త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | శ్ర‌మ ఫ‌లితం మాది.. శిలాఫ‌ల‌కం రేవంత్‌ది.. సీఎం సిద్దిపేట ప‌ర్య‌ట‌న‌పై హ‌రీశ్‌రావు బ‌హిరంగ లేఖ‌..!

Harish Rao | సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు క్యాంపు కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనను, సిద్దిపేటపై కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు తీరును ఎండగడుతూ సీఎంకు బ‌హిరంగ లేఖ‌ను విడుద‌ల చేశారు.

P

Telangana | Published On Mar 21, 2026, 2.52 pm IST

Harish Rao | శ్ర‌మ ఫ‌లితం మాది.. శిలాఫ‌ల‌కం రేవంత్‌ది.. సీఎం సిద్దిపేట ప‌ర్య‌ట‌న‌పై హ‌రీశ్‌రావు బ‌హిరంగ లేఖ‌..!
Advertisement

Harish Rao | సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు క్యాంపు కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనను, సిద్దిపేటపై కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు తీరును ఎండగడుతూ సీఎంకు బ‌హిరంగ లేఖ‌ను విడుద‌ల చేశారు. రెండున్న‌రేళ్ల‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న‌లో నియోజకవర్గానికి కొత్తగా మంజూరైన కార్యక్రమం ఒక్కటీ లేద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో ప్రారంభించబోతున్న కార్యక్రమాలన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసి, నిధులు కేటాయించి, నిర్మాణాలు పూర్తి చేసిన‌వేన‌న్నారు. శ్ర‌మ ఫ‌లితం త‌మ‌ద‌ని, శిలాఫ‌ల‌క‌లం రేవంత్‌రెడ్డిద‌న్నారు. శిలాఫలకాలపై రేవంత్ పేరు ఉండొచ్చ‌ని.. కానీ, సిద్దిపేట ప్రజల మనోఫలకాల మీద ఉండేది మాత్రం కేసీఆర్ పేరేన‌న్నారు. రూ.300 కోట్లతో నర్మెట్టలో ప్రారంభించబోతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఘ‌న‌తేన‌న్నారు.

దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ రావడానికి, రిఫైనరీ పెట్టడానికి తాము నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, టీజీఐసీ ద్వారా 62 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చామ‌ని తెలిపారు. రైతులను స్వయంగా ఒప్పించి మొక్కలు నాటించ‌మ‌ని గుర్తు చేశారు. నాడు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఎగతాళి చేసిన రేవంత్ రెడ్డి.. ఇవాళ అదే కాళేశ్వరం జలాలతో నడిచే ఫ్యాక్టరీని ప్రారంభించడం శోచనీయ‌మ‌న్నారు. ఈ ఫ్యాక్టరీ కోసం కాలువ పొడిగించి 20 కోట్ల లీటర్ల సామర్థ్యం గల చెరువును నిర్మించి నీరందించింది తామేన‌న్నారు. పక్కనే పారుతున్న కాళేశ్వరం కాలువ నీళ్లను నెత్తిన జల్లుకుని ఫ్యాక్టరీని ప్రారంభించాల‌ని సూచించారు. కాళేశ్వరం, మల్లన్న సాగర్ కట్టేటప్పుడు ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేసి ఎన్ని కుట్రలు చేసినా.. మొక్కవోని దీక్షతో ప్రాజెక్టును పూర్తి చేసి ఈ నేలకు జలాలను అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిద‌న్నారు.

ఆరోగ్య శాఖ మంత్రిగా నాడు తాను మంజూరు చేసి, నిర్మాణాలు పూర్తి చేసిన భవనాలకు ముఖ్యమంత్రి ఇవాళ రిబ్బన్ కటింగ్ చేస్తున్నార‌న్నారు. రూ.3.60 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోర్, రూ.25 కోట్లతో ఆయుష్ ఆస్పత్రి, గట్ల మల్యాలలో రూ. 1.40 కోట్లతో పీహెచ్‌సీ, సిద్దిపేట పట్టణంలో అర్బన్ పీహెచ్‌సీ భవనాలు కట్టింది తామేన‌న్నారు. ఎన్నికల కోడ్ వల్ల ప్రారంభానికి నోచుకోకపోయినా ఇప్పటికే సేవలందిస్తున్నాయ‌ని, సిబ్బందిని నియమించకుండానే వాటికి శిలాఫలకాలు వేసుకోవడం సిగ్గుచేట‌న్నారు. దేవాలయాలు, విద్యాలయాలతో పాటు రూ. 78 కోట్లతో, 30 ఎకరాల స్థలంలో జిల్లా జైలును నిర్మించింది కూడా తామేన‌న్నారు. అమృత్ ఫేజ్-2 కింద కేంద్రం నుంచి సాధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా బీఆర్ఎస్ హయాంలో మంజూరైనవే. మేం కట్టిన భవనాలకు శిలాఫలకాలు వేసుకోవడానికే ఈ ముఖ్యమంత్రి పర్యటన అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఎన్నికల ముందు దేవుళ్ల మీద ఒట్లు పెట్టిన రేవంత్ రెడ్డి.. రుణమాఫీ పేరిట రైతులను దారుణంగా మోసం చేశార‌న్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఇంకా 52 శాతం మందికి, అంటే 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేద‌ని, రూ. 300 కోట్ల బకాయిలున్నాయ‌ని తెలిపారు. సీఎం పర్యటిస్తున్న నర్మెట్ట గ్రామంలోనే 350 మంది రైతులకు మాఫీ కాలేద‌ని, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేట పర్యటనకి వస్తున్నార‌ని ఆరోపించారు. వరుసగా మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టార‌ని, ఆగిన మూడు సీజన్ల రైతుబంధు బకాయిలు వెంటనే విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. 2024 - 25ఏ ప్రిల్ నెలలో వడగండ్ల వానకు నష్టపోయిన సిద్దిపేట రైతులకు వెంటనే పంట నష్టపరిహారం, బీమా అందించాల‌ని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి అయ్యాక సిద్దిపేట అభివృద్ధిపై కక్షగట్టి రూ.1070 కోట్ల పనులను రేవంత్ రెడ్డి రద్దు చేశార‌ని హ‌రీశ్‌రావు ఆరోపించారు. సగం పనులైన ప్రభుత్వ వెటర్నరీ కాలేజీని ఇక్కడి నుంచి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు ఎత్తుకుపోయార‌ని, ఇది ముఖ్యమంత్రి స్థాయికి తగిన పనేనా? అని నిల‌దీశారు. సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్నది నేనే అని చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారా? అంటూ ప్ర‌శ్నించారు. రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్ట్, కోమటి చెరువుపై శిల్పారామం, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్ , అగ్రికల్చర్ కాలేజీ, మిట్టపల్లి ఎస్సీ గురుకులం, సిద్దిపేట స్పోర్ట్స్ స్టేడియం, టూ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లు, సిద్దిపేట-ఇల్లంతకుంట, సిద్దిపేట-కిష్టాపూర్ ఫోర్ లేన్ రోడ్లు, ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను అర్ధాంతరంగా ఆపేశారన్నారు. కేవలం రాజకీయ కక్షతో రద్దు చేసిన ఈ రూ. 1070 కోట్ల పనులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement