త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Groundwater | రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌లు.. ప‌డిపోతున్న భూగ‌ర్భజ‌లాలు

Groundwater | రాష్ట్రంలో ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడో ముఖం చాటేసిన వ‌ర‌ణుడు మ‌ళ్లీ ప‌ల‌క‌రించ‌లేదు. యాసంగి సీజ‌న్ మొద‌లైంది. వ్య‌వ‌సాయ ప‌నుల‌కు నీటి వినియోగం ఎక్కువ‌వుతున్న‌ది. దీంతో భూగ‌ర్భ జ‌లాలు (Groundwater) అంత‌కంత‌కూ ప‌డిపోతున్నాయి.

G

Telangana | Published On Feb 9, 2026, 6.32 am IST

Groundwater | రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌లు.. ప‌డిపోతున్న భూగ‌ర్భజ‌లాలు
Advertisement

Groundwater | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడో ముఖం చాటేసిన వ‌ర‌ణుడు మ‌ళ్లీ ప‌ల‌క‌రించ‌లేదు. యాసంగి సీజ‌న్ మొద‌లైంది. వ్య‌వ‌సాయ ప‌నుల‌కు నీటి వినియోగం ఎక్కువ‌వుతున్న‌ది. దీంతో భూగ‌ర్భ జ‌లాలు (Groundwater) అంత‌కంత‌కూ ప‌డిపోతున్నాయి. వాన‌లు పూర్తిగా తగ్గిపోవడంతో భూమిలోకి నీరు ఇంకే శాతం కూడా ప‌డిపోయింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో సగటు భూగర్భ జల మట్టం (Water Level) నెలకు దాదాపు మీటరు వరకు తగ్గుతున్న‌ది.

గ‌తేడాది డిసెంబర్‌లో 5.30 మీటర్లు ఉండగా, గ‌త నెల‌లో 6.27 మీటర్లుగా నమోద‌య్యింది. ఈ రెండు నెలల మధ్య మట్టాన్ని పోల్చితే 0.97 మీటర్లు పడిపోయింది. అంతకుముందు నవంబర్‌, డిసెంబర్‌ నెలల మధ్య పోల్చితే 0.89 మీటర్లు తగ్గింది. అంటే డిసెంబ‌బ‌ర్, జ‌న‌వ‌రి నెల‌ల మ‌ధ్య నీటి మ‌ట్టం మ‌రింత‌గా ప‌డిపోయింది. అయితే ఇది సాధారణమైనప్పటికీ వేసవికాలం, వ్య‌వ‌సాయానికి, గృహ‌, ప‌రిశ్ర‌మ‌ల అవ‌స‌రాల‌కు నీటి వినియోగం పెరిగే అవ‌కాశం ఉండంతో భూగ‌ర్భ జ‌లాలు మరింత లోతుకు వెళ్లే అవకాశం ఉంది. వ‌చ్చేది వేస‌వి కాలం కావ‌డంతో నీటిని పొదుపుగా వాడుకోవాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఖమ్మం జిల్లాలో నీటిమట్టం ఉపరితల నుంచి 3.50 మీటర్లలో ఉంది. ఇక వికారాబాద్‌ జిల్లాలో అత్యంత లోతులో 9.82 మీటర్ల వద్ద ఉండ‌టం గ‌మ‌నార్హం. మ‌రో 12 జిల్లాల్లో 5 మీటర్లపైన, 21 జిల్లాల్లో 5-10 మీటర్ల మధ్య ఉన్న‌ది.

డిసెంబరుతో జనవరి నీటి మట్టాలను పోల్చితే అన్ని జిల్లాల్లోనూ నిటిమ‌ట్టం ప‌డిపోయింది. అత్య‌ధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 2.36 మీటర్లకు పడిపోగా, కామారెడ్డి జిల్లాలో 1.72, మెదక్‌ 1.57, సిద్దిపేట 1.58, వికారాబాద్‌ 1.48, సంగారెడ్డి 1.43, మహబూబ్‌నగర్‌ 1.30 మీటర్ల లోతుకు భూగ‌ర్భ జ‌లాలు చేరుకున్నాయి. కాగా, రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 851 మిల్లీమీటర్లుగా న‌మోద‌వుతుంది. అయితే గతేడాది జూన్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 1,178 మిల్లీమీట‌ర్లుగా నమోదైంది. అంటే 37 శాతం ఎక్కువ వ‌ర్ష‌పాతం రికార్డ‌యింది.

Advertisement
Advertisement