోని పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టు. ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు తిరిగి మళ్లీ హాస్టల్ కి వెళ్ళము అని భయపడి చెబుతున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. కేసీఆర్ హయాంలో సన్నబియ్యంతో మంచి నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేది. ఇప్పుడు దొడ్డు బియ్యం పెడుతున్నారు, అన్నం ఉడకడం లేదు, సరైన భోజనం పెట్టట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీవీ యాడ్లు, పేపర్ యాడ్ల కోసం మాత్రమే తెలంగాణ రైసింగ్. వాస్తవంలో గురుకుల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హాస్పిటల్స్ లో ఫాలింగ్. దేంట్లో రైసింగ్? అవినీతిలో రైసింగ్. అరాచకంలో రైసింగ్. అహంకారంలో లేక కబ్జాలో రైసింగ్. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నా అంటున్నావు. అప్పటివరకు పిల్లలు బతికుండేది ఎట్లా. ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్టైనా లేదు. ఏనాడు కూడా ఆసుపత్రి పాలైన విద్యార్థులను పరామర్శించలేదు. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడు. మెస్సితో ఫుట్బాల్ ఆడటానికి మేస్త్రి కోట్లు ఖర్చు చేస్తున్నాడు. 5 కోట్లతో స్టేడియం కట్టించుకున్నాడు. 100 కోట్లు ఖర్చుపెట్టి ఫుట్బాల్ ఆడడం ఎందుకు రేవంత్ రెడ్డి? ఆ డబ్బుతో ఒక పూట కడుపునిండా అన్నం విద్యార్థులకు పెట్టలేవా? నీ కబ్జాలకు, నీ సోకులకు, నీ కమిషన్లకు టైం సరిపోవడం లేదు.. ఇంక నువ్వు విద్యార్థులను ఎలా పట్టించుకుంటావు. 61 సార్లు ఢిల్లీకి పోవడానికి టైం ఉంది కానీ ఆసుపత్రి పాలయిన విద్యార్థులను పరామర్శించడానికి టైం లేదా.. అని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ఎటు పోయిండు? ఆరు గ్యారెంటీలకు నాది జిమ్మెదారి అన్న రాహుల్ గాంధీ ఎటు పోయిండు? ఈరోజు రాష్ట్రంలో దాదాపు 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాహుల్ గాంధీ రాడు. 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రాడు. 116 మంది విద్యార్థులు చనిపోతే రాడు. 42% రిజర్వేషన్ కోసం బీసీలు పోరాటం చేస్తున్నా రాడు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా ముఖం చాటేసి, ఈరోజు ఫుట్ బాల్ చూడడానికి వస్తున్నాడు. రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వచ్చి రేవంత్ రెడ్డి ఆడే ఫుట్బాల్ చూసి పరవశిస్తాడంట. కలుషిత ఆహారంతో కడుపునొప్పి భరించలేక ఏడుస్తున్న విద్యార్థుల కన్నీళ్లు చూడు రాహుల్ గాంధీ. గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం తిని ఆగమైతుంటే, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగే తెలివి, బాధ్యత లేదా అని ప్రశ్నించారు.