త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్ స‌రికొత్త మైలురాయి.. సుందర్‌బన్ అడవుల్లో హరిత వికాసం

Green India Challenge | పచ్చటి వనాలతోనే భవిష్యత్తు తరాలు సురక్షితంగా ఉంటాయన్న భావనతో తెలంగాణ సాధకుడు కేసీఆర్ (KCR) చేపట్టిన హరితహారం (Haritha Haram) స్ఫూర్తిగా సాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge) ఉద్యమం నేడు మరో సరికొత్త మైలు రాయిని చేరుకుంద‌ని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కులు, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ (Santhosh Kumar) అన్నారు.

G

Telangana | Published On Jun 10, 2026, 9.27 am IST

Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్ స‌రికొత్త మైలురాయి.. సుందర్‌బన్ అడవుల్లో హరిత వికాసం
Advertisement

Green India Challenge | త్రినేత్ర‌.న్యూస్‌: పచ్చటి వనాలతోనే భవిష్యత్తు తరాలు సురక్షితంగా ఉంటాయన్న భావనతో తెలంగాణ సాధకుడు కేసీఆర్ (KCR) చేపట్టిన హరితహారం (Haritha Haram) స్ఫూర్తిగా సాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge) ఉద్యమం నేడు మరో సరికొత్త మైలు రాయిని చేరుకుంద‌ని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కులు, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ (Santhosh Kumar) అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్ అడవుల్లో (Sundarbans Forest) చేపట్టిన హరిత వికాసం సత్ఫలాలనిచ్చిందని చెప్పారు. కేసీఆర్ పుట్టినరోజైన ఫిబ్రవరి 17 (2026)న సుందర్ బన్ డెల్టా ప్రాంతంలో నాటిన 20వేల మాంగ్రూవ్ మొక్కలు దాదాపు 3 అడుగుల ఎత్తు వరకు ఎదిగి హరిత వనంగా కళకళలాడుతున్నదని వెల్ల‌డించారు. 3 నెలల క్రితం తాము నాటిన 20వేల మొక్కల ఎదుగుదలను మంగళవారం (2026 జూన్ 9న) మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్ నేతృత్వంలోని గ్రీన్ ఇండియా చాలెంజ్ బృందం సందర్శించింది. అక్క‌డ నాటిన వేలాది మడ మొక్కలు కేవ‌లం మూడు నెల‌ల్లో దాదాపు 3 అడుగుల ఎత్తుకు ఎదిగి పచ్చగా కళకళలాడుతున్నట్లు గుర్తించింది.

అతి పెద్ద మడ అడవులు

సుంద‌ర్‌బన్ అడవులు ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవుల సమూహం. ఇవి బంగాళాఖాతంలో గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా నదుల డెల్టా ప్రాంతంలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య విస్తరించి ఉన్నాయి. ప్రత్యేకమైన జీవవైవిధ్యానికి, అద్భుతమైన సహజ సౌందర్యానికి ఈ ప్రాంతం పెట్టింది పేరు. ఈ మడ అడవులు తీరానికి గొప్ప రక్షణ కలిగిస్తూ గ్రీన్ ఆర్మ్ పాత్రను పోషిస్తున్నాయి. తుఫాన్ల నుంచి తీరాన్ని కాపాడడం, అలల తీవ్రతను అడ్డుకోవడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో ఈ మడ అడవుల పాత్ర ఎనలేనిది. అందుకే ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

కాగా, పర్యావరణ పరిరక్షణను తమ బాధ్యతగా భావించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ బృందం కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న సుందర్‌బన్ లో 20 వేల మొక్కలు నాటి వాటికి జియో ట్యాగ్ కూడా చేసింది. మొక్కలు నాటిన రోజున తీసిన ఫోటోలకు, ప్రస్తుత చిత్రాలకు మధ్య ఉన్న వ్యత్యాసం.. కేవలం కొన్ని నెలల్లోనే సాధించిన అసాధారణ ప్రగతిని స్పష్టం చేస్తోంది. శాస్త్రీయమైన పద్ధతులు, క్రమబద్ధమైన పర్యవేక్షణ, సామాజిక భాగస్వామ్యంతో చక్కటి ఫలితాలను సాధించవచ్చని ఈ బృందం సంతోషం వ్య‌క్తం చేసింది.

 

ధరిత్రిని పచ్చటి తోటలుగా మార్చగలిగితే..

`మనం నాటే ప్రతి మొక్క..భవిష్యత్తుకు ఓ గొప్ప నమ్మకాన్ని ఇస్తుంది. జీవితంపై ఆశను కలిగిస్తుంది. అది పెరిగి పెద్దదై చల్లటి గాలి చక్కటి నీడనిస్తుంది. ఒక్కొక్కరం కలిసి సామూహికంగా ధరిత్రిని పచ్చటి తోటలుగా మార్చగలిగితే ప్రకృతి రూపురేఖలు మారిపోతాయి. రాబోయే తరాలకు సుస్థిరమైన ఆరోగ్యమైన భవిష్యత్తును అందిస్తాయి. మనమందరం చేయగలిగేది... పచ్చని చెట్లతో భవిష్యత్తు తరాలకు ఆరోగ్యమైన జీవనాన్ని అందించడమే` అని సంతోష్ కుమార్ అన్నారు.

గ్రీన్ ఇండియా అవిశ్రాంత కృషి

కేసీఆర్ మానస పుత్రిక అయిన హరిత హారం కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశమంతటా ఏదో ఒక రూపంలో అనేక హరిత వికాస చర్యలకు స్పూర్తినిచ్చింది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా.. భవిష్యత్ తరాలకు మేలు చేసే ఒక చక్కటి బాధ్యతను తీసుకున్నారు. 2018లో గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో హరిత ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ పర్యావరణ ఉద్యమం కోట్లాది విత్తనాలను అడవుల్లో నాటింది. యువత.. విద్యార్థులతో మమేకమై కోట్ల మొక్కలకు ప్రాణం పోసింది. ఈ ఉద్యమంలో యువత, ప్రజాప్రతినిధులు, ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్లు, పౌర సమాజాన్ని సైతం భాగస్వాములను చేసి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా 195 మిలియన్ మొక్కలు నాటడంతో పాటు 20,000కు పైగా జలవనరులకు పునరుజ్జీవం కలిగించగలిగారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కేవలం చెట్లు నాటడానికే పరిమితం కాకుండా.. వాటిని పెంచి, సంర‌క్షించ‌డంపైనే ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించింది. నిజమైన విజయం కేవలం చెట్లు నాటడంలోనే కాకుండా.. అవి బ్రతికేలా చూడటంలోనే ఉందనే నమ్మకాన్ని ఇది బలపరుస్తోంది. సుంద‌ర్‌బ‌న్ మడ అడ‌వుల్లో చెట్ల పెంప‌కంలో సాధించిన విజ‌యం ఈ బృహ‌త్ దృక్పథానికి ప్రతిబింబం. జియో-ట్యాగింగ్, నిరంతర పర్యవేక్షణ ద్వారా సాంకేతిక ప‌రిజ్క్షానాన్ని ఉప‌యోగించి చేప‌ట్టిన వ్యూహాత్మ‌క అడ‌వుల పెంప‌కం. ప‌ర్యావ‌ర‌ణంలో ఎంత‌టి సానుకూల మార్పుల‌ను తీసుకురాగ‌ల‌దో గ్రీన్ ఇండియా చాలెంజ్ చేసిన ప్రయత్నం నిరూపించింది.

 

ప్రపంచమంతా విస్తరించాలి: ఇగ్నైటెడ్ మైండ్స్

గ్రీన్ ఇండియా చాలెంజ్.. సుందర్‌బన్ లో మడ అడవుల పెంపకానికి చేసిన ప్రయత్నం యావత్ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని పంపుతుందని పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ఇగ్నైటెడ్ మైండ్స్ ప్రశంసలు కురిపించింది. మడ అడవుల ఎదుగుదలను పరిశీలించిన అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. వాతావరణ పరిరక్షణ చర్యలు ఒక నిరంతర ప్రజా ఉద్యమంగా మారాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. బ‌తికున్న ప్రతి చెట్టు పచ్చని, చల్లని, మరింత పటిష్టమైన భవిష్యత్తుకు దోహదపడుతుంద‌ని కొనియాడారు. వాతావ‌ర‌ణ మార్పుల‌తో భార‌త్‌, ప్రపంచం అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్న స‌మ‌యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి కార్య‌క్ర‌మాలు సామూహికంగా ప‌ర్యావ‌ర‌ణ పున‌రుద్ధ‌ర‌ణ‌కు ఆచ‌ర‌ణాత్మ‌క‌మైన‌, విస్త‌రించ‌ద‌గిన న‌మూనాను అందిస్తాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. నేడు సుందర్‌బ‌న్‌లో అభివృద్ధి చెందుతున్న మడ అడవులు కేసీఆర్ పర్యావరణ దార్శనికతకు నిదర్శనంగా నిలవడమే కాకుండా, సంతోష్ కుమార్ జోగినపల్లి నాయకత్వానికి, ఈ ఉద్యమంలో చేరిన లక్షలాది పౌరుల సామూహిక కృషికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయ‌ని వారు కొనియాడారు.

ముఖ్యమైన విషయాలు

1) సుందర్ బన్ మడ అడవుల్లో ఫిబ్రవరి 17న 20వేల మొక్కలు నాటి జియో ట్యాగ్ చేశారు
2) తెలంగాణ సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్‌కు హరిత వందనం సమర్పించే కార్యక్రమంలో భాగంగా ఈ మొక్కలు నాటారు.
3) ఆ మొక్కలను నేడు (2026 జూన్ 9) గ్రీన్ ఇండియా చాలెంజ్ బృందం సందర్శించింది.
4) ఆ మొక్కలన్నీ మూడు అడుగుల ఎత్తుకు ఎదిగి కళకళలాడుతున్నాయి
5) ప్రతి మొక్కకు జియో ట్యాగ్ చేశారు
6) మాజీ ఎంపీ సంతోష్ కుమార్ నేతృత్వంలో 2018లో గ్రీన్ ఇండియా చాలెంజ్ మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 19.60 కోట్ల మొక్కలు నాటించింది
7) గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం ప్రస్తుతం ప్రపంచంలోనే జరుగుతున్న అతి ముఖ్యమైన హరిత ఉద్యమాల్లో ఒకటిగా పేరు దక్కించుకున్నది.

Advertisement
Advertisement